త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TCS Nashik Case | నేను ప్రెగ్నెంట్ ముంద‌స్తు బెయిల్ ఇవ్వండి..! నాసిక్ కోర్టులో నిదా ఖాన్ పిటిష‌న్‌..!

TCS Nashik Case | నాసిక్ టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీస్ (టీసీఎస్)లో వెలుగులోకి వచ్చిన లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉంది. ప్ర‌స్తుతం ఆమె ముంబ‌యిలో త‌ల‌దాచుకుంటున్న‌ట్లుగా స‌మాచారం.

P

National | Published On Apr 17, 2026, 4.17 pm IST

TCS Nashik Case | నేను ప్రెగ్నెంట్ ముంద‌స్తు బెయిల్ ఇవ్వండి..! నాసిక్ కోర్టులో నిదా ఖాన్ పిటిష‌న్‌..!
Advertisement

TCS Nashik Case | నాసిక్ టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీస్ (టీసీఎస్)లో వెలుగులోకి వచ్చిన లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉంది. ప్ర‌స్తుతం ఆమె ముంబ‌యిలో త‌ల‌దాచుకుంటున్న‌ట్లుగా స‌మాచారం. అయితే, ఆమె ప్రెగ్నెంట్ అని కుటుంబం తెలిపింది. అదే స‌మ‌యంలో నిదా ఖాన్ నాసిక్‌లోని స్థానిక కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. తాను ప్రెగ్నెంట్ అని, ఆరోగ్య పరిస్థితిని కారణంగా చూపుతూ అరెస్టును తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గాలింపు చర్యలు చేప‌ట్టింది.

తీవ్రంగా స్పందించిన సీఎం ఫ‌డ్న‌విస్‌..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌విస్ ఈ వ్య‌వ‌హారంపై తీవ్రంగా స్పందించారు. టీసీఎస్ లైంగిక వేధింపులు, బ‌ల‌వంత‌పు మ‌త‌మార్పిడి ఆరోపణలు తీవ్ర‌మైన‌వ‌న్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది పక్కా ప్రణాళికతో నడిచిన ‘మాడ్యూల్’గా కనిపిస్తోందని పేర్కొన్నారు. విచారణలో పూర్తి సహకారం అందిస్తున్న టీసీఎస్ యాజమాన్యాన్ని ప్ర‌శంసించారు. నిందితులను కాపాడే ప్రయత్నం చేయలేదని తెలిపారు. ఈ కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించినట్లు సీఎం వెల్లడించారు. ఇప్పటివరకు ఈ వ్య‌వ‌హారంలో నాసిక్ పోలీసుల‌కు తొమ్మిది ఫిర్యాదులు అంద‌గా.. కేసులు న‌మోదు చేశారు. బాధిత మహిళా ఉద్యోగులు 2022 నుంచి 2026 మార్చి వరకు తమపై లైంగిక, మాన‌సిక‌, శారీర‌కంగా వేధించార‌ని ఆరోపించారు. దర్యాప్తులో వేధింపుల విష‌యంలో స్పష్టమైన మోడ‌ల్ బయటపడినట్లు పోలీసులు తెలిపారు.

కేసు నేపథ్యం ఇదీ..

25 ఏళ్ల నిదా ఖాన్ 2021లో నాసిక్‌లోని టీసీఎస్ బీపీవోలో ఉద్యోగంలో చేరింది. ప్రస్తుతం నాసిక్ పోలీసులు లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలపై విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో ఆరుగురు పురుషులు, మ‌రో మ‌హిళా హెచ్ ఆర్ స‌హా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఇంకా నిదా ఖాన్‌ను అరెస్టు చేయాల్సి ఉంది. సిట్ నివేదిక ప్రకారం.. ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు తమపై ఉన్నతాధికారులు మానసిక, లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లుగా ఆరోపించారు. 2022 ఫిబ్రవరి నుంచి 2024 మార్చి ఈ వేధింపులు జ‌రిగాయ‌ని పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని హెచ్ఆర్ విభాగం దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని బాధితులు తెలిపారు. ఓ నిందితుడు వివాహం పేరుతో మ‌హిళా ఉద్యోగిని మోసం చేసి శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అసభ్య వ్యాఖ్యలు, వ్యక్తిగత జీవితంపై అవమానకర వ్యాఖ్యలు చేసినట్లుగా ఫిర్యాదులో బాధితులు వెల్ల‌డించారు. ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేస్తే చ‌ర్య‌లు తీసుకోవాల్సింది పోయి.. నిందితుల‌కే వ‌త్తాసు ప‌లికిన‌ట్లుగా ఆరోపించారు. పోలీసుల ప్రకారం.. నిందితులు మ‌హిళా ఉద్యోగులు మాత్ర‌మే కాకుండా మ‌రో వ్య‌క్తిని న‌మాజ్ చేయాల‌ని ఒత్తిడి చేశార‌ని, స‌ద‌రు ఉద్యోగి మతాన్ని సైతం అవ‌మానించిన‌ట్లుగా విచార‌ణ తేలింది. ప్ర‌స్తుతం ఈ కేసుపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మ‌రం చేశారు.

టీసీఎస్, టాటా సన్స్ స్పందన

ఈ ఘటనపై టీసీఎస్ స్పందించింది. సంస్థలో వేధింపులపై ‘జీరో టాలరెన్స్’ విధానం అమల్లో ఉందని తెలిపింది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్ర‌శేఖ‌ర‌న్ ఆరోప‌ణ‌ల‌ను విచార‌క‌ర‌మైన‌వ‌న్నారు. టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర‌తి సుబ్ర‌మ‌ణియ‌న్ నేతృత్వంలో అంత‌ర్గ‌త విచార‌ణ ప్రారంభించిన‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది. ఇప్ప‌టికే నిందితుల‌ను ఉద్యోగాల నుంచి స‌స్పెండ్ చేసింది. పోలీసు దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తున్నామని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని సంస్థ హామీ ఇచ్చింది.

Advertisement
Advertisement