త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | హైకోర్టు తీర్పుల్లో జాప్యంపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన సుప్రీంకోర్టు..!

Supreme Court | హైకోర్టు తీర్పులు వెలువ‌రించ‌డంలో జ‌రుగుతున్న జాప్యంపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఇది న్యాయవ్యవస్థలోనే ఒక “గుర్తించదగిన వ్యాధిగా” మారిందని, దీన్ని ఇకపై పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.

P

National | Published On Feb 3, 2026, 5.56 pm IST

Supreme Court | హైకోర్టు తీర్పుల్లో జాప్యంపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన సుప్రీంకోర్టు..!
Advertisement

Supreme Court | హైకోర్టు తీర్పులు వెలువ‌రించ‌డంలో జ‌రుగుతున్న జాప్యంపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఇది న్యాయవ్యవస్థలోనే ఒక “గుర్తించదగిన వ్యాధిగా” మారిందని, దీన్ని ఇకపై పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. సకాలంలో న్యాయం అందకపోవడం అంటే న్యాయ నిరాకరణేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఝార్ఖండ్ హైకోర్టుకు సంబంధించిన పిటిష‌న్‌ను సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, విపుల్ ఎం పంచోలీతో ధ‌ర్మాస‌నం విచారించింది. గ‌తేడాది డిసెంబ‌ర్ 4న హైకోర్టు మౌఖింగా పిటిష‌న్‌ను కొట్టివేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చినా.. నెల‌లు గ‌డుస్తున్నా రాత‌పూర్వ‌క తీర్పును వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయ‌లేద‌ని పిటిష‌న‌ర్ ఆరోపించారు.

జాప్యానికి ఎలాంటి స‌మ‌ర్థ‌న లేద‌న్న సుప్రీంకోర్టు.. వ‌చ్చేవారంలోగా పూర్తి తీర్పును సంబంధిత పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాదికి అందుబాటులో ఉండేలా చూడాల‌ని ఆదేశించింది. కేసు విచార‌ణ‌ను ఈ నెల మూడోవారానికి జాబితా చేయాల‌ని ఆదేశించింది. పిటిష‌న్‌పై విచార‌ణ సంద‌ర్భంగా సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలోని ఈ సమస్యను నిర్లక్ష్యం చేయలేమన్నారు. “కొంతమంది న్యాయమూర్తులు ఎంతో కష్టపడి అనేక కేసులు వింటారు. తీర్పులు రిజర్వ్ చేస్తారు. కానీ ఆ తర్వాత వాటిని దీర్ఘ‌కాలం వెలువరించకుండా ఉంటారు. ఇది వ్యక్తిగత ఆరోపణ కాదు. మొత్తం న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాల్‌. ఇది ఒక వ్యాధి. దీన్ని విస్తరించనివ్వకూడదు” అని వ్యాఖ్యానించారు. వాదనలు పూర్త‌య్యాక తర్వాత కూడా కొన్ని కేసులను పదేపదే ‘మరిన్ని ఆదేశాల కోసం’ జాబితాలో పెడుతూ అనవసర న్యాయపోరాటాలకు దారితీస్తున్నారని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. తన అనుభవాన్ని ప్రస్తావిస్తూ, “హైకోర్టు న్యాయమూర్తిగా 15 ఏళ్ల కాలంలో.. నేను ఎప్పుడూ తీర్పును రిజర్వ్ చేసి మూడు నెలలకు మించి ఇవ్వకుండా ఉంచలేదు” అని చెప్పారు.

పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ, “ఇది కేవలం ఒక ఫార్మాలిటీగా మారినట్టుగా ఉంది. బలమైన సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది చట్ట గౌరవాన్ని దెబ్బతీసే చర్య”గా పేర్కొన్నారు. ఈ అంశాన్ని త్వరలో జరిగే హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో ప్రస్తావిస్తానని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు. వీటికి ముగింపు పలికే పరిష్కారం కోసం చ‌ర్చిస్తామ‌న్నారు. ఇదిలా ఉండగా గ‌తేడాది న‌వంబ‌ర్‌లో అన్ని హైకోర్టులు రిజర్వ్ చేసిన తీర్పులపై సమగ్ర నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తీర్పు రిజర్వ్ చేసిన తేదీ, ప్రకటించిన తేదీ, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన తేదీ వంటి వివరాలను స్పష్టంగా పేర్కొనాలని ఆదేశించింది.

Advertisement
Advertisement