త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sabarimala Case | శబరిమల మహిళల ప్రవేశం కేసు.. తీర్పు రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు

P

National | Published On May 14, 2026, 9.30 pm IST

Sabarimala Case | శబరిమల మహిళల ప్రవేశం కేసు.. తీర్పు రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు
Advertisement

Sabarimala Case | శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశ హక్కుతో పాటు వివిధ మత ప్రార్థనా స్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన కేసు విచార‌ణ‌ను సుప్రీంకోర్టు ముగించింది. ఈ అంశంపై తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు గురువారం ప్రకటించిన రాజ్యాంగ ధర్మాసనం, మే 29లోగా పక్షాలు తమ లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును 16 రోజులపాటు విస్తృతంగా విచారించింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహత్గీ, ఇందిరా జైసింగ్‌తో పాటు ప‌లువురు న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపించారు.

శబరిమల ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల ప్రవేశంపై అమల్లో ఉన్న నిషేధాన్ని 2018లో సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 4:1 మెజారిటీతో రద్దు చేసిన విషయం తెలిసిందే. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం రాజ్యాంగ విరుద్ధమని, మహిళలకు ఆలయ ప్రవేశం నిరాకరించడం సమానత్వ హక్కుకు భంగం కలిగించడమేనని అప్పట్లో కోర్టు అభిప్రాయపడింది. అయితే, ఆ తీర్పుపై అనేక రివ్యూ పిటిషన్లు దాఖ‌ల‌య్యాయి. 2019లో అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ వ్యవహారాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. శబరిమలతో పాటు ముస్లిం మహిళలకు మసీదులు, దర్గాల్లో ప్రవేశం, పార్సీ మహిళల అగియారీ ప్రవేశం వంటి ఇతర మత సంబంధిత అంశాలను కూడా విచారణ పరిధిలోకి తీసుకువ‌చ్చారు.

విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తమ లిఖిత వాదనల్లో శబరిమల ఆచారం పూర్తిగా మత విశ్వాసాలకు సంబంధించినదని, కోర్టులు మతాచారాల్లో జోక్యం చేసుకోవద్దని అభిప్రాయపడింది. మరోవైపు మహిళల హక్కులు, సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణ అంశాలను పిటిషనర్లు ప్రస్తావించారు. ఇదిలా ఉండగా, ఇటీవల ఈ వ్యవహారానికి సంబంధించి దాఖలైన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దేశంలో ఎన్నో ప్రజా సమస్యలు ఉండగా, పత్రికా కథనాల ఆధారంగా ఇలాంటి పిటిషన్లు ఎందుకు వేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయొద్దని పిటిషనర్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఇవ్వబోయే తుది తీర్పుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Advertisement
Advertisement