త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | ఐసీయూల్లో ఒకేర‌క‌మైన ప్ర‌మాణాలుండాలి.. ప్ర‌ణాళిక రూపొందించాల‌ని రాష్ట్రాల‌కు సుప్రీం ఆదేశం..!

Supreme Court | దేశవ్యాప్తంగా ఐసీయూ సదుపాయాల మెరుగుదల కోసం సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కనీస ప్రమాణాల అమలుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించింది.

P

National | Published On Apr 25, 2026, 4.21 pm IST

Supreme Court | ఐసీయూల్లో ఒకేర‌క‌మైన ప్ర‌మాణాలుండాలి.. ప్ర‌ణాళిక రూపొందించాల‌ని రాష్ట్రాల‌కు సుప్రీం ఆదేశం..!
Advertisement

Supreme Court | దేశ‌వ్యాప్తంగా ఐసీయూల్లో సేవ‌ల‌పై సుప్రీంకోర్టు శనివారం కీల‌క ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఐసీయూల్లో క‌నీస ప్ర‌మాణాల‌ను అమ‌లు చేసేలా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని ఆదేశించింది. న్యాయమూర్తులు అహ్సానుద్దీన్ అమానుల్లా, ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఉత్త‌ర్వుల్లో ఐసీయూ సేవ‌ల నిర్వ‌హ‌ణ‌, అమలుకు సంబంధించి రూపొందించిన మార్గదర్శకాలు ఇప్పటికే విస్తృతంగా ఆమోదం పొందాయని పేర్కొంది. మార్గదర్శకాల అమలుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య, వైద్య విద్య‌శాఖ‌ల అద‌న‌పు ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు తక్షణం నిపుణులతో సమావేశం ఏర్పాటు చేసి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించింది.

ఐదు కీల‌క అంశాల‌కు ప్రాధాన్యం ఇవ్వాలి..

ఆ ప్రణాళిక ప్రాతిపదికగా అమల‌య్యేలా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రూపొందించాలని సూచించింది. ప్రారంభ దశలో మానవ వనరులు, శిక్షణ పొందిన సిబ్బంది, పరికరాలు, లాజిస్టిక్స్, అవసరమైన మౌలిక సదుపాయాల వంటి ఐదు కీలక అంశాలను గుర్తించి ప్రాధాన్యం ఇవ్వాల‌ని ఆదేశించింది. అమలు, పర్యవేక్షణకు స్పష్టమైన విధానాలు ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌క్రియ వెంట‌నే ప్రారంభించి తొలి స‌మావేశాన్ని వారంరోజుల్లో నిర్వ‌హించాల‌ని ఆదేశించింది. రాష్ట్రాలు నివేదిక‌ల‌ను సిద్ధం చేసి కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శికి పంపాల‌ని, అన్ని రాష్ట్రాల‌తో క‌లిసి సంయుక్తంగా స‌మావేశం ఏర్పాటు చేసి తుది ముసాయిదా రూపొందించాల‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సూచించింది.

మ‌ళ్లీ మే 18 విచార‌ణ‌..

త‌దుప‌రి విచార‌ణ‌ను మే 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ సంద‌ర్భంగా కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ సైతం కోర్టు దిశానిర్దేశం చేసింది. కోర్టులో సమర్పించిన మార్గదర్శకాలను అధికారిక అడ్వైజ‌రీగా జారీ చేసి, మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ప్రచురించాలని ఆదేశించింది. కేసు విచారణ సందర్భంగా ఐసీయూ సేవల కోసం నర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ వ‌చ్చాయి. రోగులతో 24 గంటలు ఉండేది నర్సింగ్ సిబ్బందే కావడంతో, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని శిక్షణ బలోపేతం చేయాలని కోర్టు అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో ఇండియ‌న్ న‌ర్సింగ్ కౌన్సిల్‌, పారామెడిక‌ల్ కౌన్సిల్‌ల‌ను కేసులో భాగ‌స్వాముల‌గా చేసింది. ఐసీయూ నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను ఎలా బ‌లోపేతం చేస్తారో తదుప‌రి విచార‌ణ సంద‌ర్భంలో ప్ర‌ణాళిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది.

Advertisement
Advertisement