త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cargo Ship | ఒడిశాతీరంలో నీట మునిగిన కార్గో నౌక‌.. 22 మంది గ‌ల్లంతు

G

National | Published On Aug 23, 2026, 7.29 am IST

Cargo Ship | ఒడిశాతీరంలో నీట మునిగిన కార్గో నౌక‌.. 22 మంది గ‌ల్లంతు
Advertisement

Cargo Ship | త్రినేత్ర‌.న్యూస్‌: ప‌నామా జెండాతో వెళ్తున్న స‌రుకు ర‌వాణా నౌక (Cargo Ship) ప్ర‌మాదవ‌శాత్తు ఒడిశా తీరంలో (Odisha coast) బంగాళాఖాతంలో మునిగిపోయింది. తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఎంవీ ఓషన్ విన్నర్ (MV Ocean-Winner) అనే నౌక‌ సుమారు సుమారు 1,700 టన్నుల ఇనుప ఖనిజాన్ని (iron ore) లోడ్ చేసుకుని ఈ నెల 20న రాత్రి 10.30 గంట‌ల‌కు ఒడిశాలోని పారాదీప్ నుంచి సింగపూర్‌కు (Singapore) బయలుదేరింది. ఈ క్ర‌మంలో శ‌నివారం ఉద‌యం 11.48 గంట‌ల త‌ర్వాత నౌకతో సంబంధాలు తెలిగిపోయాయి. మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (MRC)కి విక్టరీ స్టార్ గ్రూప్ కో లిమిటెడ్ నుంచి సహాయం కోరుతూ సమాచారం అందింది. నౌక చివరిగా పారాదీప్ తీరం నుంచి 200 నాటికల్ మైళ్లకు పైగా దూరంలో నమోదైంది. ప్ర‌మాద స‌మ‌యంలో నౌక‌లో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఇద్ద‌రు క్షేమంగా బ‌య‌ట‌ప‌డ‌గా మ‌రో 22 మంది గ‌ల్లంత‌య్యారు.

గ‌ల్లంతైన‌వారికోసం భారత తీరరక్షక దళం (Indian Coast Guard), భారత నౌకాదళం సంయుక్తంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొన‌సాగిస్తున్నాయి. వరద్, అన్మోల్ అనే కోస్ట్ గార్డ్ నౌకలను రంగంలోకి దించారు. ఆపరేషన్‌కు అదనపు సహకారం అందించేందుకు శ్రీ విజయపురం నుంచి విజిత్ అనే మరో నౌకను కూడా పంపించారు. గ‌ల్లంతైన‌వారిలో చైనాకు చెందినవారు 20 మంది ఉండ‌గా ముగ్గురు మయన్మార్‌, ఒకరు బంగ్లాదేశ్‌కు చెందినవారు ఉన్నారు. నౌక మునిగిపోయిన కచ్చితమైన కారణం ఇంకా తెలియదు. అధికారులు సముద్ర పరిస్థితులు, సాంకేతిక సమస్యలు లేదా ఇతర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాపాడిన ఇద్దరి గుర్తింపు వివరాలు ప్రస్తుతం వెల్లడించలేదు. మిగిలిన 22 మంది సిబ్బందిని వెతకడానికి రాత్రంతా శోధన కొనసాగింది.

 

Advertisement
Advertisement