త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Russia | పాకిస్తాన్‌కు ఘోర అవమానం.. భారత్‌తో వివాదంలో మధ్యవర్తిత్వం వహించబోమన్న రష్యా..!

Russia | భారత్‌-పాకిస్తాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ.. సహాయం కోసం తిరిగే పాకిస్తాన్‌కు రష్యా కఠిన సందేశాన్ని పంపింది. భారత్‌–పాకిస్తాన్‌ వివాదంలో తాము మధ్యవర్తిగా వ్యవహరించబోమని స్పష్టం చేసింది.

P

National | Published On Feb 3, 2026, 10.15 am IST

Russia | పాకిస్తాన్‌కు ఘోర అవమానం.. భారత్‌తో వివాదంలో మధ్యవర్తిత్వం వహించబోమన్న రష్యా..!
Advertisement

Russia | భారత్‌-పాకిస్తాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ.. సహాయం కోసం తిరిగే పాకిస్తాన్‌కు రష్యా కఠిన సందేశాన్ని పంపింది. భారత్‌–పాకిస్తాన్‌ వివాదంలో తాము మధ్యవర్తిగా వ్యవహరించబోమని స్పష్టం చేసింది. రష్యా విదేశాంగ తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌-పాకిస్తాన్‌ తమ మధ్య ఉన్న సమస్యలను పరస్పరంగా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని, రెండు దేశాల్లో ఏదైనా దేశం ప్రత్యేకంగా సహాయం కోరితేనే రష్యా ముందుకు వస్తుందని పేర్కొంది. ఈ ప్రకటన దౌత్యపరంగా భారత్‌కు మద్దతుగా నిలుస్తుండగా.. పాక్‌కు మాత్రం హెచ్చరికగా భావిస్తున్నారు. ఇతర దేశాల తలుపులు తట్టకుండా పాకిస్తాన్‌ స్వయంగా భారత్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని రష్యా స్పష్టంగా సూచించినట్లయ్యింది. అలాగే, 1972 సిమ్లా ఒప్పందం, 1999 లాహోర్‌ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు తమ వివాదాలను పరిష్కరించుకోవాలని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. అంటే, భారత్‌–పాకిస్తాన్‌ సమస్యల్లో రష్యా నేరుగా జోక్యం చేసుకోదన్న విషయం స్పష్టమైంది.

రష్యా ఈ ప్రకటన భారత్‌ కోణంలో చూస్తే ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్‌కు రష్యా రాజకీయంగా మద్దతు ఇవ్వదన్న విషయం ఇప్పుడు స్పష్టమైంది. ఇకపై రష్యా, ఇతర దేశాల సహాయంపై పాక్‌ ఆధారపడకుండా భారత్‌తో నేరుగా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్‌తో తమ రాజకీయ, ఆర్థిక సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయని రష్యా పేర్కొంది. 2025లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మధ్య పలుముఖ్య సమావేశాలు జరిగాయి. సమావేశాల్లో ఇరు దేశాలు పరస్పర సహకారాన్ని పెంచుకోవాలన్న ఆసక్తి వ్యక్తం చేశాయి. ఆర్థిక రంగంలో కూడా పలు ప్రాజెక్టులపై కలిసి పనిచేశాయి.

కరాచీ మెటలర్జికల్‌ ప్లాంట్‌ మరమ్మతులు, ఇన్సులిన్‌ తయారీలో సహకారం, ఇంటర్నేషనల్‌ నార్త్‌ సౌత్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కారిడార్‌ ద్వారా ప్రయోగాత్మక రవాణా వంటి ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. పాకిస్తాన్‌లో చమురు, వాయు రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను రష్యా పరిశీలిస్తోంది. దేశీయంగా ఇంధన సరఫరాను పెంచే దిశగా కూడా చర్యలు తీసుకుంటోంది. మొత్తంగా చూస్తే భారత్‌–పాకిస్తాన్‌ మధ్య రాజకీయ వివాదం పూర్తిగా ద్వైపాక్షికమేనని రష్యా తేల్చి చెప్పింది. ప్రత్యేకంగా సహాయం కోరితే తప్ప జోక్యం చేసుకోబోమన్న తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ పరిణామం దౌత్యపరంగా భారత్‌కు అనుకూలంగా ఉన్నది. అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించే రష్యా, పాకిస్తాన్‌కు మద్దతుగా నిలవకపోవడం భారత్‌కు లాభదాయకంగా మారింది.

Advertisement
Advertisement