త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Worker Killed in Russia | రష్యాపై ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి: భారతీయ కార్మికుడు మృతి, ముగ్గురికి గాయాలు

రష్యా రాజధాని మాస్కో రీజియన్‌పై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ భీకర దాడిలో ఒక భారతీయ వర్కర్ ప్రాణాలు కోల్పోగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

J

International | Published On May 17, 2026, 9.00 pm IST

Indian Worker Killed in Russia | రష్యాపై ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి: భారతీయ కార్మికుడు మృతి, ముగ్గురికి గాయాలు
Advertisement

Indian Worker Killed in Russia | త్రినేత్ర.న్యూస్ : ఉక్రెయిన్, రష్యా (Russia-Ukraine War) మధ్య జరుగుతున్న యుద్ధం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. ఆదివారం రష్యా రాజధాని మాస్కో రీజియన్‌పై ఉక్రెయిన్ జరిపిన భారీ డ్రోన్ దాడిలో (Drone strike) ఒక భారతీయ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మరో ముగ్గురు భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని రష్యాలోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) అధికారికంగా ధృవీకరించింది.

ఎంబసీ అధికారుల పరామర్శ

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎంబసీ అధికారులు స్వయంగా వెళ్లి పరామర్శించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎంబసీ, బాధిత కార్మికులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు స్థానిక అధికారులు, కంపెనీ మేనేజ్‌మెంట్‌తో కలిసి పనిచేస్తున్నట్లు 'ఎక్స్' వేదికగా వెల్లడించింది. అయితే, బాధితుల వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

రష్యాపై 1000కి పైగా డ్రోన్లతో అటాక్

గత కొన్ని నెలల్లో మాస్కోపై ఉక్రెయిన్ చేసిన అత్యంత భారీ డ్రోన్ దాడి ఇదే. ఆదివారం రాత్రి మాస్కోలో ఎయిర్ రెయిడ్ (Air raid) సైరన్లు మోగాయి. ఆకాశంలో ఎటుచూసినా పేలుళ్లు, డ్రోన్ల శకలాలు నివాస ప్రాంతాలపై పడుతున్న దృశ్యాలు భయాందోళనలు సృష్టించాయి. దేశవ్యాప్తంగా 24 గంటల్లో ఏకంగా 1,000కి పైగా ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. మాస్కో వైపు దూసుకొచ్చిన కనీసం 81 డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ (Air defence systems) కూల్చివేసినట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు.

నివాస ప్రాంతాలపై దాడుల ప్రభావం

ఈ దాడుల్లో పలు నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. మాస్కోకు ఉత్తరాన ఉన్న ఖిమ్కీలో డ్రోన్ శకలాలు ఓ ఇంటిపై పడటంతో ఒక మహిళ మరణించగా, మైటిష్చి జిల్లాలో మరో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు మాస్కో రీజినల్ గవర్నర్ ఆండ్రీ వొరోబ్యోవ్ తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని బెల్గోరోడ్ ప్రాంతంలో మరొకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. మాస్కో ఆయిల్ రిఫైనరీ సమీపంలో కొందరు గాయపడినప్పటికీ, ప్లాంట్‌కు ఎలాంటి నష్టం జరగలేదని, అది సురక్షితంగానే ఉందని అధికారులు స్పష్టం చేశారు.

ప్రతీకారమే అన్న జెలెన్‌స్కీ

కీవ్ (Kyiv) నగరంపై రష్యా ఇటీవల చేసిన భీకర దాడులకు ప్రతీకారంగానే ఈ డ్రోన్ దాడులు చేసినట్లు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) స్పష్టం చేశారు. తమ నగరాలు, పౌరులపై రష్యా సాగిస్తున్న దాడులకు తాము ఇస్తున్న సమాధానం పూర్తిగా సమర్థనీయమేనని ఆయన అన్నారు. రష్యా ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్‌ను ఛేదించి మరీ, 500 కిలోమీటర్ల లోపల ఉన్న టార్గెట్లను తాము విజయవంతంగా ఛేదించినట్లు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

అయితే, ఉక్రెయిన్ చర్యలను రష్యా తీవ్రంగా ఖండించింది. ఇదొక "భారీ ఉగ్రవాద దాడి" అని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా మండిపడ్డారు. పౌరులను టార్గెట్ చేయడం లేదని ఇరు దేశాలు చెబుతున్నప్పటికీ, నివాస ప్రాంతాలు నిరంతరం దాడులకు గురవుతూనే ఉండటం ఈ యుద్ధం సృష్టిస్తున్న మరో విషాదం.

Advertisement
Advertisement