త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bengal Assembly Elections | బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఆర్జీ కర్ బాధితురాలి తల్లి.. బీజేపీ మూడో జాబితాలో చోటు

Bengal Assembly Elections | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ హాస్పిట‌ల్ (R.G. Kar Hospital) హత్యాచార ఘటనలో బాధితురాలి తల్లి ఎన్నిక‌ల బ‌రిలో (Bengal Assembly Elections) నిలిచారు. తన కుమార్తెకు న్యాయం చేయడమే లక్ష్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన ఆమెను బీజేపీ (BJP) త‌న అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది.

G

National | Published On Mar 26, 2026, 7.25 am IST

Bengal Assembly Elections | బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఆర్జీ కర్ బాధితురాలి తల్లి.. బీజేపీ మూడో జాబితాలో చోటు
Advertisement

Bengal Assembly Elections | త్రినేత్ర‌.న్యూస్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ హాస్పిట‌ల్ (R.G. Kar Hospital) హత్యాచార ఘటనలో బాధితురాలి తల్లి ఎన్నిక‌ల బ‌రిలో (Bengal Assembly Elections) నిలిచారు. తన కుమార్తెకు న్యాయం చేయడమే లక్ష్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన ఆమెను బీజేపీ (BJP) త‌న అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. 294 స్థానాలున్న‌ ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్‌లో రెండు విడుత‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఇప్ప‌టికే రెండు జాబితాల‌ను ప్ర‌క‌టించిన విప‌క్ష బీజేపీ.. బుధ‌వారం రాత్రి మూడో లిస్ట్ విడుద‌ల చేసింది. అందులో ఆర్జీ క‌ర్ ద‌వాఖాన హ‌త్యాచార బాధితులు అభ‌య (Abhaya) త‌ల్లి ర‌త్నా దేబ్‌నాథ్‌కు (Ratna Debnath) చోటుక‌ల్పించింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ప‌నిహతి (Panihati) నియోజకవర్గం నుంచి ఆమెను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది.

2024, ఆగ‌స్టులో కోల్‌క‌తాలోని ఆర్జీక‌ర్ ద‌వాఖాన‌లో ట్రైనీ డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న అభ‌య‌పై.. సంజ‌య్ రాయ్ అనే వ్య‌క్తి లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. అనంతరం ఆమెను దారుణంగా హ‌త్య‌చేసి ప‌రార‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌పై బెంగాల్ వ్యాప్తంగా పెద్దఎత్తున్న ఆందోళ‌న‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టిన సీబీఐ నిందితుడు సంజ‌య్ రాయ్‌ని అరెస్టు చేసి.. అత‌నికి శిక్ష‌ప‌డేలా చేసింది. 2025 జ‌న‌వ‌రిలో కోర్టు అత‌నికి జీవిత ఖైదు విధించింది.

కాగా, అభ‌య త‌ల్లి ర‌త్నా దేబ్‌నాథ్ తాను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు గ‌తంలోనే ప్ర‌క‌టించారు. బీజేపీ టికెట్‌పై ప‌నిహ‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేయ‌నున్న‌ట్లు చెప్పారు. గతంలోనే బీజేపీ నుంచి తనకు ఆఫర్ వచ్చిందని, అయితే అప్పుడున్న మానసిక పరిస్థితిలో నిర్ణయం తీసుకోలేకపోయానని ఆమె తెలిపారు. తన కుమార్తె మరణాన్ని రాజకీయ లబ్ధికి వాడుకున్న సీపీఐ(ఎం), ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌కు పరోక్షంగా సాయం చేస్తోందని, అందుకే తాను రాజకీయాల్లోకి రావాల్సి వస్తున్న‌ద‌ని చెప్పారు. మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం కార‌ణంగా హ‌త్యాచార ఘ‌ట‌న‌లో త‌మ‌కు న్యాయం జ‌రుగ‌లేద‌ని పేర్కొన్నారు. త‌న కూతురు విష‌యంలో న్యాయ‌పోరాటంలో భాగంగా ఎన్నిక‌ల బ‌రిలో దిగుతాన‌ని ప్ర‌క‌టించారు. బెంగాల్‌లో తృణ‌మూల్ ప్ర‌భుత్వాన్ని ఓడించి మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని వెల్ల‌డించారు.

అయితే ర‌త్నా దేబ్‌నాథ్ పోటీ చేయ‌డంపై టీఎంసీ విమ‌ర్శించింది. మ‌హిళ భ‌ద్ర‌త కోసం మీరు బీజేపీని ఆశ్ర‌యించ‌డం త‌మ‌కు ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌ని ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కునాల్ ఘోష్ అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, హ‌త్య‌లు జ‌రుగుతున్న విష‌యం మీరు మ‌ర‌చిపోయారా అని ప్ర‌శ్నించారు. ఉన్నావ్‌, హ‌త్రాస్ ఘ‌ట‌న‌లు మ‌రిచారా అని నిల‌దీశారు.

కాగా, బీజేపీ ఇప్ప‌టి వ‌ర‌కు మూడు జాబితాల‌ను ప్ర‌క‌టించింది. మార్చి 16న‌ 144 మందితో మొద‌టి జాబితాను, ఈ నెల 19న 111 అభ్య‌ర్థుల‌తో రెండో జాబితాను విడుద‌ల చేయ‌గా, తాజాగా 19 మందితో మూడో జాబితాను వెలువ‌రించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement