త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ఒక్క ఓటుతో మార్పు తేవాలి.. బెంగాల్ ప్ర‌జ‌ల‌కు మోదీ పిలుపు..!

PM Modi | పశ్చిమ బెంగాల్ ఎన్నికల రెండో దశ ప్రచారంలో భాగంగా బంగావ్ సభలో ప్రధాని మోదీ టీఎంసీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌ని హామీ ఇవ్వ‌డంతో పాటు టీఎంసీ నుంచి విముక్తి క‌ల్పిస్తామ‌న్నారు.

P

National | Published On Apr 26, 2026, 4.20 pm IST

PM Modi | ఒక్క ఓటుతో మార్పు తేవాలి.. బెంగాల్ ప్ర‌జ‌ల‌కు మోదీ పిలుపు..!
Advertisement

PM Modi | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీపై, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 15 ఏళ్ల కింద‌ట “మా మట్టి మనుష్” అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన టీఎంసీ.. ప్ర‌స్తుతం ఆ మాట‌ల‌ను ప‌లుక‌డం లేద‌ని విమ‌ర్శించారు. ఆ నినాదాన్ని గుర్తు చేస్తే వారి తప్పులు బయటపడతాయని వ్యాఖ్యానించారు. టీఎంసీ పాలనలో తల్లులు కన్నీళ్లు పెట్టుకున్నారని, భూములను సిండికేట్లు, అక్రమ చొరబాటుదారుల అప్పగించారని, ప్రజలు వలస వెళ్లే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. “మాకు ఓటు వేయండి.. మిమ్మల్ని టీఎంసీ నుంచి విముక్తి కల్పిస్తాం” అంటూ మోదీ పిలుపునిచ్చారు.

బెంగాల్‌లో జంగిల్ రాజ్‌..

బెంగాల్ ప్రజల్లో అపారమైన సామర్థ్యం ఉందని, రాష్ట్రం మళ్లీ దేశంలో నంబర్ వన్‌గా నిలవగలదని పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన పిలుపును గుర్తు చేస్తూ ఈసారి ఒక్క ఓటుతో మార్పు తీసుకురావాలని కోరారు. టీఎంసీ పాలనలో “జంగిల్ రాజ్” కొనసాగుతోందని విమర్శించిన మోదీ, అవినీతి, భయం, మహిళలపై దాడులు, నిరుద్యోగం వంటి సమస్యల నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. సందేశ్‌ఖాలి ఘటనను ప్రస్తావిస్తూ మహిళలపై జరిగిన అన్యాయాలకు టీఎంసీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

వైద్య ప‌రీక్ష‌లు ఫ్రీ ఫ్రీ..

ఈ సందర్భంగా అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌నున్న సంక్షేమ పథకాలను కూడా వివరించారు. రూ.ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం, జన ఔషధి కేంద్రాల్లో మందులకు 80 శాతం రాయితీ, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా చేయిస్తామ‌ని హామీఇచ్చారు. గ‌ర్భిణుల‌కు రూ.21వేలు, విద్యాభ్యాసం పూర్తి చేసిన వారికి రూ.50వేల సాయం అంద‌జేస్తామ‌న్నారు. ప్రతి సంవత్సరం మహిళల ఖాతాల్లో రూ.36వేలు జమ చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తల జీతాల పెంపు అంశాన్ని ప్రస్తావించారు. శరణార్థుల కుటుంబాలకు పౌరసత్వం కల్పిస్తామని హామీ ఇవ్వ‌డంతో పాటు వారికి హ‌క్కులు క‌లిస్తామ‌ని, ఇది మోదీ గ్యారంటీ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement