త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | భార‌త మ‌హిళ‌ల క‌ల‌ల‌ను ధ్వంసం చేశారు.. ప్ర‌తిప‌క్షాల‌పై ప్ర‌ధాని మండిపాటు

PM Modi | భార‌త నారీశ‌క్తి ఎద‌గ‌కుండా అడ్డుకున్నారని, దేశ హితం కోసం, నారీశ‌క్తి హితం కోసం బిల్లు తెచ్చామ‌ని తెలిపారు. భార‌త మ‌హిళ‌ల క‌ల‌ల‌ను ధ్వంసం చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పార్ల‌మెంట్‌లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు వీగిపోయిన నేప‌థ్యంలో శ‌నివారం రాత్రి ఆయ‌న జాతినుద్దేశించి ప్ర‌సంగించారు.

P

National | Published On Apr 18, 2026, 9.02 pm IST

PM Modi | భార‌త మ‌హిళ‌ల క‌ల‌ల‌ను ధ్వంసం చేశారు.. ప్ర‌తిప‌క్షాల‌పై ప్ర‌ధాని మండిపాటు
Advertisement

PM Modi | భార‌త నారీశ‌క్తి ఎద‌గ‌కుండా అడ్డుకున్నారని, దేశ హితం కోసం, నారీశ‌క్తి హితం కోసం బిల్లు తెచ్చామ‌ని తెలిపారు. భార‌త మ‌హిళ‌ల క‌ల‌ల‌ను ధ్వంసం చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పార్ల‌మెంట్‌లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు వీగిపోయిన నేప‌థ్యంలో శ‌నివారం రాత్రి ఆయ‌న జాతినుద్దేశించి ప్ర‌సంగించారు. ప్ర‌ధాని మాట్లాడుతూ.. దేశ హిత‌మే మాకు అత్యంత ముఖ్యమ‌ని, కొంద‌రికి మాత్ర‌మే దేశం కంటే రాజ‌కీయాలే ముఖ్యమ‌ని, మ‌హిళా శ‌క్తిని ఈ దేశం ఇంకా చూడాల్సి ఉంద‌న్నారు. మ‌హిళా బిల్లును అడ్డుకున్నాక కాంగ్రెస్‌, డీఎంకే, టీఎంసీ ఆనందం వ్య‌క్తం చేశాయ‌ని, త‌మకు జ‌రిగిన అన్యాయానన్ని మ‌హిళ‌లు ఎప్పుడూ క్ష‌మించ‌రన్నారు.

బిల్లును అడ్డుకున్న పాపం వ‌దిలిపెట్ట‌దు..

కాంగ్రెస్‌, డీఎంకే, టీఎంసీ పార్టీలు ఓడించింది బిల్లును కాదు మ‌హిళ‌శ‌క్తిన‌న్నారు. 21వ శ‌తాబ్దంలో ఉన్నామ‌ని కాంగ్రెస్‌, దాని మిత్ర‌ప‌క్షాలు మ‌రిచిపోయాయ‌ని, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును అడ్డుకున్న పాపం వారిని వ‌దిలిపెట్టద‌ని శ‌పించారు. మ‌హిళా బిల్లును అడ్డుకున్న పార్టీల‌కు త‌ప్ప‌కుండా శిక్ష ప‌డుతుంద‌న్నారు. అన్ని విష‌యాల‌ను మ‌హిళ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నారని, మ‌హిళ‌లు త‌మ హ‌క్కు కోసం 40 ఏళ్లుగా పోరాడుతున్నార‌ని తెలిపారు. రిజ‌ర్వేష‌న్ల కోసం ఎంద‌రో మ‌హిళ‌లు పోరాటం చేశార‌ని, ఎంతో నిజాయితీతో తెచ్చిన బిల్లును అడ్డుకున్నారన్నారు.

కాంగ్రెస్‌, మిత్ర‌ప‌క్షాలు ప్రాయ‌శ్చితం చేసుకోవాలి..

మ‌హిళా బిల్లు క్రెడిట్‌ను తీసుకోవాల‌ని విప‌క్ష నేత‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశామ‌ని, అన్ని రాష్ట్రాల‌కు స‌మాన బ‌లం ద‌క్కేలా బిల్లు తెచ్చామ‌న్నారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును అడ్డుకోవ‌డ‌మంటే భ్రూణ‌హ‌త్య చేసిన‌ట్లేన‌న్నారు. భ్రూణ‌హ‌త్య‌లో ప్ర‌ధాన పాపం కాంగ్రెస్‌, టీఎంసీ, డీఎంకే పార్టీల‌దేన‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ దాని మిత్ర‌ప‌క్షాలు ప్రాయ‌శ్చిత్యం చేసుకోవాల‌న్నారు. నారీ శ‌క్తి వంద‌న్ అధినియం బిల్లుకు వ్య‌తిరేకులు త‌గిన మూల్యం చెల్లించుకుంటార‌ని, మ‌హిళా బిల్లును అడ్డుకున్న కుటుంబ పార్టీల‌కు త‌గిన బుద్ధి చెప్పాల‌ని మోదీ పిలుపునిచ్చారు. పంచాయ‌తీలు, ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల పాల‌న‌లో మ‌హిళ‌లు ఇప్ప‌టికే రాణించార‌న్నారు. కాంగ్రెస్ చేసిన పాపం ఇంత‌టితో పోయేది కాద‌న్నారు. డీలిమిటేష‌న్‌పై కాంగ్రెస్‌, దాని మిత్ర‌ప‌క్షాలు అస‌త్యాలు ప్ర‌చారం చేశాయ‌ని ఆరోపించారు.

సంస్క‌ర‌ణ‌ల వ్య‌తిరేకి కాంగ్రెస్‌

డీలిమిటేష‌న్‌తో ఏ రాష్ట్రానికి న‌ష్టం జ‌ర‌గ‌ద‌ని తాను స్ప‌ష్టంగా చెప్పాన‌న్నారు. అన్ని రాష్ట్రాల‌కు లోక్‌స‌భ‌లో ప్రాతినిథ్యం పెరుగుతుంద‌ని హామీ ఇచ్చాన‌న్నారు. బిల్లు ఆమోదం పొందితే అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరిగేవ‌ని, సీట్లు పెరిగితే కాంగ్రెస్‌, టీఎంసీ, ఎస్పీ వంటి అన్ని పార్టీల‌కే ప్ర‌యోజ‌న‌మేన‌ని మోదీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సంస్క‌ర‌ణ‌ల‌కు వ్య‌తిరేక‌మేన‌ని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేసేవ‌న్నీ నెగెటివ్ రాజ‌కీయాలేన‌ని విమ‌ర్శించారు. పేద‌ల రిజ‌ర్వేష‌న్ల‌కు కాంగ్రెస్ పార్టీ వ్య‌తిరేక‌మేన‌న్నారు. కాంగ్రెస్ పార్టీ నోట్ల ర‌ద్దు, జీఎస్టీ, డిజిట‌ల్ పేమెంట్స్‌ను వ్య‌తిరేకించింద‌ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, ట్రిపుల్ త‌లాక్ ర‌ద్దు వంటి అన్నింటిని వ్య‌తిరేకించింద‌ని మండిప‌డ్డారు. ఉగ్ర‌వాదం, న‌క్స‌లిజం విష‌యాల్లోనూ కాంగ్రెస్ వైఖ‌రి మ‌రిచిపోలేమ‌న్నారు. అన్ని సంస్క‌ర‌ణ‌ల‌ను అడ్డుకోవ‌డ‌మే కాంగ్రెస్ సిద్ధాంత‌మ‌ని విమ‌ర్శించారు. స‌మాజ్ వాదీ పార్టీ లోహియా స్వ‌ప్నాల‌ను తుంగ‌లో తొక్కింద‌ని ఆరోపించారు.

మ‌హిళ‌ల‌కు 33శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన విష‌యం తెలిసిందే. ఈ కీలక బిల్లు ఓటింగ్‌లో అవసరమైన రెండు మూడవ వంతుల మెజారిటీ సాధించలేకపోవడంతో తేలిపోయింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. లోక్‌సభలో శుక్రవారం రాత్రి జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 298 మంది సభ్యులు ఓటు వేయగా, 230 మంది వ్యతిరేకంగా ఓటేశారు. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా, బిల్లు ఆమోదం పొందేందుకు కావలసిన 352 ఓట్ల మెజారిటీ అందుకోలేకపోయింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుగా తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన ప్రకారం మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయడానికి లోక్‌సభ సీట్లను ప్రస్తుత 543 నుంచి 816కి పెంచాలని సూచించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఈ మార్పులు అమల్లోకి రావాల్సి ఉండేది. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ రిజర్వేషన్ అమలు చేయాలన్నది త‌మ ఉద్దేశ‌మ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీల్లో కూడా 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేసేందుకు సీట్ల సంఖ్యను పెంచాలని బిల్లులో పేర్కొంది. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని జాతినుద్దేశించి ప్ర‌సంగించారు.

Advertisement
Advertisement