త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi-Meerut RRTS And Meerut Metro | ఇక 55 నిమిషాల్లో ఢిల్లీ టు మీరట్.. ప్రధాని మోదీ చేతుల మీదుగా నమో భారత్ ఆరంభం

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీ-మీరట్ మధ్య నమో భారత్ RRTS, మీరట్ మెట్రోను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ విశేషాలు, ప్రయాణ సమయం, టికెట్ ధరల వివరాలు ఇవే.

J

National | Published On Feb 22, 2026, 3.46 pm IST

Delhi-Meerut RRTS And Meerut Metro | ఇక 55 నిమిషాల్లో ఢిల్లీ టు మీరట్.. ప్రధాని మోదీ చేతుల మీదుగా నమో భారత్ ఆరంభం
Advertisement
  • దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో
  • ఢిల్లీ - మీరట్ మధ్య బుల్లెట్ వేగంతో ప్రయాణం
  • నమో భారత్ - మీరట్ మెట్రో విశేషాలివే

Delhi-Meerut RRTS And Meerut Metro | త్రినేత్ర.న్యూస్ : దేశ రైల్వే రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఢిల్లీ-మీరట్ ప్రాంతాల మధ్య అత్యంత వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మధ్యాహ్నం 'నమో భారత్' రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS), 'మీరట్ మెట్రో'ను ఘనంగా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి శతాబ్ది నగర్ స్టేషన్‌లో ప్రధాని జెండా ఊపి ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.

రూ.30,274 కోట్లతో మెగా ప్రాజెక్ట్

సుమారు రూ.30,274 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. మొత్తం 82.15 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్‌లో 70 కి.మీ ఎలివేటెడ్ ట్రాక్ కాగా, 12 కి.మీ భూగర్భ మార్గంలో ఉంటుంది. ఈ పూర్తి కారిడార్ అందుబాటులోకి రావడంతో, ఢిల్లీ నుంచి మీరట్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, కేవలం 55 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చు.

మీరట్ మెట్రో ప్రత్యేకతలు

ఈ ప్రారంభోత్సవంతో మీరట్ నగరానికి తొలిసారి మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇది గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణించే 'భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో'. మీరట్ సౌత్ నుంచి మోదీపురం వరకు మొత్తం 13 స్టేషన్లు ఉన్నాయి. ప్రపంచంలోనే తొలిసారిగా నమో భారత్ (RRTS), స్థానిక మెట్రో రైళ్లు ఒకే ట్రాక్‌పై నడిచేలా అత్యాధునిక సాంకేతికతను ఇక్కడ ఉపయోగించారు.

మెట్రోలో ప్రయాణించిన ప్రధాని

ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ శతాబ్ది నగర్ నుంచి మీరట్ సౌత్ వరకు మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా రైలులో ఉన్న పాఠశాల విద్యార్థులు, ప్రయాణికులతో ముచ్చటించారు. గతంలో ఈ ప్రాంతంలో రవాణా కష్టాలు, భద్రతా పరమైన ఇబ్బందులను మహిళలు ప్రధానికి వివరించారు. ఇప్పుడు మెట్రో రాకతో తమ ప్రయాణం సురక్షితంగా మారిందని వారు హర్షం వ్యక్తం చేశారు.

టికెట్ ధరలు, సదుపాయాలు

ఢిల్లీ - మీరట్ పూర్తి ప్రయాణానికి టికెట్ ధర సుమారు రూ.213 గా నిర్ణయించారు. అంటే కిలోమీటర్‌కి రూ.2.60 చొప్పున ఉంటుంది. నమో భారత్ రైళ్లలో ల్యాప్‌టాప్/మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ప్రీమియం కోచ్‌లు, మహిళలకు ప్రత్యేక కోచ్, అత్యాధునిక డిజిటల్ డిస్‌ప్లేలు ఉన్నాయి. ఢిల్లీలోని సారాయ్ కాలే ఖాన్ స్టేషన్ ద్వారా హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, మెట్రో పింక్ లైన్‌కు సులభంగా చేరుకోవచ్చు.

అభివృద్ధి పథంలో భారత్

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. 2014 కంటే ముందు దేశంలో మెట్రో విస్తరణ చాలా నెమ్మదిగా ఉండేదని, కేవలం 5 నగరాల్లోనే మెట్రో ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుతం 25కు పైగా నగరాల్లో మెట్రో నడుస్తోందని, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా భారత్ అవతరించిందని గర్వంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో పాటు మీరట్‌లో సుమారు రూ.12,930 కోట్ల విలువైన ఇతర అభివృద్ధి పనులకు కూడా ప్రధాని శ్రీకారం చుట్టారు.

https://x.com/ANI/status/2025476656916561953

https://x.com/ANI/status/2025473542738088017

 

Advertisement
Advertisement