త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | బెంగాల్‌ పునర్వైభవానికి టీఎంసీ నుంచి విముక్తి అవసరం : ప్రధాని మోదీ

PM Modi | టీఎంసీ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. బెంగాల్‌ను తిరిగి అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే అవినీతి, భయం, నిరుద్యోగం, చొరబాట్లు, మహిళలపై జరుగుతున్న దాడుల నుంచి రాష్ట్రానికి విముక్తి అవసరమని పేర్కొన్నారు.

P

National | Published On Apr 24, 2026, 5.52 pm IST

PM Modi | బెంగాల్‌ పునర్వైభవానికి టీఎంసీ నుంచి విముక్తి అవసరం : ప్రధాని మోదీ
Advertisement

PM Modi | పశ్చిమ బెంగాల్‌లోని డమ్ డమ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. బెంగాల్‌లో మార్పు కోసం కనిపిస్తున్న అలజడి, నిన్న జరిగిన మొదటి దశ పోలింగ్‌తో స్పష్టమైందన్నారు. బీజేపీకి అనుకూలంగా కనిపించిన ప్రజా మద్దతు విజయ సంకేతాన్ని ఇచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. బెంగాల్‌కు పునర్వైభవం తీసుకురావాలంటే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) భయం, అవినీతి, సిండికేట్ వ్యవస్థ, వలసలు, నిరుద్యోగం, చొరబాట్లు, మహిళలపై జరుగుతున్న అకృత్యాల నుంచి రాష్ట్రానికి విముక్తి అవసరమన్నారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్య ఆలయాన్ని టీఎంసీ ధ్వంసం చేసిందని ఆరోపించారు. తొలి దశ పోలింగ్‌లో ప్రజలు ఆ ప్రజాస్వామ్య ఆలయాన్ని తిరిగి నిర్మించారని, రెండో దశలో ఆ ఆలయంపై విజయ పతాకం ఎగురవేయనున్నారన్నారు.

టీఎంసీ గూండాలకు దాక్కునేందుకు స్థలం ఉండదు

టీఎంసీ దీపం ఆరిపోవడానికి ముందు మసకబారుతోందని వ్యాఖ్యానించారు. మే 4న ఫలితాలు వెలువడిన తర్వాత టీఎంసీ గూండాలకు బెంగాల్‌లో దాక్కోవడానికి స్థలం ఉండదన్నారు. ‘ఇది విప్లవ సమయం. ఇది ఓట్ల ద్వారానే సాధ్యం’ అని ప్రధాని మోదీ అన్నారు. ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశాన్ని బానిసత్వం నుంచి విముక్తి చేయడానికి ‘నాకు రక్తం ఇవ్వండి. నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను’ అని పిలుపునిచ్చారు. ఇప్పుడు బెంగాల్‌లో కొత్త విప్లవ సమయం వచ్చింది. ఈ విప్లవం ఓట్ల ద్వారానే జరుగుతుంది. ప్రజలు తమ ఓటుతో బీజేపీని ఆశీర్వదించాలని కోరుతున్నాను. కలిసి బెంగాల్‌ను అన్ని కష్టాల నుంచి విముక్తి చేస్తాం. టీఎంసీ మహిళల వ్యతిరేక పార్టీ’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. అనంతరం జాదవ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ గత 15 ఏళ్లుగా రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. రాష్ట్ర గుర్తింపును నాశనం చేశారని, అవకాశాల కోసం అనేక మంది బెంగాలీలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

బెంగాల్‌ భవిష్యత్‌ను ఎలా కాపాడుతుంది?

నిన్న జరిగిన మొదటి దశ పోలింగ్‌తో టీఎంసీ తన ఖాతానే తెరవలేని పరిస్థితి కనిపిస్తోందని సంకేతాలు వచ్చాయని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు భారత్‌లో ఎంత భారీ స్థాయిలో ప్రజల మద్దతు ఎప్పుడూ చూడలేదు. బెంగాల్‌లో బీజేపీకి వచ్చిన మద్దతు గురించే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది’ అని మోదీ పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో జాదవ్‌పూర్ యూనివర్సిటీపై కూడా ప్రధాని విమర్శలు చేశారు. విశ్వవిద్యాలయ ప్రాంగణ గోడలపై ‘దేశ వ్యతిరేక నినాదాలు’ రాస్తున్నారని, దాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ‘ఒకప్పుడు జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించేది. ఇది జాతీయత పునాదులపై ఏర్పడిన క్యాంపస్. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. క్యాంపస్‌లోనే గోడలపై దేశ వ్యతిరేక నినాదాలు రాస్తున్నారు. విద్యార్థులు చదువుకు బదులుగా రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ చదువుకునే వాతావరణం కావాలి. కల్లోలం కాదు. చర్చలు కావాలి బెదిరింపులు కాదు. రాష్ట్రంలోని అతిపెద్ద విద్యాసంస్థను కూడా రక్షించలేని ప్రభుత్వం, బెంగాల్ భవిష్యత్తును ఎలా కాపాడుతుంది?’ అంటూ మోదీ ప్రశ్నించారు.

Advertisement
Advertisement