త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amit Shah Lok Sabha Speech | లోక్‌సభలో విపక్షాలపై అమిత్ షా ఫైర్: కులగణనపై సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభలో విపక్షాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా కూటమికి మహిళా రిజర్వేషన్లు ఇష్టం లేదని, డీలిమిటేషన్‌ను వ్యతిరేకించడం ద్వారా ఎస్సీ, ఎస్టీ సీట్ల పెంపును అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. సెన్సస్ జాప్యంపై క్లారిటీ ఇచ్చారు.

J

National | Published On Apr 17, 2026, 6.52 pm IST

Amit Shah Lok Sabha Speech | లోక్‌సభలో విపక్షాలపై అమిత్ షా ఫైర్: కులగణనపై సంచలన వ్యాఖ్యలు
Advertisement

Amit Shah Lok Sabha Speech | త్రినేత్ర.న్యూస్ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై జరుగబోయే కీలక ఓటింగ్‌కు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'ఇండియా' (INDIA) కూటమి నేతలకు మహిళా సాధికారతపై చిత్తశుద్ధి లేదని, కేవలం ప్రజలను గందరగోళానికి గురిచేసి అధికారంలోకి రావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

మహిళా బిల్లుకు విపక్షాలు వ్యతిరేకం

మహిళా రిజర్వేషన్ల అమలును ప్రతిపక్షాలు అడ్డుకోవాలని చూస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. "బయటకు మాత్రం మహిళా రిజర్వేషన్లకు ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదన్నట్లు కనిపిస్తుంది. కానీ నిశితంగా గమనిస్తే, ఇండియా కూటమికి చెందిన ప్రతి ఎంపీ 'అది, ఇది' (Ifs and buts) అంటూ ఏదో ఒక సాకు చూపి ఈ బిల్లును వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వారి అసలు ఉద్దేశం మహిళా కోటా అమలును అడ్డుకోవడమే," అని షా దుయ్యబట్టారు.

జనాభా లెక్కలు, కులగణన ఎందుకు ఆలస్యమైంది?

కులగణన (Caste Census) అంశంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా మండిపడ్డారు. జనాభా లెక్కల జాప్యంపై ఆయన సభలో స్పష్టత ఇచ్చారు. "వాస్తవానికి 2021లోనే సెన్సస్ జరగాల్సి ఉంది. కానీ ఆ సమయంలో దేశం కోవిడ్-19 (Covid-19) మహమ్మారితో పోరాడుతోంది కాబట్టి చేయలేకపోయాము. ఆ తర్వాత 2024లో చేద్దామనుకుంటే, కులాల ఆధారిత జనాభా లెక్కలు కావాలనే డిమాండ్లు వచ్చాయి. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఎట్టకేలకు 2025లో కులగణన చేపట్టాలని మేము నిర్ణయించాం," అని ఆయన వివరించారు. ప్రతిపక్షాలకు కులగణనపై ఎలాంటి చిత్తశుద్ధి లేదని, వారి లక్ష్యం కేవలం ప్రజలను గందరగోళపరచడమేనని విమర్శించారు.

డీలిమిటేషన్ ఎందుకు అవసరం?

లోక్‌సభ సీట్ల పెంపును (Delimitation) సమర్థిస్తూ అమిత్ షా కీలక గణాంకాలను సభ ముందు ఉంచారు. "ప్రస్తుతం దేశంలో 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న లోక్‌సభ స్థానాలు 127 ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజల అవసరాలను ఒకే ఎంపీ ఎలా తీర్చగలరు?" అని ఆయన ప్రశ్నించారు.

ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు వ్యతిరేకమా?

డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై షా తీవ్ర ఆరోపణలు చేశారు. "డీలిమిటేషన్‌ను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, వారు పరోక్షంగా ఎస్సీ, ఎస్టీ (SC/ST) సీట్ల పెంపును కూడా వ్యతిరేకిస్తున్నట్లే," అని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు డీలిమిటేషన్‌కు మద్దతు ఇస్తే, దేశవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతీ ఓటుకు సమాన విలువ (Equal Value) ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు.

రాహుల్ గాంధీకి చురకలు

ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలిగించడం రాహుల్ గాంధీ తక్షణమే మానుకోవాలని ఆయన హితవు పలికారు.

Advertisement
Advertisement