త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gaurav Gogoi vs Himanta Biswa Sarma | ‘నా భార్యతో పాటు నేనూ పాకిస్థాన్ వెళ్లాను’.. అసోం సీఎం ఆరోపణలకు గౌరవ్ గొగోయ్ కౌంటర్

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తనపై, తన కుటుంబంపై చేసిన తీవ్ర ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఖండించారు. తన భార్య 2013లో పని నిమిత్తమే పాకిస్థాన్ వెళ్లారని, ఆ సమయంలో తాను కూడా ఆమెతో ఉన్నానని స్పష్టం చేశారు.

J

National | Published On Feb 9, 2026, 3.43 pm IST

Gaurav Gogoi vs Himanta Biswa Sarma | ‘నా భార్యతో పాటు నేనూ పాకిస్థాన్ వెళ్లాను’.. అసోం సీఎం ఆరోపణలకు గౌరవ్ గొగోయ్ కౌంటర్

సంక్షిప్త సారాంశం

తనకు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయన్న అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోపణలను గౌరవ్ గొగోయ్ కొట్టిపారేశారు. 2013లో తన భార్య ఎలిజబెత్ కోల్‌బర్న్ పని నిమిత్తం పాకిస్థాన్ వెళ్లారని, తాను కూడా ఆమెతో పాటు 10 రోజులు అక్కడ ఉన్నానని తెలిపారు. తనపై ఉన్న ఆరోపణలకు సంబంధించి సిట్ (SIT) నివేదికను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. హిమంత బిశ్వ శర్మ రాజకీయంగా ఎదుర్కోలేక తన పిల్లల ప్రస్తావన తెస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని గొగోయ్ మండిపడ్డారు.

Advertisement

Gaurav Gogoi vs Himanta Biswa Sarma | త్రినేత్ర.న్యూస్ : అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ.. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ గౌరవ్ గొగోయ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రెస్ మీట్ పెట్టి గౌరవ్ గొగోయ్ భార్యకు పాకిస్థానీ జాతీయుడు అలీ తౌకీర్ షేక్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేశారని సంచలన ఆరోపణలు చేశారు. గొగోయ్ 2013లో రహస్యంగా పాకిస్థాన్ వెళ్లి శిక్షణ పొందారని ఆరోపిస్తూ, దీనిపై విచారణ ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.

తనపై వచ్చిన తీవ్ర ఆరోపణలకు గౌరవ్ గొగోయ్.. సీఎంకి గట్టిగా బదులిచ్చారు. గౌరవ్ గొగోయ్‌కి పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సోమవారం గౌహతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గొగోయ్ మాట్లాడుతూ.. సీఎం హిమంత తనపై బురదజల్లేందుకు సిట్ (SIT) నివేదికను ఆరు నెలలుగా తొక్కిపెట్టారని ఆరోపించారు.

పాకిస్థాన్ పర్యటనపై స్పష్టత

"నా భార్య ఎలిజబెత్ కోల్‌బర్న్ 2013లో తన ఉద్యోగ రీత్యా పాకిస్థాన్ వెళ్లారు. ఆమెతో పాటు నేను కూడా వెళ్లాను. మేము అక్కడ 10 రోజులు ఉన్నాం. ఆ సమయంలో గానీ, ఆ తర్వాత గానీ నన్ను ఎవరూ ప్రశ్నించలేదు. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఆకస్మాత్తుగా ఈ విషయం ఎందుకు తెరపైకి తెస్తున్నారు?" అంటూ గొగోయ్ ప్రశ్నించారు.

Also Read: Gaurav Gogoi’s Alleged Pakistan Links | దేశ భద్రతకే ముప్పు.. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పాకిస్థాన్ లింకులపై కేంద్ర హోం శాఖ విచారణ

పిల్లలను లాగడం సిగ్గుచేటు

సీఎం హిమంత బిశ్వ శర్మ స్థాయి దిగజారిపోయిందని గౌరవ్ గొగోయ్ మండిపడ్డారు. "రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నా భార్య, పిల్లల గురించి మాట్లాడుతున్నారు. మా దగ్గర కూడా ఆయన పిల్లల గురించి సమాచారం ఉంది, కానీ మేము అంత దిగజారి ప్రవర్తించం. ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అనర్హుడు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పిల్లల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హిమంతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

సిట్ నివేదిక బయటపెట్టండి

తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, వెంటనే సిట్ నివేదికను బహిర్గతం చేయాలని గొగోయ్ డిమాండ్ చేశారు. "ఆ నివేదికలో నాపై ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టే ఆరు నెలలుగా సీఎం దాన్ని బయటపెట్టకుండా దాచిపెట్టారు" అని మండిపడ్డారు.

అసలు కారణం ఇదే

ఇటీవల కాంగ్రెస్ పార్టీ అసోం సీఎం కుటుంబానికి సంబంధించిన 12,000 బిగాల(భూములను లెక్కించే యూనిట్) భూముల వ్యవహారాన్ని బయటపెట్టిందని, ఆ విషయాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే హిమంత ఈ డ్రామా ఆడుతున్నారని గొగోయ్ ఆరోపించారు.

Advertisement
Advertisement