త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Cabinet Decisions | భార‌త్ మారిటైమ్ ఇన్సురెన్స్ పూల్ ప‌థ‌కం.. 2028 వ‌రకు పీఎం స‌డ‌క్ యోజ‌న పొడిగింపు..!

Union Cabinet Decisions | ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న శ‌నివారం జ‌రిగిన కేంద్ర కేబినెట్ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌కు ఆమోదం తెలిపారు. కేబినెట్ నిర్ణ‌యాల‌ను మంత్రి అశ్విని వైష్ణ‌వ్ మీడియాకు వివ‌రించారు.

P

National | Published On Apr 18, 2026, 4.53 pm IST

Union Cabinet Decisions | భార‌త్ మారిటైమ్ ఇన్సురెన్స్ పూల్ ప‌థ‌కం.. 2028 వ‌రకు పీఎం స‌డ‌క్ యోజ‌న పొడిగింపు..!
Advertisement

Union Cabinet Decisions | ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న శ‌నివారం జ‌రిగిన కేంద్ర కేబినెట్ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌కు ఆమోదం తెలిపారు. కేబినెట్ నిర్ణ‌యాల‌ను మంత్రి అశ్విని వైష్ణ‌వ్ మీడియాకు వివ‌రించారు. దేశీయ సముద్ర బీమా రంగాన్ని బలోపేతం చేసే దిశగా ‘భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్’ (BMI Pool) ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకానికి రూ.12,980 కోట్ల సావరిన్ గ్యారంటీ ఇచ్చింది. ఈ బీఎంఐ పూల్ ద్వారా భారత నియంత్రణలో ఉన్న నౌకలకు, భార‌త జెండా ఉన్న.. అలాగే భారత పోర్టులకు సరుకు రవాణా చేసే నౌకలకు సమగ్ర బీమా రక్షణ క‌లుగ‌నుంది. అంతర్జాతీయ సముద్ర మార్గంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, పెరుగుతున్న బీమా ప్రీమియంల నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకంగా భావిస్తున్నారు. ఇప్పటివరకు భారత్ ప్రధానంగా ఇంట‌ర్నేష‌న‌ల్ గ్రూప్ ఆఫ్ ప్రొటెక్ష‌న్ అండ్ ఇండెమినిటీ క్ల‌బ్స్‌పై ఆధార‌ప‌డుతూ వ‌చ్చింది. అయితే, అంతర్జాతీయ ఆంక్షలు, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ సంస్థలపై ఆధారపడటం ప్రమాదకరమని భావించిన కేంద్రం స్వదేశీ వ్యవస్థను ప్రవేశపెట్టింది.

కొత్త పూల్ ద్వారా హల్ అండ్ మెషినరీ, కార్గో, ప్రొటెక్షన్ అండ్ ఇండెమ్నిటీ, యుద్ధ ప్రమాదాల వంటి విభిన్న సముద్ర బీమా క‌వ‌రేజీ అందుబాటులోకి రానుంది. బీమా సంస్థలు సుమారు రూ.950 కోట్ల అండరరైటింగ్ సామర్థ్యంతో పాలసీలను జారీ చేయనున్నాయి. ఈ వ్యవస్థ నిర్వహణ కోసం ప్రత్యేక పాలక మండలిని ఏర్పాటు చేయనున్నారు. అలాగే, కేబినెట్‌లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు సైతం ఆమోదం తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మౌలిక స‌దుపాయాల స‌దుపాయాల క‌ల్ప‌న ప్రాజెక్టుకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది. రాజమండ్రి–విశాఖపట్నం మధ్య అదనపు రైల్వే లైన్ల నిర్మాణానికి రూ.9,889 కోట్ల వ్యయంతో ఆమోద ముద్ర‌వేసింది. నిడదవోలు–దువ్వాడ మార్గాన్ని కలుపుతూ ఈ ప్రాజెక్టు అమలు కానుంది. దాంతో కాకినాడ, మచిలీపట్నం, గంగవరం పోర్టులకు రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. సుమారు 198 కిలోమీటర్ల పొడవుతో ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నారు.

అదే సమయంలో గోదావరి నదిపై సుమారు 4.3 కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు ఉత్తర భారతదేశంలో గాజియాబాద్–సీతాపుర్ మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపింది. అలాగే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరటనిస్తూ డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను 2 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఉన్న 58 శాతం డీఏ 60 శాతానికి పెరిగి, లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. అలాగే గ్రామీణ రహదారుల అభివృద్ధికి కీలకమైన ప్ర‌ధాన‌మంత్రి గ్రామీణ స‌డ‌క్ యోజ‌న ప‌థ‌కాన్ని 2028 వ‌ర‌కు పొడ‌గించేందుకు కేబినెట్ నిర్ణ‌యించింది. కేబినెట్ సమావేశంలో పార్లమెంట్ పరిణామాలపై కూడా చర్చ జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై ప్రధాని మోదీ స్పందిస్తూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ చట్టాన్ని అమలు చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు విపక్షాలు అడ్డంకులు సృష్టించాయని విమర్శించారు. ఈ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదేనని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement