త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MHA SOP | సైబర్ మోసాల బాధితులకు ఊరట.. ఇక‌పై సొమ్ము వెంట‌నే వెన‌క్కి వ‌స్తుంది..

MHA SOP | ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు వేగంగా స్పందించేందుకు, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు కేంద్ర హోంశాఖ (MHA) కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) పరిధిలో పనిచేసే సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CFCFRMS) కోసం రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)కి కేంద్రం ఆమోదం తెలిపింది.

S

National | Published On Jan 17, 2026, 1.43 pm IST

MHA SOP | సైబర్ మోసాల బాధితులకు ఊరట.. ఇక‌పై సొమ్ము వెంట‌నే వెన‌క్కి వ‌స్తుంది..
Advertisement

MHA SOP | ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు వేగంగా స్పందించేందుకు, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు కేంద్ర హోంశాఖ (MHA) కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) పరిధిలో పనిచేసే సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CFCFRMS) కోసం రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)కి కేంద్రం ఆమోదం తెలిపింది. కొత్త SOP ప్రకారం, రూ.50వేల లోపు మొత్తాల సైబర్ మోసాల కేసుల్లో కోర్టు ఉత్తర్వులు అవసరం లేకుండానే రీఫండ్ ప్రాసెస్ చేయవచ్చు. అలాగే, కోర్టు లేదా రిస్టోరేషన్ ఆర్డర్ ఏదీ లేకపోతే, బ్యాంకులు ఆ మొత్తంపై విధించిన హోల్డ్ ను 90 రోజుల్లో తప్పనిసరిగా ఎత్తివేయాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో ఈ నూత‌న SOPని అమ‌లు చేయ‌నున్నారు.

అంద‌రూ ఒకే విధానం పాటించేలా..

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) తాజా గణాంకాల ప్రకారం, గత ఆరు సంవత్సరాల్లో భారత్‌లో సైబర్ మోసాలు, మోసపూరిత లావాదేవీల కారణంగా ప్రజలు దాదాపుగా రూ.52,976 కోట్లకు పైగా నష్టపోయార‌ని వెల్ల‌డైంది. కొత్తగా ఆమోదం పొందిన SOPతో బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లు, NBFCలు, ఈ-కామర్స్ సంస్థలు, స్టాక్ ట్రేడింగ్ యాప్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలు సహా అంద‌రు ఆర్థిక మధ్యవర్తులు సైబర్ మోసాలపై ఫిర్యాదు నమోదైనప్పుడు ఒకే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. దీనిపై ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, సైబర్ మోసాల హెచ్చరికల నేపథ్యంలో అవసరం లేకుండా ఫ్రీజ్ అయిన ఖాతాలు లేదా నిధులపై బాధితులకు సమగ్ర ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను ఈ SOP అందిస్తుందని తెలిపారు. మూడు దశల ఎస్కలేషన్ విధానం ద్వారా నిర్ణీత కాలంలో సమస్య పరిష్కారం జరిగేలా చర్యలు ఉంటాయి అని తెలిపారు.

రూ.50వేల లోపు మోసాల కేసుల్లో..

2021లో I4C పరిధిలో ప్రారంభమైన CFCFRMS ఆర్థిక మోసాలను తక్షణమే నివేదించేందుకు, మోసగాళ్లు డబ్బు తరలించకుండా అడ్డుకోవడానికే రూపొందించబడింది. గత ఏడాది అక్టోబర్ 31 నాటికి, 23.02 లక్షలకు పైగా ఫిర్యాదుల ద్వారా రూ.7,130 కోట్లకు పైగా నిధులను కాపాడగలిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. NCRP ద్వారా ప్రజలు అన్ని రకాల సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. కొత్త SOPలో భాగంగా, రూ.50 వేలలోపు మోసాల కేసుల్లో వేగవంతమైన రీఫండ్ విధానం అమ‌లు చేస్తారు. కోర్టు ఆదేశాలు లేకపోతే 90 రోజుల్లో బ్యాంకులు హోల్డ్ తొలగించాల్సి ఉంటుంది. కాగా సీనియర్ అధికారులు దీన్ని డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పెంచే కీలక అడుగుగా చెబుతున్నారు.

ఏటా పెరుగుతున్న ఫిర్యాదులు..

ఈ SOPను అమలు చేయడానికి గ్రీవెన్స్ రెడ్రెస్సల్ మాడ్యూల్, మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ అనే రెండు డిజిటల్ వ్యవస్థలను NCRPలో అభివృద్ధి చేయనున్నారు. వీటితో బ్యాంకులు, చట్ట అమలు సంస్థలు, బాధితుల మధ్య సమన్వయం మెరుగుపడి, డబ్బు తిరిగి పొందే ప్రక్రియ వేగవంతం కానుంది. NCRP గణాంకాల ప్రకారం.. 2020లో మొత్తం 12,746 సైబ‌ర్ మోసాల ఫిర్యాదులు రాగా ప్ర‌జ‌ల‌కు రూ.8.56 కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ని తేలింది. అలాగే 2021లో 2,62,846 ఫిర్యాదులు రాగా రూ.551.65 కోట్లు న‌ష్టం వ‌చ్చింది. 2022లో 6,94,446 ఫిర్యాదులు రాగా, రూ.2,290.23 కోట్లను న‌ష్ట‌పోయారు. ఇక 2023లో 13,10,361 ఫిర్యాదులు రాగా ప్ర‌జ‌లు రూ.7,463.2 కోట్లను న‌ష్ట‌పోయారు. అలాగే 2024లో మొత్తం 19,18,852 ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని, ప్ర‌జ‌లు రూ.22,849.49 కోట్లను పోగొట్టుకున్నార‌ని తేలింది. ఇక గ‌తేడాదిలో 21,77,524 సైబ‌ర్ నేరాల‌ ఫిర్యాదులు రాగా మొత్తం రూ.19,812.96 కోట్లు నష్ట‌పోయార‌ని వెల్ల‌డైంది. ఏటా ఈ నేరాల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు పోగొట్టుకున్న సొమ్మును చాలా త్వ‌ర‌గా మ‌ళ్లీ వెన‌క్కి వ‌చ్చేలా చేసేందుకే ఈ నూత‌న SOP విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీని వ‌ల్ల బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం జ‌రుగుతుంద‌న్నారు. దీన్ని త్వ‌ర‌లో అమ‌లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement