త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

West Bengal SIR controversy | బెంగాల్ SIR వివాదం: 150 మంది మృతికి కారణం అదే.. ‘వాట్సాప్ కమిషన్‌’లా ఈసీ.. సుప్రీంలో వాదించిన మమత

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ స్వయంగా వాదనలు వినిపించారు. ఈ ప్రక్రియ ఒత్తిడి తట్టుకోలేక రాష్ట్రంలో 150 మంది చనిపోయారని, ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

J

National | Published On Feb 4, 2026, 3.40 pm IST

West Bengal SIR controversy | బెంగాల్ SIR వివాదం: 150 మంది మృతికి కారణం అదే.. ‘వాట్సాప్ కమిషన్‌’లా ఈసీ.. సుప్రీంలో వాదించిన మమత
Advertisement

West Bengal SIR controversy | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టులో బుధవారం కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా కోర్టుకు హాజరై తన వాదనలు వినిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తన రాష్ట్రాన్ని టార్గెట్ చేసేందుకే ఈ ప్రక్రియను రూపొందించారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

"ఒత్తిడితో 150 మంది చనిపోయారు"

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ పంచోలీలతో కూడిన ధర్మాసనం ముందు మమతా బెనర్జీ వాదిస్తూ.. SIR ప్రక్రియ వల్ల కలిగిన తీవ్ర ఒత్తిడి కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 150 మందికి పైగా మరణించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశాల వల్ల తీవ్ర ఒత్తిడికి లోనై చనిపోయిన ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) కూడా ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితుల హాజరు

ఈకేసును బలోపేతం చేసేందుకు మమతా తనతో పాటు సుమారు 100 మందిని ఢిల్లీకి తీసుకొచ్చారు. వీరిలో సగం మంది ఎస్ఐఆర్ ఒత్తిడితో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కాగా, మిగిలిన సగం మందిని బతికి ఉన్నా ఓటర్ల జాబితాలో చనిపోయినట్లుగా చూపించి పేర్లు తీసేసిన వాళ్లు ఉన్నారని మమత తెలిపారు.

"కేవలం బెంగాల్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?"

ఈ సందర్భంగా మమతా బెనర్జీ పలు కీలక ప్రశ్నలను లేవనెత్తారు. "కేవలం బెంగాల్‌నే ఎందుకు? అస్సాం లేదా ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఎందుకు ఈ ప్రక్రియ చేపట్టలేదు? ఎన్నికల సంఘం బెంగాల్ ప్రజలను అణిచివేసేందుకే ఇలా చేస్తోంది," అని ఆమె ఆరోపించారు. SIR మొదటి దశలోనే సుమారు 58 లక్షల పేర్లను జాబితా నుండి తొలగించారని, ఫారం-6 ద్వారా అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఓటర్లకు ఇవ్వలేదని ఆమె తెలిపారు. మొత్తంగా బెంగాల్‌లో దాదాపు 2 కోట్ల మంది ఓటర్లను తొలగించడం లేదంటే వారి పేర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం లాంటివి చేస్తూ ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మమత ఆరోపించారు. స్థానిక ఎన్నికల సిబ్బందిని పక్కనపెట్టి, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన మైక్రో-అబ్జర్వర్ల ద్వారా ఈ తొలగింపులు జరిగాయని ఆరోపించారు. డొమిసైల్ సర్టిఫికెట్లు, ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను కూడా అధికారులు తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. పాత జనన ధృవీకరణ పత్రాలను అడిగి సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మమత వాదించారు.

"24 ఏళ్ల తర్వాత ఇప్పుడే ఎందుకు?"

ఈ ప్రక్రియ చేపట్టిన సమయంపై కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. "గత 24 ఏళ్లలో లేనిది, ఇప్పుడు కేవలం నాలుగు నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఏముంది? పంటల కోత సమయం, దుర్గా పూజ సమయాల్లో ప్రజలు ఇళ్లలో లేనప్పుడు నోటీసులు జారీ చేశారు," అని ఆమె మండిపడ్డారు.

రాజకీయ కుట్ర

2026 అసెంబ్లీ ఎన్నికల ముందు బెంగాల్ ఓటర్లను లక్ష్యంగా చేసుకొని బీజేపీ ప్రభుత్వం ఈ రాజకీయ కుట్ర చేస్తోందని మమత విమర్శించారు.

"ఈసీ కాదు.. ఇది వాట్సాప్ కమిషన్"

తన వాదనలను ముగిస్తూ ఎన్నికల సంఘం పనితీరుపై మమతా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "నేను ఆరుసార్లు ఈసీకి లేఖలు రాసినా ఒక్క సమాధానం కూడా రాలేదు. ఇది ఎలక్షన్ కమిషన్ కాదు.. 'వాట్సాప్ కమిషన్'. బెంగాల్‌ను టార్గెట్ చేసి ప్రజల పేర్లను తొలగిస్తున్నారు," అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. తాను ఒక పార్టీ నాయకురాలిగా కాకుండా, న్యాయం కోరుతున్న సామాన్య పౌరురాలిగా మాట్లాడుతున్నానని ఆమె కోర్టుకు విన్నవించారు.

సుప్రీంకోర్టు ఆదేశాలు

మమతా బెనర్జీ వాదనలు విన్న తర్వాత, సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి (ECI) నోటీసులు జారీ చేసింది.  ప్రజలపై పడుతున్న ఒత్తిడి, ఆందోళన పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఓటర్ల తొలగింపు ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. దీనిపై వివరణ ఇస్తూ ఫిబ్రవరి 10లోగా సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది.

Advertisement
Advertisement