త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LPG Cylinder | ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర బ్లాక్ మార్కెట్‌లో రూ.6500.. రీఫిల్ కు రూ.3,500..

LPG Cylinder | అమెరికా-ఇజ్రాయెల్ కలిసి గత నెల ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ సిలిండర్లకు అసాధారణంగా డిమాండ్ పెరగడంతో అవి ఇప్పుడు హాట్ కేకుల్లా మారాయి.

S

National | Published On Mar 15, 2026, 10.59 am IST

LPG Cylinder | ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర బ్లాక్ మార్కెట్‌లో రూ.6500.. రీఫిల్ కు రూ.3,500..
Advertisement

LPG Cylinder | అమెరికా-ఇజ్రాయెల్ కలిసి గత నెల ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ సిలిండర్లకు అసాధారణంగా డిమాండ్ పెరగడంతో అవి ఇప్పుడు హాట్ కేకుల్లా మారాయి. ఇటీవలి కాలంలో గ్యాస్ సిలిండర్లను దొంగతనం చేయ‌డం, నిల్వ చేసి దాచిపెట్టడం, బ్లాక్ మార్కెట్‌లో విక్రయించడం వంటి ఘటనలు పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎన్‌డీటీవీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో బ్లాక్ మార్కెట్ వ్యాపారులు గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్ల‌డైంది. ఒక గ్యాస్ సిలిండర్ ధర రూ.6,500 వరకు చేరగా, 14 కిలోల సిలిండర్ రీఫిల్ కోసం రూ.3,500 నుంచి రూ.4వేల‌ వరకు వసూలు చేస్తున్నట్లు తేలింది. ఇదివరకు అదే సిలిండర్ రీఫిల్ ధర రూ.900 నుంచి రూ.1వేయి మధ్య ఉండేది.

స్ట‌వ్ మ‌ర‌మ్మ‌త్తు దుకాణాలు, కిరాణా షాపుల ద్వారా వ్యాపారం..

ఇక గ్యాస్ ఏజెన్సీలు లేదా ప్రైవేటు వ్య‌క్తులు బ్లాక్ మార్కెట్‌లో ఎల్పీజీ విక్రయాలు చేప‌ట్ట‌డం లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ నియంత్రణ ఆర్డర్, అవసరమైన సరుకుల చట్టం (Essential Commodities Act) ప్రకారం చట్టవిరుద్ధం అయినా కొంద‌రు య‌థేచ్ఛ‌గా ఆ ప‌ని కొన‌సాగిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. పోలీసుల నిఘా పెరగడంతో కొంతమంది బ్లాక్ మార్కెట్ వ్యాపారులు బహిరంగంగా కార్యకలాపాలు నిలిపివేసినా, మరికొందరు రహస్యంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఆపరేటర్లు కేవలం పరిచయాల ద్వారానే వ్యాపారం నిర్వహిస్తున్నారు. మరికొందరు స్టౌవ్ మరమ్మత్తు దుకాణాలు లేదా కిరాణా షాపుల నుంచి రహస్య రీఫిల్లింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసి ఈ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. సాధారణ ప్రజల ఆందోళ‌న‌, భ‌యాలు, గ్యాస్‌ అవసరాలను ఆసరాగా చేసుకుని ఈ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది.

బ్లాక్ మార్కెట్‌లో రీఫిల్‌ సిలిండ‌ర్ ధ‌ర రూ.3500..

రాజస్థాన్‌లోని కోటా నగరం కోచింగ్ హబ్‌గా ప్రసిద్ధి పొందింది. ఈ ప్రాంతంలో హాస్టళ్లు, మెస్‌లకు సంబంధించిన నిర్వాహకులు కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం వంట చేయడానికి రోజుకు సుమారు 600 నుంచి 700 ఎల్పీజీ సిలిండర్లు అవసరమవుతున్నాయని వారు చెప్పారు. ఎల్పీజీ కొరత ప్రారంభమైనప్పుడు జిల్లా పరిపాలన విభాగం ప్రత్యేక కోటా కేటాయిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు సిలిండర్లు లేదా కేటాయింపుకు సంబంధించిన అవసరమైన ఫార్మాట్ అందలేదని వారు తెలిపారు. దీంతో రోజువారీ వంట అవసరాలను తీర్చేందుకు బ్లాక్ మార్కెట్‌లో రూ.3వేల నుంచి రూ.3,500 వరకు చెల్లించి సిలిండర్లు కొనుగోలు చేయాల్సి వస్తోందని కోటా హాస్టల్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ మిట్ట‌ల్ పీటీఐకి తెలిపారు.

పెట్రోల్‌, డీజిల్ నిల్వ‌లు స‌రిప‌డా ఉన్నాయి: కేంద్రం

భారత్‌ తన క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 88 శాతం, సహజ వాయువు అవసరాల్లో 50 శాతం, ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతులపై ఆధారపడి ఉంది. అయితే వంటగ్యాస్ సరఫరాపై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో సిలిండర్ల నిల్వలు, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా అధికారులు దాడులు, ఆకస్మిక తనిఖీలు పెంచినట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. అలాగే 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ ప్రారంభమైందని చెప్పారు. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత‌ శర్మ మాట్లాడుతూ దేశీయ వినియోగానికి సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నప్పటికీ వినియోగదారులు భయంతో అధికంగా బుకింగ్ చేయడం కొనసాగుతోందని తెలిపారు. దేశంలో తగినంత క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయని, దేశీయ రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ఆమె చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వ‌లు స‌రిప‌డా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

మధ్యప్రాచ్య ప్రాంతంలోని భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్నప్పటికీ ప్రభుత్వం ఎల్పీజీ సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని ఆమె తెలిపారు. ముఖ్యంగా గృహ వినియోగదారులకు సరఫరాను ప్రాధాన్యంగా ఉంచుతున్నామని అన్నారు. అయితే వినియోగదారుల పానిక్ బుకింగ్ కారణంగా ఎల్పీజీ రీఫిల్ బుకింగ్స్ భారీగా పెరిగాయి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే సిలిండర్ బుక్ చేయాలని ఆమె వినియోగదారులను కోరారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లను వినియోగదారులకు ప్రాధాన్యంగా పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంచామని తెలిపారు.

Advertisement
Advertisement