త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OMC Shares | పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెంపు ఎఫెక్ట్‌.. భారీగా ప‌త‌న‌మైన ఓఎంసీల షేర్లు..

OMC Shares | దేశ ప్ర‌జ‌లు ఇంధ‌నాన్ని పొదుపు చేయాల‌ని ప్ర‌ధాని మోదీ పిలుపు ఇచ్చిన అనంత‌రం శుక్ర‌వారం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లను కేంద్రం పెంచ‌గా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) షేర్లు మాత్రం భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. యుద్ధం త‌రువాత వెంట‌నే ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచ‌కపోవ‌డంతో అప్ప‌టి నుంచి ఆయా కంపెనీల‌కు రోజుకు సుమారుగా రూ.1వేయి కోట్ల మేర న‌ష్టం వ‌స్తుంద‌ని గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి.

S

Business | Published On May 15, 2026, 5.26 pm IST

OMC Shares | పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెంపు ఎఫెక్ట్‌.. భారీగా ప‌త‌న‌మైన ఓఎంసీల షేర్లు..
Advertisement

OMC Shares | దేశ ప్ర‌జ‌లు ఇంధ‌నాన్ని పొదుపు చేయాల‌ని ప్ర‌ధాని మోదీ పిలుపు ఇచ్చిన అనంత‌రం శుక్ర‌వారం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లను కేంద్రం పెంచ‌గా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) షేర్లు మాత్రం భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. యుద్ధం త‌రువాత వెంట‌నే ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచ‌కపోవ‌డంతో అప్ప‌టి నుంచి ఆయా కంపెనీల‌కు రోజుకు సుమారుగా రూ.1వేయి కోట్ల మేర న‌ష్టం వ‌స్తుంద‌ని గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఓఎంసీల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపుగా రూ.1 ల‌క్ష కోట్ల‌కు పైనే న‌ష్టం వాటిల్లింద‌ని స‌మాచారం. అయితే న‌ష్టాల‌ను భ‌ర్తీ చేసేందుకు ఓఎంసీల‌కు వెంట‌నే అవ‌కాశం ల‌భించ‌లేదు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేంద్రం ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచ‌లేదు. కానీ ఎన్నిక‌లు ముగిసి అంతా స‌ద్దుమ‌ణిగిన నేప‌థ్యంలో దేశ ప్ర‌జ‌ల‌కు కేంద్రం పెట్రో వాత వ‌డ్డించింది. పెట్రోల్‌, డీజిల్‌పై లీట‌ర్‌కు ఒక్కోటి రూ.3 చొప్పున పెంచుతున్న‌ట్లు తెలిపింది. దీంతో ఓఎంసీల‌కు న‌ష్టాలు భ‌ర్తీ అవుతాయ‌ని భావించారు. కానీ వాస్త‌వానికి ఈ పెంపు కంటి తుడుపు చ‌ర్య‌నే అని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇంధ‌న ధ‌ర‌ల పెంపు వ‌ల్ల ఓఎంసీల‌కు రోజుకు కేవ‌లం రూ.120 కోట్ల మేర మాత్ర‌మే న‌ష్టాలు భ‌ర్తీ అవుతాయ‌ని, అయిన‌ప్ప‌టికీ ఇంకా భారీ మొత్తంలో న‌ష్టమే వ‌స్తుంద‌ని అంటున్నారు.

చ‌మురు ధ‌ర‌లు పెరిగినా..

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లను అనుకున్న మేర పెంచ‌క‌పోవ‌డంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల‌కు న‌ష్టాలు భ‌ర్తీ అయ్యే అవ‌కాశాలు ఇప్ప‌ట్లో క‌నిపించ‌డం లేదు. యుద్ధం త‌రువాత బ్యారెల్ ముడి చ‌మురు ధ‌ర‌లు 50 శాతానికి పైగా పెరిగాయి. దీంతో చ‌మురు ధ‌ర‌ల పెంపున‌కు అనుగుణంగా ఇంధ‌న ధ‌ర‌లు పెర‌గ‌క‌పోవ‌డంతో కంపెనీలు త‌మ సొంత నిధుల్లోంచి న‌ష్టాల‌ను భ‌ర్తీ చేస్తూ వ‌చ్చాయి. కానీ ఆశించిన స్థాయిలో పెంపు లేక‌పోవ‌డంతో కంపెనీల‌కు ఇంకా కొంత కాలం న‌ష్టాల‌ను త‌ప్ప‌క భ‌రించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఈ ప్ర‌భావం ఆయా కంపెనీల షేర్ల‌పైనా ప‌డింది. శుక్ర‌వారం ఉద‌యం నుంచే ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచిన‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో మార్కెట్లు ప్రారంభం కాగానే ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ (ఐవోసీ), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌), భారత్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ (బీపీసీఎల్‌) కంపెనీల‌కు చెందిన షేర్లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి.

భారీ న‌ష్టాల్లో షేర్లు..

ఐవోసీ షేర్లు 4.12 శాతం మేర ప‌త‌న‌మై 134.48 వద్ద ముగియ‌గా, బీపీసీఎల్ షేర్లు 3.58 శాతం మేర క్షీణించి 284.45 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. అలాగే హెచ్‌పీఎసీఎల్ షేర్లు 2.95 శాతం మేర ప‌డిపోయి 366.40 వ‌ద్ద ముగిశాయి. అంత‌ర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు సైతం శుక్ర‌వారం స్వ‌ల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.60 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 108 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 2.03 శాతం ఎగ‌సి బ్యారెల్‌కు 99 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. చ‌మురు ధ‌ర‌లు ఆకాశాన్నంటుతుండ‌డం, అందుకు అనుగుణంగా ఇంధ‌న ధ‌ర‌లు పెర‌గ‌క‌పోవ‌డంతో ఓఎంసీలు తీవ్ర న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి. అయితే యుద్ధంపై స్ప‌ష్టత లేకున్నా, ఇంకా ఎక్కువ కాలం ఇదే ప‌రిస్థితి ఉన్నా ఆయా కంపెనీలు మ‌రింత భారీ ఎత్తున న‌ష్ట‌పోతాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Advertisement