త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karnataka | కర్నాటక రాజకీయాల్లో కుదుపు..! ఢిల్లీకి సిద్ధరామయ్య, డీకే..! సీఎం మార్పు కోసమేనా..?

Karnataka | కర్నాటక రాజకీయాల్లో మరోసారి నాయకత్వ మార్పు చర్చలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి జీ పరమేశ్వర ఢిల్లీకి చేరుకోవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌ అధిష్ఠానంతో జరిగే సమావేశాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

P

National | Published On May 26, 2026, 6.37 am IST

Karnataka | కర్నాటక రాజకీయాల్లో కుదుపు..! ఢిల్లీకి సిద్ధరామయ్య, డీకే..! సీఎం మార్పు కోసమేనా..?
Advertisement

Karnataka | కర్నాటక రాజకీయాల్లో మరోసారి నాయకత్వ మార్పు చర్చలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి జీ పరమేశ్వర ఢిల్లీకి చేరుకోవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌ అధిష్ఠానంతో జరిగే సమావేశాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. రెండు, మూడు రోజుల్లో సీఎం పదవిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఇప్పటి వరకు కాంగ్రెస్‌ నాయకత్వం నుంచి అధికారిక ప్రకటనేది రాలేదు. సిద్ధరామయ్య ప్రత్యేక విమానంలో హోంమంత్రి పరమేశ్వరతో కలిసి ఢిల్లీకి వెళ్లగా.. డీకే శివకుమార్ వేరుగా ఢిల్లీ చేరుకున్నారు. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పుపై చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించాలని బహిరంగంగానే డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు కీలక నేతలు ఢిల్లీకి చేరుకోవడంతో మళ్లీ చర్చలు జోరందుకున్నాయి.

పార్టీ వర్గాల సమాచారం మేరకు.. కాంగ్రెస్‌ అధిష్ఠానం రాజ్యసభ ఎన్నికలు, కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ, శాసన మండలి ఎన్నికలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం-పార్టీ సమన్వయంపై కూడా సమావేశంలో చర్చ జరగొచ్చని సమాచారం. కర్ణాటక కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా మాట్లాడుతూ రాజ్యసభ ఎన్నికలపై పార్టీలో అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయని, ఇతర అంశాలపై ఊహాగానాలు వద్దని వ్యాఖ్యానించారు. అయినా ముఖ్యమంత్రి పదవిపై చర్చలు మాత్రం ఆగడం లేదు. ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. సమావేశానికి రావాలని పిలుపు వచ్చిందని, అజెండా ఏమిటో తనకు తెలియజేయలేదన్నారు.

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సమావేశ సమయం, తేదీ వివరాలు మాత్రమే చెప్పారని తెలిపారు. మరోవైపు డీకే శివకుమార్ మాట్లాడుతూ కొన్ని పరిస్థితుల్లో ఢిల్లీకి రావాల్సిన అవసరం ఉంటుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ అంశంపై నేరుగా స్పందించకుండా, రాహుల్‌ గాంధీ చర్చిస్తారని చెప్పారు. ఇప్పటికే రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నాయకత్వ అంశం గత ఏడాదిన్నరగా వివాదాస్పదంగానే కొనసాగుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ చర్చల మధ్య జీ పరమేశ్వర పేరు సైతం కాంగ్రెస్‌ వర్గాల్లో వినిపిస్తుంది. ఢిల్లీలో జరుగుతున్న సమావేశాల తర్వాత కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే కన్నడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement