త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఇండిగో సంక్షోభం శాంపిల్ మాత్ర‌మే.. ఇది ఇలాగే జ‌రిగితే అన్ని రంగాల్లోనూ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డడం ఖాయం..

S

National | Published On Dec 7, 2025, 10.42 am IST

ఇండిగో సంక్షోభం శాంపిల్ మాత్ర‌మే.. ఇది ఇలాగే జ‌రిగితే అన్ని రంగాల్లోనూ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డడం ఖాయం..
Advertisement

ఏ రంగంలో అయినా ప్రైవేటు గుత్తాధిప‌త్యం ఉంటే, అందులోనూ ఒక‌టి రెండు సంస్థ‌ల ఏక ఛ‌త్రాధిప‌త్యం ఉంటే ఏం జ‌రుగుతుందో ఇండిగో విమాన సంస్థ సంక్షోభం మ‌న‌కు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించింది. విమాన టిక్కెట్లను త‌క్కువ ధ‌ర‌ల‌కే అందిస్తున్నామ‌ని చెప్పిన ఇండిగో వ‌ల్ల ఇత‌ర సంస్థ‌లు మూత ప‌డ్డాయి. ఇప్పుడు ఆ సంస్థ‌తోపాటు ఎయిర్ ఇండియా మాత్ర‌మే అత్య‌ధిక శాతం మార్కెట్ వాటాను క‌లిగి ఉన్నాయి. అలాంట‌ప్పుడు సంక్షోభం ఏర్ప‌డితే ఏం జ‌రుగుతుంది..? టిక్కెట్ల ధ‌ర‌లు ఆకాశాన్నంటుతాయి. అదే జ‌రిగింది. మొద‌ట్నుంచి ఈ రెండింటి గుత్తాధిప‌త్యం ఉంద‌ని తెలియ‌దా..? అయినా ప‌ట్టించుకోలేదంటే ఎవ‌రు చేసిన త‌ప్పిదం..? ఎయిరిండియా ప్రైవేటీక‌ర‌ణ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు మేలే జ‌రుగుతుంద‌ని చెప్పిన మేథావులు ఇప్పుడు ఏం మాట్లాడ‌తారు..? అయితే ఇది ఒక్క విమాన‌యాన రంగానికే ప‌రిమితం కాలేదు. టెలికాం రంగంలో ఎప్పుడో మొద‌లైంది.

టెలికాం రంగంలో..

అప్ప‌ట్లో డొకొమొ, యూనినార్‌, ఎయిర్‌సెల్‌, రిల‌యన్స్ మొబైల్‌, ఐడియా, వొడాఫోన్‌, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ ఇలా చాలా కంపెనీలు పోటీ ప‌డ్డాయి. కానీ జియో వ‌ల్ల అన్ని కంపెనీలు మూత ప‌డ్డాయి. అప్ప‌ట్లో ప్రీపెయిడ్ మొబైల్‌కు లైఫ్ టైమ్ వాలిడిటీ రీచార్జి చేసుకుంటే నంబ‌ర్ జీవితాంతం ఉండేది. వినియోగ‌దారులు త‌మ‌కు కావ‌ల్సిన‌ప్పుడు మాత్ర‌మే రూ.10, రూ.20, రూ.100 ఇలా రీచార్జి చేసుకుని టాక్ టైం పొంది ఆ మేర స‌ర్వీసుల‌ను వాడుకునేవారు. కానీ జియో వ‌ల్ల ఇప్పుడు కేవలం 2 కంపెనీల చేతుల్లోనే టెలికాం భ‌విష్య‌త్తు వెళ్లే ప్ర‌మాదం వ‌చ్చింది. జియో చేసిన ప‌నికి ఇప్పుడు లైఫ్ టైం రీచార్జి లేదు. మ‌హా అయితే ఏడాది వాలిడిటీ ఉంది. కానీ అప్ప‌టి లైఫ్ టైం ప్రీపెయిడ్ రీచార్జి ప్లాన్ క‌న్నా ఇప్ప‌టి ఏడాది రీచార్జి ప్లాన్ ఖ‌రీదు చాలా ఎక్కువ‌గా ఉంది. ఇక ఇప్పుడు రూ.10, రూ.20 ప్యాక్‌లు లేవు. వినియోగ‌దారులు చ‌చ్చిన‌ట్లు నెల‌కు క‌నీసం రూ.200 లేదా ఆ పైన రీచార్జి చేసుకోవాల్సిందే. ప్ర‌భుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్‌ను అన్ని విధాలుగా ప‌తనం చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్నారు. దీంతో జియో వంటి ప్రైవేటు టెలికాం సంస్థలు ఆడిందే ఆట పాడిందే పాట‌గా మారాయి.

అన్ని రంగాల్లోనూ..

జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి చూస్తే అన్ని రంగాల్లోనూ ఇలాంటి ఉదాహ‌ర‌ణ‌లు మ‌న‌క క‌నిపిస్తాయి. దేశంలో చాలా వ‌ర‌కు ప్ర‌భుత్వ స్కూళ్లు మూత ప‌డుతున్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఇది ఇలాగే కొన‌సాగితే భ‌విష్య‌త్తులో అస‌లు ప్ర‌భుత్వ స్కూళ్లు ఉండ‌వు. ప్ర‌జ‌లు క‌చ్చితంగా ప్రైవేటు స్కూళ్ల‌కే త‌మ పిల్ల‌ల‌ను పంపాలి. దీని వ‌ల్ల వారు ఎంత‌టి ఫీజుల‌ను వ‌సూలు చేస్తారో ఇప్పుడే మ‌నం ఊహించుకోవ‌చ్చు. అలాగే నిర్మాణ రంగానికి ముఖ్య‌మైన సిమెంట్ విష‌యంలోనూ ఏక‌ఛ‌త్రాధిప‌త్యం దిశ‌గా బ‌డా పారిశ్రామిక వేత్త‌లు పావులు క‌దుపుతున్నారు. దీంతో భ‌విష్య‌త్తులో ఒకరిద్ద‌రు సిమెంట్ వ్యాపారులు మాత్ర‌మే ఉంటారు. వారు ఏం చెబితే ఇక ప్ర‌జ‌లు మాత్ర‌మే కాదు ప్ర‌భుత్వాలు కూడా అది వినాల్సిందే. ఇండిగో విమాన సంస్థ విష‌యంలో జ‌రిగింది ఇదే. ఏక‌ఛ‌త్రాధిప‌త్యం వ‌ల్ల, వారికి ఉన్న మార్కెట్ షేర్ కార‌ణంగా వారు చేసిన ప‌నికి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌న‌సు రావ‌డం లేదు. దీంతో ఆ కంపెనీకి షోకాజ్ నోటీసుల‌ను జారీ చేసి విడిచిపెట్టింది. అదే ఇత‌ర దేశాల్లో అయితే అలాంటి విమాన సంస్థ‌ను త‌క్ష‌ణ‌మే నిషేధించి భారీ ఎత్తున జ‌రిమానా విధించేవారు.

వాళ్లు ఏది చెబితే అది మ‌నం వినాలా..?

విమాన‌యాన రంగంలో ఇండిగోకు ఉన్న మార్కెట్ వాటా దాదాపు 70 శాత‌మ‌ని అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఇండిగో అతి పెద్ద సంస్థ‌గా ఉంద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. క‌నుక‌నే అలాంటి సంస్థ‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం వెనుకాడుతోంది. పైగా ఇండిగోకు భ‌య‌ప‌డి కేంద్రం తాను తీసుకువ‌చ్చిన నూత‌న విమాన‌యాన సంస్థ నియ‌మాల‌ను వెన‌క్కి తీసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. అంటే ఆ కంపెనీ ఏం చెబితే ఇప్పుడు ప్ర‌భుత్వం అది వింటుంద‌న్న‌మాట‌. అలాంటి స్థితికి ఇప్పుడు మ‌నం వ‌చ్చాం. ఇది అన్ని రంగాల్లోనూ కొన‌సాగితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. అనుక్ష‌ణం ప్రైవేటీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తు ఇస్తూ ప్రైవేటును వెన‌కేసుకు వ‌చ్చే కొంత‌మంది కుహ‌నా మేథావులు, రాజ‌కీయ నాయ‌కులకు ఇండిగో సంక్షోభం ఒక పెద్ద పాఠం చెబుతుంద‌న్న విష‌యం అక్ష‌ర స‌త్యం. ఇప్ప‌టికైనా మేల్కొన‌క‌పోతే అటు ప్ర‌జ‌లు, ఇటు ప్ర‌భుత్వాలు ఇలాంటి సంస్థ‌ల చెప్పు చేత‌ల్లో ప‌నిచేయాల్సి ఉంటుంది. అప్పుడు భార‌త్ ప్ర‌జాస్వామ్య దేశం అని అన‌డంలో అర్థం లేదు.

Advertisement

తాజావార్తలు

Advertisement