త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Railway | రైల్వే రిజ‌ర్వేష‌న్ సిస్ట‌మ్‌లో భారీ మార్పులు.. ఆగ‌స్టు నుంచే అమ‌లు..!

Indian Railway | భార‌తీయ రైల్వే రిజ‌ర్వేష‌న్ ప్ర‌క్రియ‌లో స‌మూల మార్పుల‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతున్న‌ది. నాలుగు ద‌శాబ్దాలుగా కొన‌సాగుతున్న ప్ర‌స్తుత ప్యాసింజ‌ర్ రిజ‌ర్వేష‌న్ సిస్ట‌మ్ (PRS) స్థానంలో అత్యాధునిక సాంకేతిక‌తతో రూపొందించిన కొత్త సిస్ట‌మ్‌ను ఆగ‌స్టు నుంచి ద‌శ‌ల‌వారీగా అమ‌లులోకి తీసుకురానున్న‌ది.

P

National | Published On Jun 8, 2026, 4.16 pm IST

Indian Railway | రైల్వే రిజ‌ర్వేష‌న్ సిస్ట‌మ్‌లో భారీ మార్పులు.. ఆగ‌స్టు నుంచే అమ‌లు..!
Advertisement

Indian Railway | భార‌తీయ రైల్వే రిజ‌ర్వేష‌న్ ప్ర‌క్రియ‌లో స‌మూల మార్పుల‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతున్న‌ది. నాలుగు ద‌శాబ్దాలుగా కొన‌సాగుతున్న ప్ర‌స్తుత ప్యాసింజ‌ర్ రిజ‌ర్వేష‌న్ సిస్ట‌మ్ (PRS) స్థానంలో అత్యాధునిక సాంకేతిక‌తతో రూపొందించిన కొత్త సిస్ట‌మ్‌ను ఆగ‌స్టు నుంచి ద‌శ‌ల‌వారీగా అమ‌లులోకి తీసుకురానున్న‌ది. టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం, సామర్థ్యాన్ని పెంచడం, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే ఈ మార్పుల ప్రధాన లక్ష్యమని రైల్వేశాఖ వెల్లడించింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పురోగతిని పరిశీలించారు. కొత్త వ్యవస్థ అమలులోకి వచ్చే సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి రైల్వేశాఖ సహాయ మంత్రులు వీ సోమన్న, రవ్‌నీత్ సింగ్ బిట్టు సైతం హాజ‌ర‌య్యారు.

1986 నాటి వ్యవస్థకు గుడ్‌బై..

ప్రస్తుతం అమల్లో ఉన్న ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ను 1986లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి కొన్ని ప‌రిమితంగా అప్‌గ్రేడ్ చేస్తూ వ‌స్తున్నారు. పెరుగుతున్న ఆన్‌లైన్ బుకింగ్ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో అప్‌గ్రేడ్ జ‌రుగ‌డం లేదు. తాజాగా దాని స్థానంలో స‌రికొత్తగా సాంకేతిక‌త ఆధారంగా కొత్త వ్య‌వ‌స్థ‌ను రూపొందించారు. భారతీయ రైల్వేలు 2002లో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సేవలను ప్రారంభించగా.. ప్రస్తుతం ఎక్కువ మంది ప్రయాణికులు రిజర్వేషన్ కౌంటర్లకు వెళ్ల‌కుండానే డిజిటల్ వేదిక‌ల ద్వారానే టికెట్ల‌ను బుక్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మొత్తం రైల్వే టికెట్ బుకింగ్‌లలో సుమారు 88 శాతం ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

రైల్‌వన్ యాప్‌కు ఆద‌ర‌ణ‌

రైల్వేల డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా గ‌తేడాది జూలైలో ప్రారంభించిన ‘రైల్‌వన్’ యాప్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఏడాది పూర్తికాకముందే ఈ యాప్ 3.5 కోట్లకు పైగా డౌన్‌లోడ్లు సాధించింది. ఒకే వేదికపై టికెట్ బుకింగ్, టికెట్ క్యాన్సలేష‌న్‌, రన్నింగ్ స్టేటస్, ప్లాట్‌ఫాం, కోచ్ వివరాలు, ఫిర్యాదుల నమోదు వంటి అనేక సేవలను ఈ యాప్‌లోనే సేవ‌లు పొందే అవ‌కాశం ఉన్న‌ది. ప్రస్తుతం రోజుకు సగటున 9.29 లక్షల టికెట్లు ఈ యాప్ ద్వారా బుక్ అవుతున్నాయి. వీటిలో 7.2 లక్షల వరకు అన్‌రిజ‌ర్వ్‌డ్ కాగా.. 2.09 లక్షల రిజ‌ర్వ్‌డ్ టికెట్లు ఉన్నాయ‌ని రైల్వేశాఖ వివ‌రించింది.

వెయిటింగ్ టికెట్లకు..

ఈ ఏడాది ప్రారంభంలో రైల్వేలు ప్రవేశపెట్టిన ఏఐ ఆధారిత వెయిటింగ్ లిస్ట్ ఎస్టిమేష‌న్ ఫీచర్‌కు కూడా ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వెయిటింగ్‌లో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలను ఈ సాంకేతికత ముందుగానే అంచనా వేస్తుంది. ప్రారంభంలో 53 శాతం వరకు ఉన్నఎస్టిమేష‌న్ ఖచ్చితత్వం ప్రస్తుతం 94 శాతానికి పెరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మరింత సులభంగా రూపొందించుకునే అవకాశం కలుగుతోంది. ఇదిలా ఉండ‌గా.. ఆగస్టు నుంచి కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ అమల్లోకి వచ్చిన తర్వాత టికెట్ బుకింగ్ ప్రక్రియ మరింత వేగంగా, స్మార్ట్‌గా, విశ్వసనీయంగా మారుతుందని రైల్వేశాఖ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

Advertisement
Advertisement