త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LPG Gas | హార్ముజ్ దాటి 92,700 మెట్రిక్ టన్నుల గ్యాస్ వ‌స్తోంది.. కీల‌క వివ‌రాలు వెల్ల‌డించిన కేంద్రం..!

P

National | Published On Mar 14, 2026, 7.02 pm IST

LPG Gas | హార్ముజ్ దాటి 92,700 మెట్రిక్ టన్నుల గ్యాస్ వ‌స్తోంది.. కీల‌క వివ‌రాలు వెల్ల‌డించిన కేంద్రం..!
Advertisement

LPG Gas | ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త ప‌రిస్థితుల మ‌ధ్య భార‌త్‌లో వంట‌గ్యాస్ స‌ర‌ఫ‌రా నిరంత‌రాయంగా కొన‌సాగేందుకు కేంద్రం చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసింది. భారీ ప‌రిమాణంలో ఎల్‌పీజీని తీసుకువస్తున్న రెండు ట్యాంకర్లు ప్రస్తుతం హార్ముజ్ జలసంధిని దాటి భార‌త్ వైపుగా ప్ర‌యాణం కొన‌సాగిస్తున్నాయ‌ని శ‌నివారం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ‘శివాలిక్’, ‘నందా’ పేర్లు గ‌ల‌ నౌక‌లు మొత్తం 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువ‌స్తున్నాయి. షిప్పింగ్ మినిస్ట్రీ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఆయా నౌక‌లు ప్ర‌ణాళిక ప్ర‌కారం ప‌శ్చిమ తీరంలోని ముంద్రా, కాండ్లా పోర్టుల‌కు చేరుకుంటాయ‌ని, షెడ్యూల్ ప్ర‌కారం ఈ నెల 16, 17 తేదీల్లో భార‌త్‌కు చేరుకుంటాయ‌ని తెలిపింది. దాంతో దేశీయ మార్కెట్‌లో గ్యాస్ ల‌భ్య‌త పెరిగి, ప‌రిశ్ర‌మ‌లు, గృహ అవ‌స‌రాల‌కు సాఫీగా స‌ర‌ఫ‌రా పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

బుకింగ్స్ ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌న సుజాత శ‌ర్మ‌..

పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ మాట్లాడుతూ ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు గ్యాస్ దొర‌క‌ద‌న్న భ‌యంతో ఎక్కువ‌గా బుకింగ్ చేయ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌న్నారు. అయితే, గ్యాస్ కొర‌త ఎక్క‌డ లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. నిన్నటి వరకు రోజుకు సుమారు 7.5 నుంచి 7.6 మిలియన్‌ బుకింగ్స్ న‌మోద‌య్యాయ‌ని, ప్ర‌స్తుతం అవి 8.8 మిలియ‌న్ల‌కు చేరుకున్నాయ‌ని వెల్ల‌డించారు. కొన్ని ప్రాంతాల నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ అవ‌డం లేద‌ని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయ‌న్నారు. పట్టణాల్లో గత డెలివరీ తర్వాత కనీసం 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు గ్యాప్‌ ఉండాలని నిబంధన ఉందని గుర్తుచేశారు. ఆ కాలం పూర్తికాక ముందే బుకింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తే రిఫీల్ బుక్ కాద‌ని సుజాత శ‌ర్మ స్ప‌ష్టం చేశారు. ప్రజలు వ్యక్తిగతంగా డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాలకు వెళ్లి క్యూల్లో నిలబడాల్సిన అవసరం లేదని, ఐవీఆర్‌ఎస్‌, ఎస్ఎంఎస్‌, వాట్సాప్‌, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మొబైల్ యాప్‌ల ద్వారా సులభంగా బుకింగ్‌ చేసుకోవచ్చని స్ప‌ష్టం చేశారు. గతంలాగే సిలిండర్లు నేరుగా ఇంటికే సరఫరా అవుతాయని, అందువల్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.

క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై దృష్టి..

ఇక కమర్షియల్ సిలిండర్ల సరఫరాపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చల అనంతరం నిర్దిష్ట పరిమాణంలో ఎల్పీజీని కమర్షియల్ వినియోగానికి కేటాయించారు. ఇప్పటికే సుమారు 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కమర్షియల్ సిలిండర్ల పంపిణీ ప్రారంభ‌మైంది. ప్రస్తుతం సుమారు 84 శాతం బుకింగ్‌లు ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్నాయని, త్వరలోనే 100 శాతానికి చేర్చే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సముద్ర రవాణా రంగంలో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రత విష‌యంలో ఆందోళ‌ల‌న్నీ తొల‌గిపోయాయి. గ‌త 24 గంటల్లో 30 మంది భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

బ్లాక్ మార్కెటింగ్‌పై కొర‌డా..!

దేశంలో గ్యాస్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా బ్లాక్ మార్కెటింగ్‌పై కేంద్రం కఠిన చర్యలకు ఉప‌క్ర‌మించింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో సంయుక్త బృందాలు దాడులు జ‌రుపుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో అత్య‌ధికంగా సుమారు 1,400 ప్రదేశాల్లో దాడులు జరిపి, అక్రమాలకు పాల్పడిన 19 మందిపై కేసులు నమోదు చేశారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతున్నాయి. ఒకవైపు భారీ ఎల్పీజీ దిగుమతులు కొనసాగిస్తూ.. మరోవైపు అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటూ వంట‌గ్యాస్ స‌ర‌ఫ‌రాలో ఆటంకాలు లేకుండా చూసేందుకు కేంద్రం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ముంద్రా, కాండ్లా పోర్టులకు చేరుకోనున్న 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ దేశీయ అవసరాలను తీర్చడంలో కీలకంగా మారనుంది.

Advertisement
Advertisement