త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India Solar Market | అమెరికాను దాటేసిన భారత్.. సోలార్ పవర్‌లో మనమే నెంబర్ 2

సౌర విద్యుత్ రంగంలో భారత్ సంచలనం సృష్టించింది. ఏకంగా అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సోలార్ మార్కెట్‌గా అవతరించింది.

J

National | Published On May 27, 2026, 7.13 pm IST

India Solar Market | అమెరికాను దాటేసిన భారత్.. సోలార్ పవర్‌లో మనమే నెంబర్ 2
Advertisement

India Solar Market | త్రినేత్ర.న్యూస్ : క్లీన్ ఎనర్జీ, పర్యావరణ అనుకూల అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్న భారత్.. సౌర విద్యుత్ (Solar Energy) రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే 'రెండో అతిపెద్ద సోలార్ మార్కెట్‌'గా అవతరించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వేగంగా అడుగులు వేస్తున్న మన దేశం.. ఈ అరుదైన మైలురాయిని చేరుకుని ఇంధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో చైనా మొదటి స్థానంలో కొనసాగుతుండగా, తాజాగా అమెరికా మూడో స్థానానికి పడిపోయింది.

రికార్డు స్థాయి వృద్ధి.. 14 నెలల్లోనే మ్యాజిక్

గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం రికార్డు స్థాయిలో ఏకంగా 44.6 గిగావాట్ల (GW) సోలార్ సామర్థ్యాన్ని అదనంగా జోడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 87 శాతం వృద్ధి కావడం విశేషం. దీంతో దేశంలో మొత్తం ఇన్‌స్టాల్ చేసిన సోలార్ కెపాసిటీ ఏకంగా 150 గిగావాట్ల మార్క్‌ను దాటేసింది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారత్‌లో తొలి 50 గిగావాట్ల సామర్థ్యాన్ని చేరుకోవడానికి 11 ఏళ్ల సుదీర్ఘ సమయం పట్టగా.. లేటెస్ట్‌గా 50 గిగావాట్లను కేవలం 14 నెలల్లోనే ఇన్‌స్టాల్ చేయడం మన స్పీడ్‌కు నిదర్శనం.

ఈ అద్భుత వృద్ధికి కారణాలేంటి?

సోలార్ ప్యానెళ్లు, పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థాయి నుంచి.. నేడు గ్లోబల్ సోలార్ ఆర్కిటెక్ట్‌గా మారడం వెనుక ప్రభుత్వ పథకాలు కీలక పాత్ర పోషించాయి.

పీఎం సూర్య ఘర్ (PM Surya Ghar Muft Bijli Yojana): ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసి, ప్రతి ఇంటిని మినీ పవర్ ప్లాంట్‌గా మార్చే ఉద్దేశ్యంతో కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది.

పీఎం కుసుమ్ (PM-KUSUM): వ్యవసాయ భూములు, గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ పంపుల ఏర్పాటును విస్తృతంగా ప్రోత్సహించారు.

తయారీకి ఊతం: దేశీయంగా సోలార్ ప్యానెళ్లు, సెల్స్ భారీ ఎత్తున తయారు చేసేలా 'ప్రొడక్షన్ లింక్డ్ ఇన్‌సెంటివ్' (PLI) స్కీమ్ ద్వారా కంపెనీలకు ప్రభుత్వం రాయితీలు అందించింది.

టాప్ ప్లేస్‌లో రాజస్థాన్

సోలార్ విద్యుత్ ఉత్పత్తి అనగానే విస్తారమైన ఎడారి, అనుకూలమైన సూర్యరశ్మి ఉన్న రాష్ట్రాలు ముందుంటాయి. ఈ కోవలో దేశవ్యాప్తంగా చూస్తే.. భారీ లార్జ్-స్కేల్ సోలార్ ప్రాజెక్టులతో రాజస్థాన్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్రలు ఉన్నాయి.

2030 నాటికి భారీ లక్ష్యం

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 2030 నాటికి దేశంలో 500 గిగావాట్ల నాన్-ఫాజిల్ ఫ్యూయల్ (శిలాజ రహిత ఇంధనం) సామర్థ్యాన్ని చేరుకోవాలని భారత్ భారీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో దేశీయ సోలార్ కెపాసిటీ సులభంగా 280 నుంచి 300 గిగావాట్లకు చేరుకుంటుందని 'నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా' (NSEFI) అంచనా వేస్తోంది.

Advertisement
Advertisement