త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RBI Plastic Notes | త్వరలో మీ జేబుల్లోకి రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లు.. మరి పాత కాగితం నోట్ల పరిస్థితేంటి?

త్వరలో మార్కెట్‌లోకి రూ.10, రూ.20 ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లు రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఫీల్డ్ ట్రయల్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాలివే!

J

National | Published On Jul 27, 2026, 9.13 pm IST

RBI Plastic Notes | త్వరలో మీ జేబుల్లోకి రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లు.. మరి పాత కాగితం నోట్ల పరిస్థితేంటి?
Advertisement
  • రూ.10, రూ.20 డినామినేషన్లలో ప్లాస్టిక్ (పాలిమర్) నోట్ల ఫీల్డ్ ట్రయల్స్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
  • ఒక్కో డినామినేషన్‌లో 100 కోట్ల చొప్పున మొత్తం 200 కోట్ల ప్లాస్టిక్ నోట్లు మార్కెట్‌లోకి
  • ఈ ప్లాస్టిక్ నోట్ల రాకతో ప్రస్తుతం ఉన్న కాగితం నోట్లు రద్దు కావని, రెండూ చెలామణిలో ఉంటాయని కేంద్రం స్పష్టం
  • కాగితం నోట్ల కంటే ఈ పాలిమర్ నోట్లు 2.5 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి, పైగా ఇవి వాటర్ ప్రూఫ్

RBI Plastic Notes | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర ప్రభుత్వం (Central Government), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కరెన్సీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి. త్వరలో రూ.10, రూ.20 ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను (Polymer Banknotes) దేశవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా (Field trials) ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని సోమవారం లోక్‌సభలో (Lok Sabha) కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు.

మొత్తం ఎన్ని నోట్లు వస్తున్నాయంటే?

ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ చేసిన ఈ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద రూ.10 డినామినేషన్‌లో 100 కోట్ల నోట్లు, రూ.20 డినామినేషన్‌లో మరో 100 కోట్ల నోట్లు ముద్రించనున్నారు. అంటే మొత్తం 200 కోట్ల ప్లాస్టిక్ నోట్లను మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. దేశవ్యాప్తంగా వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఇవి ఎలా పనిచేస్తాయో పరిశీలించేందుకు ఈ ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే, భవిష్యత్తులో వీటిని రెగ్యులర్‌గా జారీ చేస్తారు.

కాగితం నోట్లు రద్దవుతాయా?

కొత్తగా ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయి కదా అని, ప్రస్తుతం ఉన్న కాగితం నోట్లు (Paper currency) రద్దవుతాయేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ పాలిమర్ నోట్లు ప్రస్తుత కాగితపు నోట్లకు అదనంగా మాత్రమే వస్తాయని, కాగితం నోట్లను రీప్లేస్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. అలాగే డిజిటల్ పేమెంట్లకు, నగదుకు ఎవరి ప్రాధాన్యత వారిదేనని, ఈ కొత్త నోట్ల వల్ల డిజిటల్ లావాదేవీలపై పడే ప్రభావాన్ని ట్రయల్స్ తర్వాతే అంచనా వేస్తామని ఆయన పేర్కొన్నారు.

ప్లాస్టిక్ నోట్లే ఎందుకు?

ప్రస్తుతం ఉన్న కాగితం నోట్లు త్వరగా చిరిగిపోవడం, చెమట, నీరు తగిలితే మురికి పట్టడం వంటి సమస్యలు ఉన్నాయి. కానీ పాలిమర్ నోట్లు వాటర్ ప్రూఫ్ (Waterproof), డర్ట్-రెసిస్టెంట్ కాబట్టి త్వరగా పాడవ్వవు. ఇవి కాగితం నోట్ల కంటే సుమారు 2.5 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే నకిలీ నోట్లను అరికట్టేందుకు వీలుగా ట్రాన్స్‌పరెంట్ విండోస్, హోలోగ్రామ్స్ వంటి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లను (Security features) ఇందులో సులభంగా పొందుపరచవచ్చు.

భారీగా పెరుగుతున్న ప్రింటింగ్ ఖర్చులు

కరెన్సీ ప్రింటింగ్ ఖర్చులు ఏటేటా భారీగా పెరుగుతున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణకు రూ.5,101.4 కోట్లు ఖర్చు కాగా, 2025 ఆర్థిక సంవత్సరం నాటికి అది ఏకంగా రూ.6,372.8 కోట్లకు చేరింది. చిన్న నోట్లు త్వరగా పాడవుతుండటంతో ప్రతి ఏడాదీ కోట్లాది పాడైన నోట్లను ఆర్‌బీఐ వెనక్కి తీసుకుంటోంది. పాలిమర్ నోట్లకు ప్రారంభ ముద్రణ ఖర్చు ఎక్కువైనా, అవి ఎక్కువ కాలం మన్నుతాయి కాబట్టి లాంగ్ రన్‌లో రీప్లేస్‌మెంట్ ఖర్చు తగ్గుతుంది. దీనికోసం ఆర్‌బీఐ అనుబంధ సంస్థ BRBNMPL ఇప్పటికే 68,000 రీమ్‌ల పాలిమర్ సబ్‌స్ట్రేట్ కోసం గ్లోబల్ టెండర్లను (Global tender) ఆహ్వానించింది.

మీకు తెలుసా?

భారత్‌లో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టాలని 2012లోనే పైలట్ ప్రాజెక్టును ప్లాన్ చేశారు. కానీ అప్పటి టెక్నాలజీ, ఏటీఎంల (ATMs) నిర్వహణ పరిమితుల వల్ల ఆ ప్రాజెక్టును ఆపేశారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆస్ట్రేలియా (1988లో), కెనడా, యూకే సహా దాదాపు 60 దేశాలు ఇప్పటికే ఈ పాలిమర్ కరెన్సీని వాడుతున్నాయి.

Advertisement
Advertisement