త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heat-Drought | సంక్షోభం దిశగా ప్రపంచం.. 2090 నాటికి ప్రమాదంలో 260 కోట్ల మంది..!

Heat-Drought | ప్రపంచం వేగంగా వాతావరణ సంక్షోభం వైపు దూసుకెళ్తోంది. తీవ్ర ఉష్ణోగ్రతలు, కరువు ఒకేసారి ముప్పుగా మారుతున్నాయి. తాజాగా జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ప్రస్తుత వాతావరణ విధానాల్లో మార్పులు లేకపోతే ఈ శతాబ్దం చివరినాటికి ప్రపంచ జనాభాలో సుమారు 28 శాతం మంది అంటే దాదాపు 2.6 బిలియన్ మంది ఈ సంక్షోభం బారినపడే ప్రమాదం ఉందని వెల్లడించింది.

P

National | Published On May 4, 2026, 9.30 am IST

Heat-Drought | సంక్షోభం దిశగా ప్రపంచం.. 2090 నాటికి ప్రమాదంలో 260 కోట్ల మంది..!
Advertisement
  • భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు, కరువు
  • శతాబ్దం చివరి నాటికి ఐదురెట్లు పెరుగనున్న ప్రభావం

Heat-Drought | ప్రపంచం వేగంగా వాతావరణ సంక్షోభం వైపు దూసుకెళ్తోంది. తీవ్ర ఉష్ణోగ్రతలు, కరువు ఒకేసారి ముప్పుగా మారుతున్నాయి. తాజాగా జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ప్రస్తుత వాతావరణ విధానాల్లో మార్పులు లేకపోతే ఈ శతాబ్దం చివరినాటికి ప్రపంచ జనాభాలో సుమారు 28 శాతం మంది అంటే దాదాపు 2.6 బిలియన్ మంది ఈ సంక్షోభం బారినపడే ప్రమాదం ఉందని వెల్లడించింది. అధ్యయనం ప్రకారం.. ఈ ప్రభావం ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే ఐదురెట్లు పెరిగే అవకాశం ఉన్నది. 2001 నుంచి 2020 మధ్య కాలంలో తీవ్ర ఉష్ణోగ్రతలు, కరువు ఒకేసారి సంభవించిన సందర్భాలు సగటున ఏడాదికి నాలుగు సార్లు నమోదయ్యాయి.

ఇది 1850 నుంచి 1900 మధ్య ఉన్న పారిశ్రామిక యుగంతో పోలిస్తే రెట్టింపుగా ఉంది. 2090 నాటికి ఈ తరహా పరిస్థితులు సంవత్సరానికి పదిసార్లు చోటుచేసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రతి సంఘటన సుమారు రెండు వారాల పాటు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ తరహా పరిస్థితిని ‘కాంపౌండ్ ఎక్స్‌ట్రీమ్‌’గా పిలుస్తారు. అంటే తీవ్ర వాతావరణ ఘటనలు కలిసి వాటి ప్రభావాన్ని మరింత పెంచినప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. దీంతో పంటలు వేగంగా ఎండిపోవడం, నీటి వనరులు తగ్గిపోవడం, అడవుల్లో అగ్నిప్రమాదాల ముప్పు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. అలాగే ఆహార ధరలు పెరగడం, హీట్‌వేవ్స్‌ కారణంగా మరణాల ప్రమాదం పెరగడం జరుగుతోంది. ఈ పరిస్థితి ప్రపంచ ఆహార భద్రతపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వర్గాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే, పారిస్ ఒప్పందం కింద దేశాలు తమ వాతావరణ కట్టుబాట్లను సమర్థంగా అమలు చేస్తే ఈ ముప్పును గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని అధ్యయనం సూచిస్తోంది. రాబోయే దశాబ్దాల్లో కోట్లాది ప్రజల భద్రత, అసురక్షిత పరిస్థితులు ఈ విధానాలపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ అధ్యయనంలో ఎనిమిది వాతావరణ మోడల్స్‌ ఆధారంగా 152 సిమ్యులేషన్లను విశ్లేషించారు. జనాభా పెరుగుదల, గ్లోబల్ వార్మింగ్‌కు సంబంధించిన పలు పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నారు. ఐక్యరాజ్యసమితి వాతావరణ శాస్త్ర సంస్థ రూపొందించిన ఆరో అంచనా నివేదిక ఆధారంగా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. 1961 నుంచి 1990 మధ్యకాలాన్ని ప్రామాణికంగా తీసుకొని అధ్యయనం నిర్వహించారు.

Advertisement
Advertisement