త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CBSE | సీబీఎస్ఈ రీ–ఎవాల్యుయేషన్‌లో సాంకేతిక సమస్యలు.. కేంద్రం సీరియస్‌

CBSE | సీబీఎస్ఈ రీ–ఎవాల్యుయేషన్‌ ప్రక్రియలో ఎదురైన సాంకేతిక సమస్యలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని సీబీఎస్ఈని ఆదేశించారు.

P

National | Published On May 24, 2026, 9.45 pm IST

CBSE | సీబీఎస్ఈ రీ–ఎవాల్యుయేషన్‌లో సాంకేతిక సమస్యలు.. కేంద్రం సీరియస్‌
Advertisement

CBSE | సీబీఎస్ఈ రీ–ఎవాల్యుయేషన్‌ ప్రక్రియలో ఎదురైన సాంకేతిక సమస్యలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని సీబీఎస్ఈని ఆదేశించారు. బోర్డు పరీక్షల ఫలితాల అనంతరం రీ–ఎవాల్యుయేషన్‌, ఆన్సర్‌ షీట్‌ వెరిఫికేషన్‌కు భారీగా దరఖాస్తులు రావడంతో పోర్టల్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో వెబ్‌సైట్‌ పలుమార్లు క్రాష్‌ కావడం, పేమెంట్‌ గేట్‌వేలో సమస్యలు తలెత్తడం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసింది. చాలామందికి డబ్బులు కట్‌ అయినా దరఖాస్తు పూర్తికాలేదని ఫిర్యాదులు వచ్చాయి. మరికొందరు స్కాన్‌ చేసిన ఆన్సర్‌ షీట్లు బ్లర్‌గా ఉండటం, కొన్ని పేజీలు కనిపించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఆన్సర్‌ షీట్లలో సమాధానాల మూల్యాంకనం తప్పుగా జరిగిందని, కొన్ని సమాధానాలను పరిశీలించలేదని కూడా విద్యార్థులు ఆరోపించారు. ఈ అంశాలపై సాంకేతిక లోపాలు ఎక్కడ జరిగాయి, బాధ్యత ఎవరిది అనే దానిపై సంబంధిత సంస్థల నుంచి వివరణ కోరినట్లు సమాచారం. సీబీఎస్ఈ మాత్రం విద్యార్థుల విద్యా ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పిస్తామని స్పష్టం చేసింది. ఈ ఏడాది 98.6 లక్షలకు పైగా ఆన్సర్‌ షీట్లను ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ విధానంలో మూల్యాంకనం చేసినట్లు తెలిపింది. తక్కువ సమయంలో అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో తాత్కాలిక సాంకేతిక సమస్యలు తలెత్తాయని అంగీకరించింది. అన్ని ఫిర్యాదులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.

సాంకేతిక ఇబ్బందుల కారణంగా రీ–ఎవాల్యుయేషన్‌, వెరిఫికేషన్‌ దరఖాస్తుల గడువును మే 24 వరకు పొడిగించింది. ఇంకా స్కాన్‌ కాపీలు అందని విద్యార్థుల కోసం చివరి కాపీ పంపిన తర్వాత మరో రెండు రోజుల పాటు పోర్టల్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. ఇక ఈ ఏడాది ఫీజుల్లో కూడా సీబీఎస్ఈ మార్పులు చేసింది. ఆన్సర్‌ షీట్‌ స్కాన్‌ కాపీ ధరను రూ.700 నుంచి రూ.100కు తగ్గించింది. వెరిఫికేషన్‌ ఫీజును కూడా రూ.500 నుంచి రూ.100కు కుదించింది. రీ–ఎవాల్యుయేషన్‌కు ఒక్కో ప్రశ్నకు రూ.25గా నిర్ణయించింది. పారదర్శక విధానాన్ని ఎక్కువ మంది విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని బోర్డు తెలిపింది.

Advertisement
Advertisement