త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | 10 ఏళ్ల‌లో 50 వేల మ‌రుగుదొడ్ల‌ను కూడా నిర్మించ‌లేక‌పోయారు : ప్ర‌ధాని మోదీ

PM Modi | సుమారు 2,800 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (DFC) ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వ‌చ్చింది. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లోని 3 కీలక విభాగాలను ప్ర‌ధాని మోదీ (PM Modi) ఇవాళ జాతికి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా యూపీఏ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

D

National | Published On Sep 8, 2026, 2.46 pm IST

PM Modi | 10 ఏళ్ల‌లో 50 వేల మ‌రుగుదొడ్ల‌ను కూడా నిర్మించ‌లేక‌పోయారు : ప్ర‌ధాని మోదీ
Advertisement
  • గ‌త ప‌దేళ్ల‌లోనే తాము 50వేల అత్యాధునిక రైళ్ల‌ను నిర్మించాం
  • డీఎఫ్‌సీ ప్రాజెక్టుకు ముందుకు తీసుకెళ్ల‌లేదు
  • 2,800 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ..
  • డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ
  • ఆ అబ‌ద్ధాల ప్ర‌తిధ్వ‌ని ప్ర‌జ‌ల‌ను తప్పుదోవ ప‌ట్టిస్తోంది

PM Modi | త్రినేత్ర‌.న్యూస్ : డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (DFC) పూర్తి చేయడంలో జరిగిన జాప్యంపై గ‌త యూపీఏ ప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. 2006లోనే ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టును మంజూరు చేసినప్పటికీ, తదుపరి 8 ఏళ్లలో కేవలం కాగితాలకే పరిమితమైందన్నారు. ఒక్క కిలోమీటర్ మార్గాన్ని కూడా పూర్తి చేయలేకపోయారని విమ‌ర్శించారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించిన‌ట్లు తెలిపారు.

ప్ర‌ధాని మంగ‌ళ‌వారం త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా వ‌డోద‌ర (Vadodara)లో రూ.35,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లోని 3 కీలక విభాగాలు జాతికి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన ‘నమో ఫర్ విక‌సిత్ భారత్’ కార్యక్రమంలో ప్ర‌ధాని ప్ర‌సంగించారు.

2,800 కిలోమీటర్ల డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పూర్తి

వికసిత భారత్ లక్ష్య సాధనలో కనెక్టివిటీ అత్యంత కీలకం. కాలానికి అనుగుణంగా వేగ‌వంత‌మైన క‌నెక్టివిటీ అవ‌స‌రం. వడోదర గతి శక్తి విశ్వవిద్యాలయానికి నిలయం. సుమారు 2,800 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ తుది అనుసంధాన పనులు ఇక్క‌డే పూర్త‌య్యాయి. 21వ శతాబ్దపు భారతదేశానికి ఇది నిజంగా ఒక చారిత్రాత్మక మైలురాయి అని ప్ర‌ధాని తెలిపారు. గత 12 ఏళ్లలో దేశ పనితీరు సంస్కృతి, ప్రభుత్వ విభాగాల పనితీరులో వచ్చిన మార్పులకు ఈ ప్రాజెక్టు పూర్తికావడమే నిదర్శనమ‌ని ప్ర‌ధాని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్ట్ పెద్దగా పురోగతి సాధించలేదని, పనులు నత్తనడకన సాగాయని ఆయన విమర్శించారు.

ఈ ప్ర‌త్యేక స‌ర‌కు ర‌వాణా కారిడార్ వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ప్ర‌ధాని వివ‌రించారు. ఈ మౌలిక స‌దుపాయం స‌ర‌కు ర‌వాణా ప్ర‌యాణ స‌మ‌యాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌డ‌మే కాకుండా.. ఇంధ‌న వినియోగం, ఖ‌ర్చులు కూడా త‌గ్గుతాయ‌ని చెప్పారు. గ‌తంలో స‌ర‌కు ర‌వాణా రైళ్లు 100 కిలోమీట‌ర్ల ప్ర‌యాణానికి ఆరున్న‌ర గంట‌ల స‌మ‌యం తీసుకునేవ‌ని పేర్కొన్నారు. ఇప్పుడు అవే రైళ్లు స‌గం కంటే త‌క్కువ స‌మ‌యంలోనే ప్ర‌యాణాన్ని పూర్తి చేస్తున్నాయ‌ని వివ‌రించారు. గతంలో ట్రక్కుల ద్వారా ఒక నిర్దిష్ట దూరాన్ని ప్రయాణించడానికి సుమారు 30 గంటల సమయం పట్టేద‌ని.. ఇప్పుడు ప్రత్యేక సరకు రవాణా కారిడార్ ద్వారా అదే దూరాన్ని 10-12 గంటల్లోనే చేరుకోగలవని తెలిపారు.

ఆ ఫైళ్లకు కూడా 'డెడికేటెడ్ కారిడార్' లభించలేదు

ఈ ఫ్రైట్ కారిడార్ ఆలోచన తొలిసారిగా 2004లో వ‌చ్చింద‌ని, 2006లో ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అయితే 2014 వరకు ఈ ప్రాజెక్టు ఫైళ్లు కేవలం బ్యూరోక్రటిక్ జాప్యంతో ఒక టేబుల్ నుంచి మరో టేబుల్‌కు మారుతూనే ఉన్నాయని విమ‌ర్శించారు. చివరికి ఆ ఫైళ్లకు కూడా ఒక 'డెడికేటెడ్ కారిడార్' లభించలేదని ఎద్దేవా చేశారు. పరిపాలనాపరమైన జాప్యం కారణంగానే అప్పట్లో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు. ఈ ఏడాది ఎర్రకోట నుంచి 'సప్తధార' గురించి మాట్లాడాడిన విష‌యాన్ని ప్ర‌ధాని గుర్తు చేశారు. అందులో గతి శక్తి కూడా ఒక భాగమని స్పష్టం చేశారు. ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పూర్తికావడం ద్వారా దేశంలో సరకు రవాణా మరింత వేగవంతం, సమర్థవంతంగా మారుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

50 వేల మ‌రుగుదొడ్ల‌ను కూడా నిర్మించ‌లేదు..

ఇదే సంద‌ర్భంగా దేశంలో విస్త‌రిస్తున్న రైలు త‌యారీ సామ‌ర్థ్యం, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌ను ప్ర‌ధాని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు. గత దశాబ్ద కాలంలో రైల్వే రంగంలో సాధించిన పురోగతిని, గ‌త ప్రభుత్వాల పనితీరుతో పోలుస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత దశాబ్ద కాలంలో భారతదేశం రైల్వే కోచ్‌లు, మెట్రో కోచ్‌లు, లోకోమోటివ్‌ల‌ (రైలు ఇంజిన్‌) తయారీలో ప్రపంచంలోనే ఒక ప్రధాన తయారీదారుగా (Major Manufacturer), స్వయం సమృద్ధ దేశంగా ఆవిర్భవించిందని తెలిపారు. గ‌త ప‌దేళ్ల‌లోనే తాము 50వేల అత్యాధునిక రైళ్ల‌ను నిర్మించామ‌ని చెప్పారు. కానీ గ‌త ప్ర‌భుత్వం 10 ఏళ్ల‌లో 50 వేల మ‌రుగుదొడ్ల‌ను కూడా నిర్మించ‌లేక‌పోయింద‌ని విమ‌ర్శించారు.

అబ‌ద్ధాల ప్ర‌తిధ్వ‌ని..

ఈ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష నేత రాహుల్‌పై కూడా ప్ర‌ధాని వ్యంగాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ నిర్వహించిన 'ఛాత్రోం కీ గూంజ్' (విద్యార్థుల ప్రతిధ్వని) కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. ఈ అబ‌ద్ధాల ప్ర‌తిధ్వ‌ని ప్ర‌జ‌ల‌ను తప్పుదోవ ప‌ట్టిస్తోంద‌ని ఎద్దేవా చేశారు. అయితే, మ‌న దేశ యువ‌తను త‌క్కువ అంచ‌నా వేయొద్ద‌న్నారు. వారికి ఏది త‌ప్పు, ఏది ఒప్పు, ఏది నిజం, ఏది అబ‌ద్ధ‌మో తెలుసున‌ని వ్యాఖ్యానించారు.

యువ‌త‌కు కీల‌క పిలుపు..

ప్ర‌స్తుత సాంకేతిక ప్ర‌పంచంలో ఏఐని అందిపుచ్చుకోవాల‌ని యువ‌త‌కు ప్ర‌ధాని పిలుపునిచ్చారు. వ్యవసాయం, వైద్యం, తయారీ, రోబోటిక్స్ రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టించేందుకు ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తోందని చెప్పారు. అందుకే మ‌న దేశ యువ‌త ఏఐని ఉప‌యోగించ‌డం చాలా ముఖ్య‌మ‌న్నారు. ఇందుకోసం ప్ర‌భుత్వం త‌ర‌ఫున పెద్ద క్యాంపెయిన్‌ణు ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భార‌త‌దేశం ల‌క్ష్యాన్ని సాధించ‌డాన్ని మ‌నం అత్యంత ప్రాధాన్య‌త‌గా భావించాల‌ని సూచించారు.

డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అంటే..?

సరుకు రవాణాను వేగవంతంగా, మరింత సమర్థవంతంగా చేయడానికి నిర్మించిన ప్రత్యేక రైల్వే లైన్ల నెట్‌వర్క్‌ను డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (Dedicated Freight Corridor - DFC) అంటారు. ఈ ప్రాజెక్టును కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) అనే ప్రభుత్వ రంగ సంస్థ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులోని తూర్పు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (EDFC) 2024లోనే పూర్తైంది. పంజాబ్‌లోని లూథియానా నుంచి బీహార్‌లోని సోన్‌నగర్ వరకు.. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల గుండా సుమారు 1,337 కిలోమీర‌ట్ల మేర సాగుతుంది.

ఇక ప‌శ్చిమ కారిడార్‌కు చెందిన చివ‌రి మూడు భాగాల‌ను ప్ర‌ధాని ఇవాళ ప్రారంభించారు. ఈ ప‌శ్చిమ కారిడార్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని దాద్రీ నుంచి హ‌హారాష్ట్ర‌లోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ పోర్టు వ‌ర‌కు.. యూపీ, హ‌ర్యానా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌ల గుండా దాదాపు 1,506 కిలోమీట‌ర్ల మేర విస్త‌రించి ఉంది. దీంతో మొత్తం 2,843 కిలోమీటర్ల పొడవైన ప్రధాన మౌలిక సదుపాయాల నెట్‌వర్క్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన‌ట్లైంది.

Also Read..

కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత: ఎర్రవల్లిలో 'వెయ్యి డప్పుల' నిరసన.. సెక్షన్ 144 విధింపు

స్టైలిష్‌ లుక్‌లో శ్రుతి హాసన్‌.. నెట్టింట ఫొటోలు వైర‌ల్‌..

వ‌చ్చే ఏడాది ప‌ట్టాల‌పైకి బుల్లెట్ రైలు

Advertisement
Advertisement