త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

National Herald case | నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు.. ఈడీ పిటిషన్‌పై విచారణ వాయిదా..!

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు.. ఈడీ పిటిషన్‌పై విచారణ వాయిదా..!

P

National | Published On Apr 20, 2026, 6.28 pm IST

National Herald case | నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు.. ఈడీ పిటిషన్‌పై విచారణ వాయిదా..!
Advertisement

National Herald case | నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. జ‌స్టిస్ స్వ‌ర్ణ‌కాంత శ‌ర్మ బెంచ్ ఎదుట పిటిష‌న్ జాబితా కాగా.. విచార‌ణ‌ను మే 25వ తేదీకి వాయిదా వేశారు. ఈడీ, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరికొందరిపై దాఖలైన చార్జిషీట్‌పై ట్రయల్ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. చార్జిషీట్‌పై కోర్టు అభియోగాలను స్వీకరించేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించిందని ఈడీ పేర్కొంది. సమర్పించిన ఆధారాలు కేసు నమోదు చేసుకునేందుకు సరిపోతాయని, ఈ విషయంలో సమీక్ష అవసరమని ఈడీ వాదిస్తోంది.

గతేడాది డిసెంబర్ 22న ఈ కేసులో హైకోర్టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరికొందరికి నోటీసులు జారీ చేసింది. అలాగే, ట్రయల్ కోర్టు గతేడాది డిసెంబ‌ర్ 16న ఇచ్చిన ఉత్తర్వులపై ఈడీ దాఖలు చేసిన స్టే పిటిషన్‌పై నోటీసులు జారీ అయ్యాయి. ట్రయల్ కోర్టు, ఎఫ్‌ఐఆర్ లేకుండా ఈ కేసులో కాగ్నిజెన్స్ తీసుకోవడం చట్టపరంగా సాధ్యం కాదని పేర్కొంది. ఈ వ్యవహారంలో సుమన్ దూబే, శామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్, సునీల్ భండారి తదితరులకు నోటీసులు జారీ అయ్యాయి.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు దివంగత కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌లు మనీలాండరింగ్ కుట్రలో భాగమని ఈడీ ఆరోపిస్తూ వ‌స్తోంది. కేసులో సుమన్ దూబే, శామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ సంస్థల పాత్రపై ఆరోపణలు ఉన్నాయి. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన దాదాపు రూ.2వేల‌కోట్ల విలువైన ఆస్తులను అనుమానాస్పద మార్గాల్లో స్వాధీనం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. కేవ‌లం రూ.90కోట్ల రుణ మార్పిడితో యంగ్ ఇండియన్ సంస్థకు ఏజేఎల్ ఆస్తులపై నియంత్రణ లభించిందని, అందులో గాంధీ కుటుంబానికి 76 శాతం వాటా ఉందని ఈడీ వాదిస్తోంది.

ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాద‌న‌లు వినిపించారు. ఈ కేసు పూర్తిగా చట్టపరమైన ప్రశ్నకు సంబంధించింద‌ని పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు తీర్పు చట్టపరంగా తప్ప‌ని ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఈ అంశాన్ని వాస్తవాలకంటే చట్టపరమైన సూత్రాల ఆధారంగానే నిర్ణయించాల్సిన అవసరం ఉంద‌న్నారు. అయితే, ట్రయల్ కోర్టు, పీఎంఎల్‌ఏ చట్టం ప్రకారం ప్రాథమిక నేరానికి ఎఫ్‌ఐఆర్ లేకుండా ఈడీ ఫిర్యాదుపై విచారణ కొనసాగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ కేసు బీజేపీ నేత సుబ్రహ్మణ్య‌ స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు కేసు మొద‌లైంద‌ని, సీబీఐ 2014 సమన్ల తర్వాత కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని కోర్టు గుర్తించింది. ట్రయల్ కోర్టు తీర్పు వల్ల కొన్ని మనీలాండరింగ్ కేసుల్లో చట్టపరమైన లోపాలు ఏర్పడే అవకాశం ఉందని ఈడీ తన పిటిషన్‌లో పేర్కొంది. కేసులో ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని, కేవలం సాంకేతిక కారణాలతో వాటిని కొట్టిపారేయలేమని ఈడీ వాదిస్తోంది.

Advertisement
Advertisement