త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arvind Kejriwal | ప‌రిస్థితులు స‌త్యాగ్ర‌హం చేప‌ట్టేలా చేశాయి : ఆప్ క‌న్విన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్‌

Arvind Kejriwal | ఢిల్లీ ఎక్సైజ్ కేసులో కోర్టుకు హాజరుకాకూడదని కేజ్రీవాల్, సిసోడియా నిర్ణయించి దాన్ని సత్యాగ్రహంగా ప్రకటించారు. న్యాయమైన విచారణపై నమ్మకం లేదని లేఖల ద్వారా తెలిపారు. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం రాజ్‌ఘాట్‌ని సంద‌ర్శించి, మ‌హాత్ముడికి నివాళుల‌ర్పించారు.

P

National | Published On Apr 28, 2026, 3.56 pm IST

Arvind Kejriwal | ప‌రిస్థితులు స‌త్యాగ్ర‌హం చేప‌ట్టేలా చేశాయి : ఆప్ క‌న్విన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్‌
Advertisement

Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మణిష్ సిసోడియా మంగళవారం రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. వారి వెంట అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలు అతిషీ సైతం ఉన్నారు. మ‌ద్యం పాల‌సీ కేసులో ఢిల్లీ హైకోర్టులో విచార‌ణ‌కు హాజ‌రుకాకూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. దాన్ని ఆయ‌న ‘సత్యాగ్రహం’గా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ దేశ న్యాయవ్యవస్థపై తమకు పూర్తి గౌరవం ఉందన్నారు. “ఈరోజు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే అది న్యాయవ్యవస్థ వల్లే. ప్రస్తుత పరిస్థితులు మమ్మల్ని సత్యాగ్రహం చేపట్టేలా చేశాయి. ఈ అంశం చాలా సున్నితమైనది” అని పేర్కొన్నారు.

మ‌న‌స్సాక్షి మాట విన్న‌..

ఢిల్లీ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను న్యాయమూర్తి స్వరణ కాంత శర్మ విచారించడంపై కేజ్రీవాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాను వ్యక్తిగతంగా గానీ, తన తరఫున న్యాయవాదులు గానీ కోర్టులో హాజరుకావడం లేదని తెలిపారు. న్యాయమూర్తి స్వరణ కాంతా శర్మకు కేజ్రీవాల్ నాలుగు పేజీల లేఖ రాశారు. తన మనస్సాక్షి మాట విని ఈ నిర్ణయం తీసుకున్నానని, దాని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు. “ఇది నా న్యాయపరమైన ప్రయోజనాలకు నష్టం కలిగించినా తాను సిద్ధమే” అని తేల్చి చెప్పారు. అవసరమైతే ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కును ఉంచుకున్నట్లు స్పష్టం చేశారు. న్యాయం జరిగిందనే భావన మాత్రమే కాకుండా, అది జరిగిందని కనిపించాలి కూడా అని లేఖలో పేర్కొన్నారు.

ఈ కేసుకే ప‌రిమితం..

మహాత్మా గాంధీ సత్యాగ్రహం సిద్ధాంతాన్ని ఉద‌హ‌రించారు. ఈ నిర్ణయం కేవలం ఈ కేసుకే పరిమితమని కేజ్రీవాల్ వివరించారు. కొంతమంది న్యాయమూర్తులు తమ కుటుంబ సభ్యులు న్యాయవాదులుగా ఉన్నందున కేసుల నుంచి తప్పుకున్న ఉదాహరణలను సైతం గుర్తు చేశారు. న్యాయమూర్తి వ్యాఖ్య‌ల‌తో విచారణపై నమ్మకం కోల్పోయానని పేర్కొన్నారు. మ‌రో వైపు మ‌ణిష్ సిసోడియా సైతం జ‌స్టిస్ స్వ‌ర‌ణ కాంత శ‌ర్మ‌కు లేఖ‌రాశారు. తన తరఫున ఎలాంటి న్యాయవాది కూడా హాజరుకావడంలేదని, ఈ పరిస్థితుల్లో న్యాయం జరగదన్న నమ్మకం లేదని పేర్కొన్నారు. “ఇక మిగిలింది సత్యాగ్రహమే మార్గం” అని లేఖలో తెలిపారు.

అస‌లు ఏం జ‌రిగిందంటే..

ఈ కేసులో ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ కేసులో ట్ర‌య‌ల్ కోర్టు 23 మంది నిందితుల‌ను నిర్దోషుల‌గా విడుద‌ల చేసింది. తీర్పుపై సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌ను జ‌స్టిస్ స్వరణ కాంత శర్మ విచారిస్తున్నారు. ఏప్రిల్ 13న కేజ్రీవాల్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై, కేసు నుంచి తప్పుకోవాలని కోరారు. ఏప్రిల్ 20న కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. రాజకీయ నాయకులు న్యాయవ్యవస్థపై అనుమానాలు వ్యక్తం చేయొద్దంటూ వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తాజాగా కోర్టు విచార‌ణ‌కు హాజ‌రుకాకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు.

Advertisement
Advertisement