త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

S-400 Missiles | ర‌ష్యా నుంచి ఎస్‌-400 నాల్గో యూనిట్ వ‌స్తోంది..!

P

National | Published On Apr 28, 2026, 5.22 pm IST

S-400 Missiles | ర‌ష్యా నుంచి ఎస్‌-400 నాల్గో యూనిట్ వ‌స్తోంది..!
Advertisement

S-400 Missiles | ర‌ష్యా నుంచి అత్యాధునిక ఎస్‌-400 ట్రయంఫ్ మిస్సైల్ వ్య‌వ‌స్థ నాలుగో యూనిట్ త్వ‌ర‌లోనే భార‌త్ అందుక‌నుంది. ఈ విష‌యాన్ని భ‌ద్ర‌తా వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మే ప్రారంభంలో దేశానికి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపాయి. దాంతో భారత వాయుసేన (IAF) వైమానిక రక్షణ సామర్థ్యం మరింత బ‌ల‌ప‌డుతుంద‌ని వెల్ల‌డించారు. భారత్-రష్యా మధ్య 2018 అక్టోబర్‌లో సుమారు 5 బిలియన్ యూఎస్ డాలర్లతో ఒప్పందం కుదిరింది. ఈ మేర‌కు ఎస్-400 వ్యవస్థ ఐదు యూనిట్ల‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే మూడు యూనిట్లు భారత్‌కు చేరాయి. నాలుగో యూనిట్ ఇప్ప‌టికే ర‌ష్యా నుంచి బ‌య‌లుదేరిన‌ట్లుగా స‌మాచారం. ఐదో యూనిట్ నవంబర్ నాటికి అందే అవకాశం ఉందని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లో ప్ర‌ముఖ పాత్ర‌..

ఇటీవల భారత్ మరో ఐదు యూనిట్ల‌ను కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం సంఖ్య వాటి సంఖ్య ప‌దికి పెర‌గ‌నుంది. ఈ వ్యవస్థ భారత్ రక్షణ వ్యవస్థలో ప్ర‌ముఖ‌పాత్ర పోషిస్తోంది. అమెరికా ‘కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ సాంక్షన్స్ యాక్ట్’ (CAATSA) కింద ఆంక్షలు విధించే అవకాశం ఉన్నప్పటికీ.. తాజా కొనుగోలుపై పెద్దగా ప్రభావం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని భావిస్తున్నారు. ఇది ఇప్పటికే ఉన్న ఒప్పందానికి కొనసాగింపుగా భావిస్తున్న నేప‌థ్యంలో.. ఆంక్ష‌లు పెద్ద స‌మ‌స్య కాకపోవ‌చ్చ‌ని సంబంధిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

పాక్‌తో ఉద్రిక్త‌త‌ల స‌మ‌యంలో..

గ‌త ఏడాది మే 7 నుంచి 10 వ‌ర‌కు భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల స‌మ‌యంలో ఈ ఎస్-400 మిస్సైల్ వ్య‌వ‌స్థ‌ను భార‌త్ ఉప‌యోగించింది. దాయాది పంపిన మిస్సైల్స్‌ను విజ‌య‌వంతంగా అడ్డుకున్న నేప‌థ్యంలో.. మ‌రికొన్ని యూనిట్ల‌ను కొనుగోలు చేయాల‌నే ప్ర‌తిపాద‌న తెర‌పైకి వ‌చ్చింది. రష్యా ఇప్పటికే భారత సైనికులకు ఈ వ్యవస్థల నిర్వహణపై శిక్షణ ఇచ్చింది. ఎస్-400 ట్రయంఫ్ సిస్ట‌మ్ రష్యా త‌యారు చేసింది. భూభాగం నుంచి గగనతల లక్ష్యాలను కూల్చగల మిస్సైల్ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌. దాంతో భారత్ వైమానిక రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది.

Advertisement
Advertisement