త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Election Schedule | మోగిన ఎన్నిక‌ల న‌గారా..!

Election Schedule | దేశంలోని నాలుగు రాష్ట్రాల‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు న‌గారా మోగింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కేరళ, అసోంతో పాటు కేంద్ర పాలితప్రాంత‌మైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదివారం షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది

P

National | Published On Mar 15, 2026, 4.46 pm IST

Election Schedule | మోగిన ఎన్నిక‌ల న‌గారా..!
Advertisement
  • అసోం, కేర‌ళ‌, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్‌
  • త‌మిళ‌నాడులో ఏప్రిల్ 23న ఓటింగ్‌
  • బెంగాల్‌లో రెండు విడుత‌ల్లో ఎన్నిక‌లు
  • మే 4న ఫ‌లితాల ప్ర‌క‌ట‌న‌
  • షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌

Election Schedule | దేశంలోని నాలుగు రాష్ట్రాల‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు న‌గారా మోగింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కేరళ, అసోంతో పాటు కేంద్ర పాలితప్రాంత‌మైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదివారం షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించడంతో వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. రాష్ట్రాల వారీగా పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అసోం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఏప్రిల్‌ 9న ఓటింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ ప్ర‌క‌టించారు. తమిళనాడులో ఏప్రిల్‌ 23న పోలింగ్ జరుగుతుంది. ఇక పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు రెండు విడతల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. తొలి దశ ఏప్రిల్‌ 23న, రెండో దశ ఏప్రిల్‌ 29న పోలింగ్ జ‌రుగుతుంద‌ని ప్ర‌క‌టించారు.\

అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తయ్యిన తర్వాత మే 4న ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్న‌ట్లు వివ‌రించారు. ఈ రాష్ట్రాలు, పుదుచ్చేరి శాసనసభల పదవీకాలం మే, జూన్ నెలల్లో వేర్వేరు తేదీల్లో ముగియ‌నున్నాయి. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలను ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ద్వారా అప్‌డేట్ చేసిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మొత్తం సుమారు 17.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 824 అసెంబ్లీ స్థానాల కోసం ఎన్నికలు జ‌రుగ‌నుండ‌గా.. దేశవ్యాప్తంగా సుమారు 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. ఎన్నికల నిర్వహణకు దాదాపు 25 లక్షల మంది అధికారులు, సిబ్బందిని వినియోగించ‌నున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

అది ఎన్నిక‌ల క‌మిష‌న్ బాధ్య‌త‌..

అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లు ప్రతి పోలింగ్ స్టేషన్‌లో సగటున 750–900 మంది ఉన్నార‌ని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. మొత్తం 2.19 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుందని, 25 లక్షల మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది డ్యూటీలో ఉంటారని తెలిపారు. స‌ర్ కార్య‌క్ర‌మంపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై సైతం స్పందించారు. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 326 ప్ర‌కారం.. ఎల‌క్ష‌న్ క‌మిషన్‌కు ఒకటే బాధ్య‌త ఉంద‌న్నారు. అర్హ‌త ఉన్న ఓట‌ర్ల‌ను మాత్ర‌మే జాబితాలో చేర్చ‌డ‌మే త‌మ క‌ర్త‌వ్య‌మ‌ని, ఈ బాధ్య‌త‌ను స‌ర్ ద్వారా వాస్త‌వంగా నిర్వ‌ర్తిస్తున్నామ‌ని తెలిపారు. ఎన్నికలకు ముందు రాజకీయ వ్యక్తులు, పార్టీలు చేసిన ప్రకటనలపై ఎన్నికల సంఘం ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌బోద‌న్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమ‌లుకు ముందు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎలాంటి విధానప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌చ్చ‌ని, కానీ త‌ర్వాత అమ‌లు చేయ‌డానికి అనుమ‌తి లేద‌ని తెలిపారు. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో కోడ్ అమ‌లులోకి వ‌చ్చింద‌న్నారు. ఎన్నిక‌ల్లో హింస‌, ఆందోళ‌న‌ల‌ను స‌హించ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అవినీతి కార్య‌క‌లాపాలు, డీప్ ఫేక్‌, త‌ప్పుడు స‌మాచారాన్ని నోడ‌ల్ అధికారులు ప‌రిశీలించ‌డంతో పాటు అవ‌స‌ర‌మైతే ఎఫ్ఐఆర్ న‌మోదు చేస్తార‌న్నారు.

విదేశాల నుంచి అతిథులు..

ఎన్నిక‌ల్లో సుమారు 17.4 కోట్ల ఓటర్లు ఈ ఎన్నికల్లో భాగ‌మ‌వుతున్నార‌ని సీఈసీ తెలిపారు. ఈసారి ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా, జర్మనీ, కెనడా త‌దిత‌ర దేశాల నుంచి ప్ర‌త్యేకంగా అతిథులు ఎన్నిక‌ల‌ను ప‌రిశీలించేందుకు వ‌స్తున్నార‌ని తెలిపారు. 20కంటే ఎక్కువ దేశాల ఎన్నికల సంఘాల అధికారులు భారత ఎన్నికల పండుగలో పాల్గొని పారదర్శకత, సమర్థతను ప్రత్యక్షంగా చూడ‌బోతున్నార‌న్నారు. లక్షల మంది లెక్కల ఎన్నికల అధికారులు, భద్రతా సిబ్బందితో కలిసి ఎన్నికల సంఘం సమగ్ర, న్యాయపరమైన, పారదర్శకంగా ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు. ప్రతి ఓటర్‌కి పోలింగ్ కేంద్రంలో సౌకర్యవంతమైన ఓటింగ్ అనుభ‌వం క‌ల్పించేందుకు ఈసీ సిద్ధంగా ఉంద‌న్నారు. ఈ సారి తొలిసారిగా ఓటు వేయ‌బోతున్న యువ ఓట‌ర్ల‌కు ఆయ‌న ప్ర‌త్యేకంగా పిలుపునిచ్చారు. “మీరు జీవితంలో అత్యంత ముఖ్యమైన బాధ్యతలో అడుగుపెడుతున్నారని గుర్తుంచుకోండి. మీ ఓటు ద్వారా మీరు రాష్ట్రం, దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో కీల‌క‌పాత్ర నిర్వ‌హించ‌గ‌లుగుతారు. ఈ గొప్ప ప్రజాస్వామిక కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, బాధ్యత, గర్వంతో, విశ్వాసంతో ఓటు వేయాలని కోరుకుంటున్నాను” అంటూ పిలుపునిచ్చారు.

ఈ సారి కొత్త‌గా..

ఈ సారి నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రుగ‌నున్న ఎన్నిక‌ల్లో ఎన్నిక‌ల సంఘం కొత్త‌గా ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ మొబైల్ ఫోన్లను తాత్కాలికంగా డిపాజిట్ చేసుకునేలా ఏర్పాటు చేయ‌నుంది. ఈవీఎం బ్యాలెట్‌లో అభ్యర్థుల క‌ల‌ర్ ఫొటోలు, పెద్ద అక్ష‌రాల్లో పేర్ల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్న‌ట్లు పేర్కొంది. ఒక ప్రతి పోలింగ్ స్టేషన్‌లో గరిష్టంగా 1,200 ఓటర్లు మాత్ర‌మే ఓట్లు వేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. అభ్యర్థుల బూత్లు పోలింగ్ స్టేషన్ నుంచి 100 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయడం అనుమ‌తి ఉంటుంద‌ని పేర్కొంది. ఓటర్లకు ఇచ్చే సమాచారం స్లిప్‌లు స్పష్టంగా, మెరుగ్గా ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, ఓటర్ల, పార్టీల మరియు ఇతర స్టేక్‌హోల్డర్ల కోసం అన్ని కీలక సర్వీసులను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో పొందుప‌రిచిన‌ట్లు వివ‌రించింది. ఇక అన్ని పోలింగ్ స్టేషన్లలో 100శాతం వెబ్‌కాస్టింగ్ జరుగుతుంద‌ని, ఓటింగ్ శాతం డేటా ప్రతి రెండు గంటలకు ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ అవుతుంద‌ని వివ‌రించింది.

Advertisement
Advertisement