త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uniform Civil Code | UCC అమలుకు ముందే ఎన్డీయేలో లొల్లి.. అమిత్ షా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

2029కి ముందే దేశంలో UCC అమలు చేస్తామన్న అమిత్ షా ప్రకటనపై NDA కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీహార్‌లో మాత్రం కుదరదంటున్న JDU!

J

National | Published On Sep 15, 2026, 11.34 am IST

Uniform Civil Code | UCC అమలుకు ముందే ఎన్డీయేలో లొల్లి.. అమిత్ షా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

సంక్షిప్త సారాంశం

2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూసీసీ (UCC) అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దీనిపై జేడీయూ JD(U) స్పందిస్తూ.. కేంద్రంలో మద్దతు ఇస్తామని, కానీ బీహార్‌లో మాత్రం దీన్ని అమలు కానివ్వమని తేల్చిచెప్పింది. దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ముసాయిదాపై అందరితో చర్చలు జరపాలని చిరాగ్ పాశ్వాన్ డిమాండ్ చేశారు. టీడీపీ (TDP), శివసేన (Shiv Sena) పార్టీలు యూసీసీ నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ, అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలని కోరాయి.

Advertisement
  • యూసీసీ అమలుపై అమిత్ షా ప్లాన్
  • ఎన్డీయే కూటమిలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న మిత్రపక్షాలు
  • కేంద్రంలో ఓకే కానీ బీహార్‌లో అమలుకానివ్వం : జేడీయూ

Uniform Civil Code | త్రినేత్ర.న్యూస్ : 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే దేశంలోని బీజేపీ-ఎన్డీయే (BJP-NDA) పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ 'యూనిఫాం సివిల్ కోడ్' (UCC - ఉమ్మడి పౌరస్మృతి) తీసుకువస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, షా చేసిన ఈ ప్రకటన ఇప్పుడు అధికార కూటమిలోని మిత్రపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలకు దారితీసింది. కొన్ని పార్టీలు దీన్ని జాతీయ సమైక్యతగా చూస్తుంటే, మరికొన్ని పార్టీలు మాత్రం భారతదేశంలోని వైవిధ్యమైన ఆచారాలు, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాయి.

టీడీపీ (TDP), శివసేన (Shiv Sena), హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM) వంటి మిత్రపక్షాలు యూసీసీకి మద్దతు తెలుపుతుండగా.. జేడీయూ (JD(U)), లోక్‌ జనశక్తి పార్టీ (LJP - రామవిలాస్) వంటి పార్టీలు మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా జేడీయూ తాము కేంద్రంలో మద్దతు ఇస్తామని, కానీ తమ రాష్ట్రమైన బీహార్‌లో మాత్రం దీన్ని అమలు చేయడానికి అంగీకరించబోమని స్పష్టం చేయడం గమనాహారం.

"పార్లమెంట్‌లో మద్దతిచ్చాం.. కానీ బీహార్‌లో మాత్రం అనుమతించం"

పార్లమెంట్‌లో ఈ బిల్లు వచ్చినప్పుడు తమ పార్టీ అధినేత నితీశ్ కుమార్ స్పష్టమైన వైఖరిని ప్రకటించారని జేడీయూ నేత శ్యామ్ రజక్ పునరుద్ఘాటించారు. "మేము ఈ బిల్లును సమర్థిస్తామని మా నాయకుడు ముందే చెప్పారు. అయితే, మా రాష్ట్రంలో దీన్ని అమలు చేయడానికి మాత్రం అనుమతించబోమని స్పష్టం చేశాము. మా వైఖరి ఇప్పటికీ అదే" అని ఆయన తేల్చిచెప్పారు. ఈ అంశంపై బీజేపీ అగ్రనేతలతో త్వరలోనే చర్చిస్తామని జేడీయూ నేతలు తెలిపారు.

అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం: చిరాగ్ పాస్వాన్

మరో బీజేపీ మిత్రపక్షమైన ఎల్జేపీ (రామవిలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ కూడా యూసీసీపై వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని ఐదు, ఆరు షెడ్యూల్స్, ఆర్టికల్ 371A, 371G వంటి నిబంధనలు దేశంలోని వైవిధ్యాన్ని, గిరిజనుల హక్కులను కాపాడుతున్నాయని ఆయన గుర్తుచేశారు. యూసీసీ ముసాయిదాను బహిరంగపరిచి, అన్ని వర్గాల వారితో చర్చలు జరిపిన తర్వాతే తమ పార్టీ తుది నిర్ణయం ప్రకటిస్తుందని పాశ్వాన్ స్పష్టం చేశారు.

అందరికీ ఒకే చట్టం ఉండాల్సిందే : టీడీపీ

దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (UCC) ఉండాలనే భావనను తెలుగు దేశం పార్టీ (TDP) సమర్థిస్తోంది. అయితే ఏ చట్టం తెచ్చినా ముందుగా అన్ని మతాలు, విభిన్న వర్గాలకు చెందిన ప్రజలతో విస్తృతంగా చర్చించి, వారి సమ్మతి తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని ఆ పార్టీ స్పష్టం చేస్తోంది. మతం ఏదైనా వివాహం, విడాకులు, ఆస్తుల పంపిణీ వంటి అంశాల్లో అందరికీ ఒకే చట్టం ఉండటాన్ని స్వాగతిస్తున్నప్పటికీ.. మైనారిటీలు, గిరిజన వర్గాలు, నిపుణుల అభిప్రాయాలను గౌరవిస్తూ వారి ఆందోళనలను పరిష్కరించిన తర్వాతే యూసీసీపై తుది నిర్ణయం తీసుకోవాలని టీడీపీ గట్టిగా కోరుతోంది.

శివసేన, హెచ్‌ఏఎం (HAM) పార్టీలు మాత్రం అమిత్ షా ప్రకటనను సంపూర్ణంగా స్వాగతించాయి. సమానత్వం, జాతీయ సమైక్యత సాధనలో యూసీసీ కీలక పాత్ర పోషిస్తుందని శివసేన నేత శ్రీకాంత్ షిండే అభిప్రాయపడ్డారు.

అమిత్ షా ఏమన్నారు?

ముంబైలో జరిగిన ప్రెస్‌మీట్‌లో అమిత్ షా మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసి ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించామని, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో యూసీసీని అమలు చేశామని తెలిపారు. 2029 ఎన్నికల లోపు బీజేపీ-ఎన్డీయే పాలిత 21 రాష్ట్రాల్లోనూ దీన్ని అమల్లోకి తెస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమల్లో ఉండగా.. గుజరాత్, అసోం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు దీనికి సంబంధించి చట్టాలు చేశాయి. మతం ఏదైనా వివాహం, విడాకులు, వారసత్వపు హక్కులు వంటి విషయాల్లో అందరికీ ఒకే రకమైన చట్టం ఉండాలనేది ఈ ఉమ్మడి పౌరస్మృతి ప్రధాన ఉద్దేశం.

దేశవ్యాప్తంగా ఒకే చట్టం తీసుకురావాలనే బీజేపీ వ్యూహానికి, ప్రాంతీయ మిత్రపక్షాల భిన్న వైఖరీ మధ్య రాబోయే రోజుల్లో రాజకీయ చర్చ ఏ విధంగా సాగనుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement