త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Air Ambulance | కుప్ప‌కూలిన ఎయిర్ అంబులెన్స్‌.. ఏడుగురు దుర్మ‌ర‌ణం

Air Ambulance | జార్ఖండ్‌లోని చ‌త్రా జిల్లాలో సోమ‌వారం రాత్రి ఘోరం జ‌రిగింది. సిమారియా స‌మీపంలో ఓ ఎయిర్ అంబులెన్స్ కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు దుర్మ‌ర‌ణం చెందారు.

S

National | Published On Feb 24, 2026, 7.27 am IST

Air Ambulance | కుప్ప‌కూలిన ఎయిర్ అంబులెన్స్‌.. ఏడుగురు దుర్మ‌ర‌ణం
Advertisement

Air Ambulance | త్రినేత్ర‌.న్యూస్ : జార్ఖండ్‌లోని చ‌త్రా జిల్లాలో సోమ‌వారం రాత్రి ఘోరం జ‌రిగింది. సిమారియా స‌మీపంలో ఓ ఎయిర్ అంబులెన్స్ కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు దుర్మ‌ర‌ణం చెందారు. కాలిన గాయాల‌తో బాధ‌ప‌డుతున్న రోగిని రాంచీ నుంచి దేశ రాజ‌ధాని ఢిల్లీకి త‌ర‌లిస్తుండ‌గా ఈ ఘోర ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు జార్ఖండ్ ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఎయిర్ అంబులెన్స్‌లో ప్ర‌యాణిస్తున్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాంచీ నుంచి ఢిల్లీకి బ‌య‌ల్దేరిన ఈ ఎయిర్ అంబులెన్స్ చ‌త్రా జిల్లాలోని సిమారియా వ‌ద్ద కుప్ప‌కూలింద‌ని ఆ జిల్లా డిప్యూటీ క‌మిష‌న‌ర్ కీర్తిశ్రీ జీ మీడియాకు వెల్ల‌డించారు.

రాత్రి 7.30 గంట‌ల‌కు ఏటీసీతో సంబంధాలు క‌ట్

రెడ్‌బ‌ర్డ్ ఎయిర్‌వేస్ ప్ర‌యివేటు లిమిటెడ్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ సీ90 ఎయిర్ అంబులెన్స్ రాంచీలో సోమ‌వారం రాత్రి 7.11 గంట‌ల‌కు టేకాఫ్ అయింది. రాత్రి 7.30 గంట‌ల‌కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఆ త‌ర్వాత కాసేప‌టికే సిమారియా ప‌రిధిలోని బ‌రియ‌తు పంచాయ‌తీ ఏరియాలో అది కుప్ప‌కూలిన‌ట్లు స‌మాచారం అందింద‌ని డిప్యూటీ క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు. విమానం కుప్ప‌కూలిన ప్రాంతంలో ప్ర‌తికూల ప‌రిస్థితులు ఉన్నాయ‌ని తెలిపారు.

మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి త‌ర‌లిస్తుండ‌గా..

ఈ నెల 16వ తేదీన ల‌తేహార్ జిల్లాకు చెందిన‌ సంజ‌య్ కుమార్(41) 65 శాతం కాలిన గాయాల‌తో రాంచీలోని దేవ్‌క‌మ‌ల్ ఆస్ప‌త్రిలో చేరిన‌ట్లు ఆ హాస్పిట‌ల్ సీఈవో అనంత్ సిన్హా తెలిపారు. అయితే మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీకి త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. ఈ క్ర‌మంలోనే ఎయిర్ అంబులెన్స్‌ను సిద్ధం చేసి.. ఢిల్లీకి త‌ర‌లిస్తుండ‌గానే ఈ ప్ర‌మాదం జ‌రిగిందన్నారు.

బ‌ల‌మైన గాలులు.. భారీ వ‌ర్షం..

సోమ‌వారం రాత్రి సిమారియా ఏరియాలో వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయిన‌ట్లు స్థానికులు వెల్ల‌డించారు. బ‌ల‌మైన ఈదురుగాలులు, భారీ వ‌ర్షాల‌తో పాటు ఉరుములు, మెరుపులు సంభ‌వించాయ‌న్నారు. ఇక విమానం కుప్ప‌కూలిన స‌మ‌యంలో భారీ శ‌బ్దం వినిపించింద‌ని పేర్కొన్నారు.

మృతులు వీరే..

కెప్టెన్ వివేక్ వికాస్ భ‌గ‌త్
కెప్టెన్ స‌వ్‌రాజ్‌దీప్ సింగ్
సంజ‌య్ కుమార్(రోగి)
డాక్ట‌ర్ వికాస్ కుమార్ గుప్తా
స‌చిన్ కుమార్ మిశ్రా
అర్చ‌న దేవి
ధురు కుమార్

Advertisement
Advertisement