త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | కోటి మందికి AI శిక్షణ, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్‌ కోచింగ్‌.. ప్ర‌ధాని మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న‌లు

PM Modi | 80వ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సంద‌ర్భంగా ఎర్ర‌కోట (Red Fort) నుంచి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఉచిత ఆన్‌లైన్‌ కోచింగ్ , ఏఐ రంగంలో కోటి మంది యువతకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

D

National | Published On Aug 15, 2026, 1.17 pm IST

PM Modi | కోటి మందికి AI శిక్షణ, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్‌ కోచింగ్‌.. ప్ర‌ధాని మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న‌లు
Advertisement
  • మ‌హిళా బిల్లుకు మ‌ద్ద‌తివ్వండి.. క్రెడిట్ తీసుకోండి
  • దిమాగీ నక్సల్స్‌తో జాగ్ర‌త్త‌
  • ఎర్ర‌కోట వేడుక‌ల్లో తొలిసారి వందేమాత‌రం

PM Modi | త్రినేత్ర‌.న్యూస్ : దేశ‌వ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు (Independence Day) ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఢిల్లీలోని చారిత్ర‌క‌ ఎర్రకోట (Red Fort)పై ప్రధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీ (PM Modi) జాతీయ జెండాను ఎగుర‌వేశారు. అనంత‌రం జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా సాంకేతికత, విద్య, క్రీడలు, పౌర రక్షణ రంగంలో సంస్కరణలు, సెమీకండక్టర్ల త‌యారీ విస్త‌ర‌ణ‌, అణుశక్తి రంగాలకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌నలు చేశారు.

ముఖ్యంగా యువ‌త‌కు భారీ హామీలు ప్ర‌క‌టించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలపై కోచింగ్‌ ఫీజుల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్ర‌ధాని మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఉచిత ఆన్‌లైన్‌ కోచింగ్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంతేకాదు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రంగంలో కోటి మంది యువతకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.

Image

కోటి మంది యువతకు ఏఐ నైపుణ్య శిక్షణ..

ప్రపంచ‌వ్యాప్తంగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ వినియోగం భారీగా పెరిగిన నేప‌థ్యంలో.. రాబోయే ఏడాదిలోగా దేశ‌వ్యాప్తంగా సుమారు కోటి మంది యువ‌త‌కు ఏఐ స్కిల్స్ నేర్పించ‌నున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించారు. ఇటీవ‌లే ప్ర‌భుత్వం ఏఐ స‌మ్మిట్‌ను నిర్వ‌హించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని గుర్తు చేశారు. ఏఐ, క్వాంట‌మ్ టెక్నాల‌జీ, స్పేస్, రోబోటిక్స్‌, డేటా సెంట‌ర్ల రంగం వేగంగా విస్త‌రిస్తోంద‌ని తెలిపారు. కొత్త అవకాశాల‌ను అందిపుచ్చుకునేందుకు యువ‌త‌కు ట్రైనింగ్ ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. త‌ద్వారా ఏఐ రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే సామర్థ్యాన్ని భారత యువతకు కల్పించడమే లక్ష్యమని వెల్ల‌డించారు. దేశంలో యువత ఆధారంగా పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని మోదీ అన్నారు. ప్రస్తుతం దేశంలో 2.5 లక్షలకు పైగా స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నారని చెప్పారు.

పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్..

వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. "కోచింగ్ తరగతులు పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. అందుకే మేము వివిధ పోటీ పరీక్షల కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌ను అందించాల‌ని నిర్ణ‌యించాం. మ‌న వ‌ద్ద డిజిట‌ల్ ప‌బ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఉంది. ప్ర‌తిభగ‌ల ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ వనరులన్నింటినీ ఒకచోట చేర్చి దేశ యువతకు ఉచిత కోచింగ్ అందించడానికి ఒక సమగ్ర రోడ్‌మ్యాప్‌ను రూపొందించబోతున్నాం" అని తెలిపారు.

తమ పిల్లలను కోచింగ్‌ క్లాసులకు పంపకపోతే కుటుంబానికి గౌరవం ఉండదనే భావన తల్లిదండ్రుల్లో నెలకొందని ప్రధాని వ్యాఖ్యానించారు. అయితే ఇక అలాంటి పరిస్థితి అవసరం లేదని చెప్పారు. కోచింగ్‌ కోసం కుటుంబాలు ఖర్చు చేస్తున్న వేల కోట్ల రూపాయలను ఆదా చేసుకునే అవకాశం కల్పిస్తామని వెల్ల‌డించారు. అదే సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు మరింత దగ్గరగా ఉండి వారి చదువు, భవిష్యత్తుపై శ్రద్ధ పెట్టొవచ్చని పేర్కొన్నారు.

Image

పౌర రక్షణ రంగంలో సంస్కరణలు

మారుతున్న భ‌ద్ర‌త‌, అత్య‌వ‌స‌ర స‌వాళ్ల‌ దృష్ట్యా రాబోయే రోజుల్లో ఒక శక్తివంతమైన పౌర రక్షణ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌ధాని ప్ర‌క‌టించారు. దేశంలో ఒక భారీ, ఆధునిక పౌర రక్షణ (సివిల్ డిఫెన్స్) వాలంటీర్ బలగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విప‌త్క‌ర ప‌రిస్థితులు, అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో పౌరుల‌ను రక్షించేందుకు ఈ బృందానికి ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా పిల్లల కోసం క్రీడా ప్రతిభా అన్వేషణ

క్రీడా ప్రపంచంలో భారత్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోంద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (TOPS) గొప్ప విజయాన్ని సాధించింద‌ని కొనియాడారు. ఖేలో ఇండియా గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, బీచ్ గేమ్స్, వింటర్ గేమ్స్.. లేదా క్రీడా శిక్షణ, స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఇలా ఏ రంగంలోనైనా భారతదేశం గొప్ప వేగంతో ముందుకు సాగుతోంద‌ని చెప్పారు. అంతర్జాతీయ క్రీడల్లో భారత‌దేశ ప్రదర్శన మెరుగుపడుతున్నప్పటికీ.. దేశం ఇప్పటికీ అనేక ఒలింపిక్ ఈవెంట్లలో పాల్గొనలేకపోతోందని అన్నారు.

"భారత్ ప్రదర్శన మెరుగుపడుతోంది. మ‌నం 2036లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు బలమైన పోటీదారులుగా ఉన్నాం. 2030లో కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇస్తున్నాము. ఒలింపిక్స్‌లో సుమారు 40 విభాగాల కింద దాదాపు 350 ఈవెంట్లు ఉన్నాయి. కనీసం మూడింట రెండు వంతుల ఈవెంట్‌లలో మనం కనీసం అర్హత సాధించలేకపోవడం, పోటీపడలేకపోవడం విచారకరం" అని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశాన్ని క్రీడారంగంలో ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు దేశ‌వ్యాప్తంగా 5 నుంచి 15 ఏళ్ల వ‌య‌స్సు గ‌ల పిల్ల‌ల కోసం క్రీడా ప్ర‌తిభా అన్వేష‌ణను (Nationwide Sports Talent Hunt For Children) ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌ధాని ప్ర‌క‌టించారు. దీని ద్వారా వారు ప్రపంచ స్థాయి అథ్లెట్లుగా ఎదిగేందుకు ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

విద్యా వ్య‌వ‌స్థ‌లో కీల‌క మార్పులు

దేశంలో దశాబ్దాల తర్వాత కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. సుమారు 35 ఏళ్ల పాటు కొత్త విద్యా విధానం లేకపోయిందని, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంను తీసుకొచ్చిందని చెప్పారు. గత దశాబ్ద కాలంలో దేశ విద్యారంగంలో చోటుచేసుకున్న మార్పులను ప్రధాని ఈ సంద‌ర్భంగా వివరించారు. 2014 తర్వాత 650 కొత్త యూనివర్సిటీలు దేశంలో ఏర్పడ్డాయని చెప్పారు. 2004-2014 మధ్యకాలంలో దేశంలో 350 కంటే తక్కువ యూనివర్సిటీలు ఉండగా, ఆ తర్వాత 10-12 ఏళ్లలోనే దాదాపు 650 కొత్త విశ్వవిద్యాలయాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. అదేస‌మ‌యంలో వైద్య సీట్లు భారీగా పెరిగాయని తెలిపారు.

సెమీకండక్టర్ల తయారీకి పెద్దపీట

డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో సెమీకండక్టర్ సాంకేతికత ప్రాముఖ్యతను ప్ర‌ధాని మోదీ నొక్కి చెప్పారు. ఈ రంగంలో భార‌త్ స్వ‌యం స‌మృద్ధి దిశ‌గా అడుగులు వేస్తోంద‌ని చెప్పారు. నేటి డిజిట‌ల్ ప్ర‌పంచంలో, సాంకేతిక రంగంలో చిప్స్‌కు అత్యంత ప్రాముఖ్య‌త ఉంద‌న్నారు. అవి లేక‌పోతే ప్ర‌పంచ‌మే నిలిచిపోతుంద‌న్నారు. భారతదేశంలో ఇప్పటికే మూడు ప్రధాన సెమీకండక్టర్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. రాబోయే 7-8 సంవత్సరాల్లో మరో ఐదు నుంచి ఎనిమిది అదనపు సెమీకండక్టర్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అణుశక్తి విస్తరణ

దేశ ఇంధన భద్రతకు అణుశక్తి కీలకమని ప్రధాని పేర్కొన్నారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ దశాబ్దంలో ఐదు కొత్త అణు రియాక్టర్లను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

700 నగరాలకు పైప్డ్‌ గ్యాస్‌

దేశంలో పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (PNG) నెట్‌వర్క్‌ 12 ఏళ్ల క్రితం కేవలం 70 నగరాలకే ప‌రిమితం కాగా, ఇప్పుడు 700 నగరాలకు విస్తరించిందని మోదీ తెలిపారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 1.75 కోట్ల కుటుంబాలు పైప్డ్‌ గ్యాస్‌ కనెక్షన్లతో అనుసంధానమయ్యాయని వివ‌రించారు.

మ‌హిళా బిల్లు ప్ర‌స్తావ‌న‌..

త‌న ప్ర‌సంగంలో చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన మ‌హిళా బిల్లు గురించి ప్ర‌స్తావించారు. పార్ల‌మెంట్‌లో ఈ బిల్లును పాస్ చేసేలా మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని విప‌క్షాల‌ను కోరారు. ఆ త‌ర్వాత ఈ అంశంలో క్రెడిట్ తీసుకోవాల‌ని సూచించారు.

న‌క్స‌లిజం అంతం..

దేశంలో సాయుధ నక్సలిజం, మావోయిస్టు హింసను దాదాపుగా అంతం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అయితే మావోయిస్టు భావజాలం మాత్రం ఇంకా కొనసాగుతోందని హెచ్చరించారు. ఆ ఆలోచనా విధానంతో ఉన్న వారిని ‘దిమాగీ నక్సల్స్‌’గా పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని, సమాజంలో హింస, అశాంతిని ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దిమాగీ న‌క్స‌ల్స్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు.

ఎర్ర‌కోట వేడుక‌ల్లో తొలిసారి వందేమాత‌రం

ఇక ఎర్ర‌కోటపై జ‌రిగిన స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో తొలిసారిగా వందే మాతరం పూర్తి ఆరు చ‌ర‌ణాల‌ను ఆల‌పించ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా గతేడాది నవంబర్‌ 7 నుంచి ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగానే జాతీయ గీతం ‘జన గణ మన’తో పాటు వందేమాతరానికి కేంద్ర ప్రభుత్వం సమాన హోదా కల్పిస్తూ చట్టం కూడా చేసిన విష‌యం తెలిసిందే.

Image

Also Read..

ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల ముందుంచాం.. రాష్ట్రాన్ని మ‌రింత అప్పులపాలు చేస్తున్నరు

మహీంద్రా కొత్త స్కార్పియో లైఫ్‌స్టైలర్ పిక‌ప్ ట్ర‌క్‌.. హైలక్స్‌కు గట్టి పోటీ..

రేవంత్ లాంటి తెలంగాణ వ్య‌తిరేకులు గ‌ద్దెనెక్కితే.. రాష్ట్రాభివృద్ధిపై ప్రేమ ఎలా ఉంటుంది?: కేటీఆర్‌

Advertisement
Advertisement