త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shashi Tharoor | గ్లోబ‌ల్ సౌత్‌కు ఇది అత్యంత కీల‌క వేదిక.. బ్రిక్స్‌పై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు

Shashi Tharoor | భారత్ నిర్వహిస్తున్న బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా మార‌కూడ‌ద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శ‌శిథ‌రూర్ (Shashi Tharoor) పేర్కొన్నారు. గ్లోబ‌ల్ సౌత్ ఆందోళ‌న‌ల‌ను ప్ర‌పంచం ముందుంచాల‌ని కోరారు. భార‌త్ దౌత్య‌ప‌ర‌మైన స‌త్తాకు ఈ కూట‌మి నిద‌ర్శ‌నంగా అభివ‌ర్ణించారు.

D

National | Published On Sep 11, 2026, 12.13 pm IST

Shashi Tharoor | గ్లోబ‌ల్ సౌత్‌కు ఇది అత్యంత కీల‌క వేదిక.. బ్రిక్స్‌పై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు
Advertisement
  • భార‌త్ దౌత్య‌ప‌ర‌మైన స‌త్తాకు ఈ కూట‌మి నిద‌ర్శ‌నం
  • ఈ కూటమి పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా మార‌కూడ‌దు.. థ‌రూర్‌
  • బ్రిక్స్‌తో భారత్‌కు ఒరిగిందేంటి..?.. చిదంబ‌రం

Shashi Tharoor | త్రినేత్ర‌.న్యూస్ : బ్రిక్స్ స‌ద‌స్సుపై ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ స‌మ్మిట్ వ‌ల్ల భార‌త్‌కు ఒరిగిందేంటి..? అంటూ ఆ పార్టీ సీనియ‌ర్ నేత పి. చిదంబ‌రం (P Chidambaram) ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న వ్యాఖ్యలకు భిన్నంగా మ‌రో సీనియ‌ర్ నేత‌, తిరువ‌నంత‌పురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) బ్రిక్స్ ప్రాముఖ్యతను సమర్థిస్తూ మాట్లాడటం ఆస‌క్తిక‌రంగా మారింది. భార‌త్ దౌత్య‌ప‌ర‌మైన స‌త్తాకు ఈ కూట‌మి నిద‌ర్శ‌నంగా అభివ‌ర్ణించారు.

ఈ కూటమి ద్వారా అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న దౌత్యపరమైన బలాన్ని (Diplomatic Convening Power) చాటిచెప్పవచ్చని థరూర్ స్పష్టం చేశారు. అంతేకాదు, గ్లోబల్ సౌత్ దేశాలకు ఈ కూటమి ఒక అత్యంత కీలకమైన వేదిక అని చెప్పారు. గ్లోబల్ సౌత్ కింద వందకు పైగా దేశాలున్నప్పటికీ.. 11 ప్రధాన దేశాలు ఈ కూట‌మిలో భాగస్వామ్యంగా ఉన్నాయని తెలిపారు. ఈ కూటమి దేశాలు ప్రపంచ జనాభాలో అత్యధిక భాగాన్ని, ప్రపంచ జీడీపీ (GDP) లో 41 శాతానికి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌ట్లు వివ‌రించారు. ఇది చిన్న విషయం కాదని, ప్రపంచం దీన్ని గమనించాలని పేర్కొన్నారు.

గ్లోబ‌ల్ సౌత్ ఆందోళ‌న‌ల‌ను ప్ర‌పంచం ముందుంచాలి

బ్రిక్స్ (BRICS) సభ్య దేశాల నుంచే కాకుండా ప‌లు దేశాల ప్ర‌ధానులు, ప‌రిశీల‌కులు కూడా ఈ స‌మ్మిట్ కోసం ఇక్క‌డికి వ‌స్తార‌ని తెలిపారు. దీన్ని చాలా ముఖ్య‌మైన ప‌రిణామంగా అభివ‌ర్ణించారు. ఇది ప్ర‌పంచ వేదిక‌పై భార‌త దౌత్య‌శ‌క్తిని చాటుతుంద‌ని పేర్కొన్నారు. అయితే,  బ్రిక్స్ కూటమి అమెరికా లేదా ఇతర పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా (Anti-West) మారకూడదని చెప్పారు. ఇది కేవలం పాశ్చాత్యేతర (Non-West) దేశాల ప్రయోజనాల కోసమే పనిచేసేలా భారత్ తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. గ్లోబ‌ల్ సౌత్ ఆందోళ‌న‌ల‌ను ప్ర‌పంచం ముందుంచాల‌ని కోరారు.

ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరుగుతున్నాయి

"బ్రిక్స్ అధ్యక్ష హోదాలో ఉన్న మనకు ఒక ప్రత్యేక బాధ్యత ఉంది. ఈ వేదికగా బ్రిక్స్ ప్రాముఖ్యతను, గ్లోబల్ సౌత్ ఆందోళనలను ప్రపంచం ముందు ఉంచ‌డంతోపాటూ.. మన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాలి" అని థరూర్ తెలిపారు. అదే స‌మ‌యంలో బ్రిక్స్ దేశాల‌తో భార‌త్ వాణిజ్య సంబంధాల‌ను కూడా థ‌రూర్ ప్ర‌స్తావించారు. బ్రిక్స్ దేశాల మ‌ధ్య వాణిజ్యం పెరుగుతున్న‌ప్ప‌టికీ అది మ‌న‌కు ప్ర‌తికూలంగా మారుతోంద‌ని తెలిపారు. ఆయా దేశాలకు మన ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరుగుతున్నాయ‌ని ఆందోళన వ్యక్తం చేశారు.

బ్రిక్స్‌తో భారత్‌కు ఒరిగిందేంటి..?

అంత‌కుముందు BRICS శిఖరాగ్ర సదస్సు వ‌ల్ల భార‌త్‌కు ఒరిగిందేంట‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పి. చిదంబ‌రం (P Chidambaram) ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. అంతేకాదు, గ‌త మూడు స‌మావేశాల వ‌ల్ల చెప్పుకోద‌గ్గ ఫ‌లితాలు ఏమీ రాలేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. భార‌త్ ప్ర‌స్తుతం బ్రిక్స్‌తో పాటు సాంఘై స‌హ‌కార సంస్థ‌, జీ20, క్వాడ్‌లో స‌భ్య దేశంగా ఉంద‌ని గుర్తు చేశారు. వీటి వ‌ల్ల దేశానికి క‌లుగుతున్న ప్ర‌యోజ‌నాలేంట‌ని నిల‌దీశారు. అయితే, గతంలో BRICS సదస్సుల వల్ల కొన్ని స్పష్టమైన ప్రయోజనాలు చేకూరాయని చెప్పారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు పూర్తి విరుద్ధంగా థ‌రూర్ స్పంద‌న ఉండ‌టం గ‌మ‌నార్హం. బ్రిక్స్‌పై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Also Read..

మంచివాళ్ల‌తోనే స్నేహం చేయాలి.. బ్రిక్స్ వేళ ప్ర‌ధాని మోదీ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

యాపిల్ హెల్త్ యాప్‌లో అదిరిపోయే ఫీచర్లు.. ఇక ఆరోగ్యంపై మరింత నిఘా..

రూ.1.50 ల‌క్షల కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తున్నా.. క‌నీసం 15 వేల ఉద్యోగాలు కూడా లేవు: ఎమ్మెల్యే పాల్వాయి హ‌రీశ్

Advertisement
Advertisement