త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Radhamani Amma | స్టీరింగ్ వెనుక ఓ స్త్రీ శక్తి..! 11 రకాల డ్రైవింగ్‌ లైసెన్సులతో రికార్డు

Radhamani Amma | ప్రస్తుత కాలంలో మహిళలు సైతం భారీ వాహనాల స్టీరింగ్‌ పట్టుకుంటున్నప్పటికీ, ఆ రంగం ఇప్పటికీ మగవారికే పరిమితమనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఆ అభిప్రాయాన్ని పూర్తిగా తలకిందులు చేసిన వ్యక్తిగా కేరళకు చెందిన రాధామణి అమ్మ నిలుస్తున్నారు. 74 ఏళ్లు దాటిన వయసులో కూడా బస్సులు, ట్రక్కులు, క్రేన్లు వంటి భారీ వాహనాలను సునాయాసంగా నడుపుతూ ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. దాదాపు 11 రకాల డ్రైవింగ్ లైసెన్సులతో దేశంలోనే అరుదైన వ్యక్తిగా నిలిచారు. ఎంతోమంది మహిళలకు ఆమె జీవన ప్రయాణం ఆదర్శంగా నిలుస్తోంది.

P

National | Published On May 1, 2026, 5.30 pm IST

Radhamani Amma | స్టీరింగ్ వెనుక ఓ స్త్రీ శక్తి..! 11 రకాల డ్రైవింగ్‌ లైసెన్సులతో రికార్డు
Advertisement
  • భర్త ప్రోత్సాహంతో డ్రైవింగ్‌ నేర్చుకొని..
  • డ్రైవింగ్‌ స్కూల్‌ నుంచి ఇన్‌స్టిటూట్‌ వరకు..
  • మహిళకు ఆదర్శంగా నిలుస్తున్న రాధామణి అమ్మ
  • ప్రముఖుల నుంచి ప్రశంసలు..

Radhamani Amma | ప్రస్తుత కాలంలో మహిళలు సైతం భారీ వాహనాల స్టీరింగ్‌ పట్టుకుంటున్నప్పటికీ, ఆ రంగం ఇప్పటికీ మగవారికే పరిమితమనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఆ అభిప్రాయాన్ని పూర్తిగా తలకిందులు చేసిన వ్యక్తిగా కేరళకు చెందిన రాధామణి అమ్మ నిలుస్తున్నారు. 74 ఏళ్లు దాటిన వయసులో కూడా బస్సులు, ట్రక్కులు, క్రేన్లు వంటి భారీ వాహనాలను సునాయాసంగా నడుపుతూ ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. దాదాపు 11 రకాల డ్రైవింగ్ లైసెన్సులతో దేశంలోనే అరుదైన వ్యక్తిగా నిలిచారు. ఎంతోమంది మహిళలకు ఆమె జీవన ప్రయాణం ఆదర్శంగా నిలుస్తోంది.

భర్త ప్రోత్సాహంతో నేర్చుకొని.. డ్రైవింగ్‌ స్కూల్‌ వరకు..

రాధామణి అమ్మ స్వస్థలం కేరళలోని అలప్పుజ జిల్లా తోప్పుంపాడీ గ్రామం. స్థానికంగా ఆమెను ప్రేమగా ‘డ్రైవర్ అమ్మ’గా పిలుస్తారు. సోషల్ మీడియాలో ఆమె ‘మణి అమ్మ’గా ప్రసిద్ధి చెందారు. ఆమె జీవితం మొదట్లో సాధారణ కుటుంబ జీవితంగానే సాగింది. టీవీ లాలన్‌తో వివాహం అనంతరం భర్త ప్రోత్సాహంతో ఆమె మొదటిసారిగా స్టీరింగ్‌ పట్టుకోవాల్సి వచ్చింది. 1981లో తొలిసారి ఫోర్ వీలర్ నడపడం నేర్చుకున్న ఆమె.. ఆ తర్వాత 1984లో హెవీ వెహికల్ లైసెన్స్ పొందారు. ఆ రోజుల్లో మహిళలు భారీ వాహనాలు నడపడం చాలా అరుదైన విషయం. దాంతో ఒకసారిగా ఆమె ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిచారు. డ్రైవింగ్‌ను ఆమె కేవలం నైపుణ్యంగా కాకుండా జీవనోపాధిగా మార్చుకున్నారు. భర్తతో కలిసి డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించి, ట్రక్ డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, క్రేన్ ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఇదే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చిన మలుపుగా నిలిచింది. డ్రైవింగ్‌ను ఒక వృత్తిగా మాత్రమే కాకుండా జీవన నైపుణ్యంగా చూడాలని ఆమె ఎప్పుడూ చెబుతుంటారు. నైపుణ్యం ఉన్న వారికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయని ఆమె నమ్ముతుంటారు.

ప్రత్యేక గుర్తింపు.. జీవితంలో విషాదం..

ఆమె వద్ద ఉన్న 11 రకాల డ్రైవింగ్ లైసెన్సులు సాధారణంగా పొందడం చాలా కష్టమైన విషయం. ప్రతి వాహనానికి ప్రత్యేక శిక్షణ, పరీక్ష అవసరం అవుతుంది. కార్లు, బస్సులు, ట్రక్కులు, క్రేన్లు, ఫోర్క్‌లిఫ్ట్‌లు, రోడ్ రోలర్లు వంటి విభిన్న వాహనాలను నడపగల అనుమతులు ఆమెకు ఉన్నాయి. సాధారణంగా ఒక డ్రైవర్ ఒకటి లేదా రెండు వాహనాల వరకే పరిమితమవుతారు. కానీ రాధామణి అమ్మ అనుభవం, శిక్షణ రంగంలో చేసిన కృషి ఆమెను విభిన్న వాహనాలపై నైపుణ్యం కలిగిన అరుదైన వ్యక్తిగా నిలబెట్టింది. 2004లో భర్త టీవీ లాలన్ మరణం ఆమె జీవితంలో కోలుకోని దెబ్బ. వ్యక్తిగతంగా అది తీవ్రమైన విషాదం అయినప్పటికీ, ఆమె డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్ బాధ్యతలను స్వయంగా స్వీకరించి ముందుకు సాగారు. ఆ సమయంలో ఎదురైన కష్టాలను అధిగమించి సంస్థను కొనసాగించడం ఆమె పట్టుదలకి నిదర్శనంగా నిలిచింది. అనంతరం ఆమె ప్రారంభించిన డ్రైవింగ్ స్కూల్ విస్తరించి ఏ టూ జెడ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్విప్‌మెంట్‌గా రూపుదిద్దుకున్నది.

సోషల్‌ మీడియాలో ఫేమస్‌..

2024 జనవరిలో అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ ఆధారంగా దుబాయ్‌లో ఆమె రోల్స్ రాయిస్ ఘోస్ట్ లగ్జరీ కారును నడిపారు. సంప్రదాయ వస్త్రధారణలోనే ఆ వాహనాన్ని ఆత్మవిశ్వాసంతో నడపడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ మహిళా డ్రైవర్ ఒకరు విదేశాల్లో ఇలాంటి లగ్జరీ వాహనం నడపడం అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ వీడియోను పలువురు ప్రముఖులు కూడా ప్రశంసించారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా దీనిని “మండే మోటివేషన్”గా అభివర్ణించారు. రాధామణి అమ్మకు సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో @maniamma_official పేరుతో ఉన్న ఆమె ఖాతాకు లక్షకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తరచుగా క్రేన్లు, ట్రక్కులు, రోడ్ రోలర్లు వంటి భారీ వాహనాలను నడుపుతున్న వీడియోలను పంచుకుంటారు. వాటితో పాటు ఆమె ఇచ్చే సందేశాలు కూడా నెట్టింట వైరల్ అవుతుంటాయి. ‘వేగంగా నడిపేవాడు గొప్ప డ్రైవర్ కాదు. నియంత్రణతో, ప్రశాంతంగా నడిపేవాడే ఉత్తమ డ్రైవర్’ అనే ఆమె మాటలు ఎంతోమందిని ప్రభావితం చేశాయి.

ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు..

ఆమెకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. అత్యధిక డ్రైవింగ్ లైసెన్సులు కలిగిన సీనియర్ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. 2022లో ఆమెను ఇన్‌స్పిరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించారు. వయసు 74 దాటినప్పటికీ మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేయడం ఆమె నేర్చుకునే తత్వానికి, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. డ్రైవింగ్‌ను లింగ పరిమితుల్లో చూడకూడదని ఆమె బలంగా చెబుతుంటారు. నిజంగా ఏదైనా సాధించాలనే కోరిక, కృషి, నమ్మకం ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని ఆమె తరచూ స్పష్టం చేస్తారు. కేరళ గ్రామీణ నేపథ్యం నుంచి ప్రారంభమైన రాధామణి అమ్మ ప్రయాణం.. నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 11 లైసెన్సులు, భారీ వాహనాలపై నైపుణ్యం, వయసు దాటినా డ్రైవింగ్‌ కొనసాగిస్తుండడం ఆమెను అసాధారణ మహిళగా నిలబెట్టాయి. ఆమె స్టీరింగ్ పట్టుకున్న ప్రతి క్షణం కేవలం డ్రైవింగ్ మాత్రమే కాదు.. అది ఒక మహిళ ధైర్యం, పట్టుదలను ప్రతిబింబిస్తోంది.

Advertisement
Advertisement