లోడ్ అవుతోంది...


Maoists | త్రినేత్ర.న్యూస్ : మావోయిస్టుల లొంగుబాటు పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఛత్తీస్గడ్లోని సుక్మా జిల్లాలో మరో 29 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులంతా నిషేధిత సీపీఐ(మావోయిస్టు) పార్టీకి చెందిన వారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో దండాకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్ (DAKMS) అధినేత పోడియం బుద్రా ఉన్నట్లు పేర్కొన్నారు. గోగుండ ఏరియాకు చెందిన బుద్రా తలపై రూ. 2 లక్షల రివార్డు ఉంది. మిగతా వారంతా డీఏకేఎంఎస్, మిలీషియా, జనతా సర్కార్కు చెందిన వారని స్పష్టం చేశారు.
ఇటీవల గోగుండ ఏరియాలో ఏర్పాటు చేసిన భద్రతా శిబిరం.. మావోయిస్టుల లొంగుబాటులో కీలకపాత్ర పోషించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ శిబిరం ఏర్పాటు తర్వాత ఆ ప్రాంతంలో నిరంతరం కూంబింగ్ నిర్వహించి, మావోయిస్టుల కార్యకలాపాలను అడ్డుకున్నారు. దాంతో మావోయిస్టులకు లొంగుబాటు తప్పనిసరి అయింది.
అయితే గోగుండ ఏరియా మావోయిస్టులకు కంచుకోట లాంటింది. ఇక్కడ దట్టమైన అడవులు ఉండడంతో.. మావోయిస్టులు తలదాచుకునేవారు. మొత్తానికి గోగుండను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని, మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేశారు. చేసేదేమీ లేక మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవక తప్పలేదు. మావోయిస్టుల కంచుకోటను ఆధీనం చేసుకోవడంలో బలగాలు కీలకపాత్ర పోషించాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులందరికీ పునరావాసం కల్పిస్తామన్నారు.
జనవరి 8న దంతెవవాడ జిల్లాలో 63 మంది మావోయిస్టులు లొంగిపోగా, జనవరి 7న సుక్మాలో 26 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. 2025లో మొత్తం 1500 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారని తెలిపారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్రం ఉంది.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam