త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hantavirus | హంటా వైరస్ సోకిన క్రూయిజ్ షిప్‌లో ఇద్దరు భారతీయులు

Hantavirus | ప్రాణాంతక హంటా వైర‌స్ (Hantavirus) బ‌య‌ట‌ప‌డిన విలాస‌వంత‌మైన డ‌చ్ క్రూయిజ్‌లో ఇద్ద‌రు భార‌తీయులు కూడా ఉన్న‌ట్లు తాజాగా వెల్ల‌డైంది. ఈ వైర‌స్ కార‌ణంగా షిప్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భార‌తీయుల ఆరోగ్య‌ ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

D

National | Published On May 8, 2026, 12.19 pm IST

Hantavirus | హంటా వైరస్ సోకిన క్రూయిజ్ షిప్‌లో ఇద్దరు భారతీయులు
Advertisement

Hantavirus | అట్లాంటిక్ మ‌హా స‌ముద్రంలో (Atlantic Ocean) ప్ర‌యాణిస్తున్న విలాస‌వంత‌మైన డ‌చ్ క్రూయిజ్‌లో ప్రాణాంతక హంటా వైర‌స్ (Hantavirus) క‌ల‌క‌లం సృష్టించిన విష‌యం తెలిసిందే. 'ఓషన్ వైడ్ ఎక్స్‌పెడిషన్స్' సంస్థకు చెందిన ఎంవీ హోండియస్ (MV Hondius) నౌకలో ఈ వైరస్ వ్యాప్తి చెందగా.. ఇప్పటివ‌ర‌కూ ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నౌక‌లో 23 దేశాలకు చెందిన 150 మంది ప్ర‌యాణిస్తున్నారు. అందులో ఇద్ద‌రు భార‌తీయులు (Indians) కూడా ఉన్నారు.

ఈ విష‌యం నౌకాయాన సంస్థ విడుద‌ల చేసిన జాబితా ద్వారా వెల్ల‌డైంది. మొత్తం 23 దేశాల‌కు చెందిన 149 మంది ఉన్న‌ట్లు పేర్కొంది. వారిలో ఎక్కువ మంది బ్రిట‌న్‌, అమెరికా, జ‌ర్మ‌నీ, స్పెయిన్ దేశాల‌కు చెందిన ప‌ర్యాట‌కులే. వీరిలో భార‌తీయులు కూడా ఉన్నార‌ని సంస్థ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అయితే, వారి పేర్లు, ఇత‌ర వివ‌రాలు, ఆరోగ్య ప‌రిస్థితి గురించి ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదు. దీంతో వారి ఆరోగ్య‌ ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఏప్రిల్ తొలివారంలో అర్జెంటీనాలోని హుషుహియా నుంచి ఆ నౌక బ‌య‌ల్దేరింది. అంటార్కిటికా, అట్లాంటిక్ మ‌హాస‌ముద్రంలో వారం రోజుల‌పాటూ ఈ యాత్ర కొన‌సాగాల్సి ఉంది. ఇంత‌లోనే హంటా వైర‌స్ వ్యాప్తి చెంద‌డంతో.. కేప్ వెర్డే స‌మీపంలో స‌ముద్రంలో నిలిపివేశారు. ఏప్రిల్ 11న నౌక‌లో తొలి మ‌ర‌ణం న‌మోదైంది. మే 7న ముగ్గురు అనారోగ్య ప్రయాణికులను అత్యవసర చికిత్స కోసం తరలించిన తర్వాత నౌక ప్రయాణం కొనసాగుతోంది. ప్ర‌స్తుతం స్పెయిన్‌కు చెందిన కానరీ దీవుల వైపు ప్రయాణిస్తోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మే 4న ఈ వైర‌స్ వ్యాప్తిని అధికారికంగా ధ్రువీకరించింది. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తం 7 ఇన్ఫెక్షన్లు నమోదవగా, ముగ్గురు మరణించినట్లు వెల్లడించింది. మే 6న మరో కొత్త కేసు నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 8కి చేరింది. హంటావైరస్ ఇంకుబేషన్ పీరియడ్ 1 నుంచి 6 వారాల వరకు ఉండడంతో, రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు వెలుగులోకి వచ్చే అవ‌కాశం ఉంద‌ని అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్ చివర్లో వ్యాప్తిని గుర్తించేలోపే నౌక నుంచి దిగిపోయిన ప్రయాణికులను అధికారులు ట్రాక్ చేస్తున్నారు.

Also Read..

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న మ‌రో కొత్త వైర‌స్.. 'హంటా'.. ఏంటిది, ఎలా వ్యాప్తి చెందుతుంది..?

హ‌నీట్రాప్‌ భయం.. ఐపీఎల్ ఆట‌గాళ్ల‌పై బీసీసీఐ నిఘా.. ఫ్రాంచైజీల‌కు కీల‌క ఆదేశాలు

బంగారం, వెండిపై పెట్టుబ‌డులు పెరుగుతున్నాయా..? ధ‌ర‌లు ఎలా ఉన్నాయి..?

Advertisement
Advertisement