త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heat Fever And Heat Stroke | భార‌తీయుల్లో పెరుగుతున్న హీట్ ఫీవ‌ర్, హీట్ స్ట్రోక్ స‌మ‌స్య‌లు.. జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..

Heat Fever And Heat Stroke | వేసవి కాలంలో రాత్రి పూట నిద్ర ప‌రంగా చాలా మందికి ఇబ్బందులు క‌లుగుతుంటాయి. గ్లోబల్ స్లీప్ సర్వేలో రెస్‌మెడ్ (ResMed) వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 49 శాతం మంది అధిక ఉష్ణోగ్రతలు, అసౌకర్యం, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ సమస్యల కారణంగా నిద్రపోవడంలో ఇబ్బంది పడుతున్నార‌ని తేలింది.

S

Health | Published On Apr 21, 2026, 12.51 pm IST

Heat Fever And Heat Stroke | భార‌తీయుల్లో పెరుగుతున్న హీట్ ఫీవ‌ర్, హీట్ స్ట్రోక్ స‌మ‌స్య‌లు.. జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..
Advertisement

Heat Fever And Heat Stroke | వేసవి కాలంలో రాత్రి పూట నిద్ర ప‌రంగా చాలా మందికి ఇబ్బందులు క‌లుగుతుంటాయి. గ్లోబల్ స్లీప్ సర్వేలో రెస్‌మెడ్ (ResMed) వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 49 శాతం మంది అధిక ఉష్ణోగ్రతలు, అసౌకర్యం, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ సమస్యల కారణంగా నిద్రపోవడంలో ఇబ్బంది పడుతున్నార‌ని తేలింది. దీనికి తోడు తాజా అధ్యయనం ప్రకారం భారత నగరాలు సూర్యాస్తమయం తర్వాత కూడా చల్లబడడం లేద‌ని వెల్ల‌డైంది. దీని వల్ల థర్మల్ డెట్ అనే పరిస్థితి ఏర్పడి దీర్ఘకాలిక అలసట, హీట్ ఫీవర్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. వ‌ర‌ల్డ్ మిటియోరోలాజిక‌ల్ ఆర్గ‌నైజేష‌న్ విడుదల చేసిన గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ 2025 ప్రకారం 2015 నుండి 2025 వరకు ప్రపంచంలో నమోదైన అత్యంత వేడి సంవత్సరాలు ఇవేన‌ని నిర్దారించారు. 2025 సంవత్సరంలో సాధారణ స్థాయితో పోలిస్తే సుమారు 1.43 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదై మూడో అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన సంవత్సరంగా నిలిచింది. ఈ స్వ‌ల్ప‌ మార్పు కూడా పర్యావరణ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసి, మానవ ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతోంది.

హీట్ ఫీవ‌ర్ అంటే..

ఈ వేడి ప్రభావంతో ప్రధానంగా రెండు ఆరోగ్య సమస్యలు హీట్ స్ట్రోక్ (ఎండ దెబ్బ‌), హీట్ ఫీవర్ పెరుగుతున్నాయి. వీటికి సరైన సమయంలో చికిత్స పొందకపోతే ప్రాణాపాయం కలిగిస్తాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రకారం 2020 నుంచి 2022 మధ్య హీట్ స్ట్రోక్ కారణంగా 1,634 మంది మరణించిన‌ట్లు తేలింది. శరీరం అధికంగా వేడెక్కడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీర్ఘకాలిక వేడి ప్రభావంతో వ్యక్తులు అకస్మాత్తుగా మూర్ఛపోతారు. ఈ పరిస్థితి ప్రమాదకరమై బ్రెయిన్ ఇంజరీలు లేదా ఇతర గాయాలకు దారితీసే అవకాశం ఉంటుంది. హీట్ ఫీవర్ అంటే.. ఇది శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరగడం వల్ల ఏర్పడే పరిస్థితి. ఫిజియాలజీ అండ్ ఫీవర్ అనే గ్రంథంలో ప్రచురితమైన పరిశోధన ప్రకారం హీట్ ఫీవర్ శరీరంలోని దాదాపు అన్ని వ్యవస్థల పనితీరును ప్రభావితం చేస్తుంది. శరీరం తన ఉష్ణోగ్రతను హైపోథాలమస్‌లోని థర్మోరెగ్యులేటరీ సెంటర్ ద్వారా నియంత్రిస్తుంది. అయితే ఎక్కువసేపు సూర్యరశ్మిలో ఉండటం, నీరు తక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు తగ్గిపోతుంది. దీంతో మెదడు అధికంగా పని చేస్తూ, హృదయ స్పందనలు అస్థిరంగా మారి చివరకు వ్యక్తి మూర్ఛపోతాడు.

హీట్ ఫీవ‌ర్ ల‌క్ష‌ణాలు..

హీట్ ఫీవర్ లక్షణాలలో చర్మం ఎర్రబడటం, తేలికపాటి జ్వరం, డీహైడ్రేషన్ ముఖ్యమైనవి. శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ స్థాయిని దాటినప్పుడు ఈ సమస్యలు మొదలవుతాయి. ఇది వైరల్ ఫీవర్ కు భిన్నంగా ఉంటుంది. వెంటనే నీరు, లవణాలు, చక్కెరలు, విటమిన్లు అందించ‌డం ద్వారా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. హీట్ స్ట్రోక్, హీట్ ఫీవర్ మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. హీట్ స్ట్రోక్ ఒక మెడికల్ ఎమర్జెన్సీ. ఇందులో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగి, గందరగోళం, మూర్ఛ వంటి సమస్యలు వస్తాయి. అయితే హీట్ ఫీవర్ తక్కువ తీవ్రత కలిగి ఉండి, ఎక్కువసేపు వేడి, డీహైడ్రేషన్ కారణంగా వస్తుంది. రెండూ వేడి వల్లే వస్తాయి కానీ శరీరంపై ప్రభావం వేర్వేరుగా చూపిస్తాయి.

జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..

హీట్ ఫీవర్‌లో అలసట ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా శరీరం పూర్తిగా బలహీనమవుతుంది. సరైన నీరు, ఆహారం తీసుకోకపోతే శరీరం అస్థిరంగా మారుతుంది. జ‌ర్న‌ల్ ఆఫ్ ఫిజియాల‌జీలో ప్రచురితమైన పరిశోధన ప్రకారం హీట్ ఫీవర్ వల్ల అలసట సెంట్ర‌ల్‌ నర్వస్ సిస్టమ్‌పై ఒత్తిడి వల్ల వస్తుంది. హీట్ స్ట్రోక్‌లో అయితే శరీరవ్యవస్థలు పూర్తిగా దెబ్బతినడం వల్ల అలసట వస్తుంది. ఈ పరిస్థితులను నివారించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు అవసరం. ఉదయం లేదా సాయంత్రం సమయంలో మాత్రమే బయటకు వెళ్లడం మంచిది. నీరు, జ్యూసులు, ఆమ్ పన్నా, ఆమ్లా జ్యూస్ వంటి పానీయాలు తీసుకోవడం ద్వారా శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలి. కాటన్ దుస్తులు ధరించడం, నీడలో ఉండడం, శుభ్రత పాటించడం కూడా అవసరం. సీజనల్ పండ్లు తీసుకోవడం ద్వారా పోషకాహారం పొందాలి. వేడి వల్ల అసౌకర్యం కలిగితే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. జ్వరం ఉన్నా ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

రెండూ తీవ్ర‌మైన‌వే..

హీట్ స్ట్రోక్ వల్ల పెరుగుతున్న మరణాల సంఖ్య ప్రజలకు హెచ్చరికగా నిలుస్తోంది. ఇండియ‌న్ మిటియోరోలాజిక‌ల్ విభాగం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రజలు వాటిని పాటించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. వ్యక్తిగత నిర్ణయాలు పర్యావరణంపై ప్రభావం చూపుతాయని గుర్తించాలి. పర్యావరణ ఆరోగ్యం మ‌నిషి ఆరోగ్యానికి నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. హీట్ ఫీవర్, హీట్ స్ట్రోక్ రెండూ తీవ్రమైన ఆరోగ్య సమస్యలే. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించవచ్చు. కాబట్టి వేసవిలో తగినంత నీరు తాగుతూ, అప్రమత్తంగా ఉండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరమ‌ని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement