త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

World Health Organization | యుద్ధం ఆప‌క‌పోతే ఆరోగ్య సంక్షోభం త‌లెత్తే ప్ర‌మాదం.. WHO హెచ్చ‌రిక‌..

World Health Organization | మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్దం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఆరోగ్య వ్యవస్థలు, పౌరులు, వైద్య సిబ్బంది తీవ్ర ప్రమాదంలో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఇరాన్‌లో మాత్రమే ఇప్పటివరకు దాదాపు 1,000 మంది మరణించినట్లు సమాచారం అందిందని, ఆసుపత్రులు, ఆరోగ్య సదుపాయాలపై దాడులు జరిగినట్లు ధ్రువీకరించామ‌ని సంస్థ తెలిపింది.

S

International | Published On Mar 11, 2026, 3.42 pm IST

World Health Organization | యుద్ధం ఆప‌క‌పోతే ఆరోగ్య సంక్షోభం త‌లెత్తే ప్ర‌మాదం.. WHO హెచ్చ‌రిక‌..
Advertisement

World Health Organization | మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్దం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఆరోగ్య వ్యవస్థలు, పౌరులు, వైద్య సిబ్బంది తీవ్ర ప్రమాదంలో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఇరాన్‌లో మాత్రమే ఇప్పటివరకు దాదాపు 1,000 మంది మరణించినట్లు సమాచారం అందిందని, ఆసుపత్రులు, ఆరోగ్య సదుపాయాలపై దాడులు జరిగినట్లు ధ్రువీకరించామ‌ని సంస్థ తెలిపింది. WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రేయేసస్ మాట్లాడుతూ ఈ యుద్ధం ఇప్పుడు ఆ ప్రాంతంలోని 16 దేశాలను ప్రభావితం చేస్తోందని తెలిపారు. దీని వల్ల భారీ స్థాయిలో ప్రాణనష్టం, ప్రజల నిరాశ్రయుల‌వ్వ‌డం, ఆరోగ్య సేవల్లో అంతరాయం ఏర్పడుతోందని చెప్పారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధంపై WHO తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంద‌ని, ఈ పరిస్థితి ఇప్పటికే 16 దేశాలను ప్రభావితం చేసింద‌ని డాక్టర్ టెడ్రోస్ పేర్కొన్నారు.

నిరాశ్ర‌యులైన ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు..

ఇప్పటివరకు ఇరాన్‌లో దాదాపు 1,000 మంది మరణించార‌ని డాక్టర్ టెడ్రోస్ అన్నారు. లెబనాన్‌లో 50 మంది, ఇజ్రాయెల్‌లో 13, ఇతర గల్ఫ్ దేశాల్లో 11 మంది మరణించార‌ని, అదనంగా ఇరాన్‌లో ఆరోగ్య సేవలపై 13 దాడులు, లెబనాన్‌లో ఒక దాడి జ‌రిగాయ‌ని, దీన్ని తాము ఖండిస్తున్నామ‌ని అన్నారు. అంతర్జాతీయ మానవతా చట్టాల ప్రకారం ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, వైద్య సిబ్బందిని తప్పనిసరిగా రక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ యుద్ధం కారణంగా ఆ ప్రాంతవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రజలు నివాసాలు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింద‌న్నారు. టెహ్రాన్ నగరం నుంచి సుమారు ఒక లక్ష మంది ప్రజలు బయటకు వెళ్లిపోయార‌ని, లెబనాన్‌లో 60,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యార‌ని, దక్షిణ లెబనాన్‌లో ఖాళీ చేయాలనే ఆదేశాల కారణంగా కనీసం 10 లక్షల మంది ప్రజలు తమ నివాసాలను విడిచిపెట్టాల్సి వ‌స్తోంద‌ని తెలిపారు.

దుబాయ్‌లో నిలిచిన డబ్ల్యూహెచ్‌వో కార్య‌క‌లాపాలు..

కాగా ప్రపంచ ఆరోగ్య అత్యవసరాల కోసం దుబాయ్‌లో ఉన్న WHO లాజిస్టిక్స్ హబ్ కార్యకలాపాలు కూడా తాత్కాలికంగా నిలిచిపోయాయి. భద్రతా సమస్యలు, గగనతల మూసివేతలు, హోర్ముజ్ జలసంధి మార్గంలో ప్రవేశ పరిమితుల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ కేంద్రం ప్రపంచవ్యాప్తంగా మానవతా వైద్య సరఫరాలకు కీలకంగా ప‌నిచేస్తోంది. హింస మరింత పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది, ఆసుపత్రులను రక్షించడం అత్యవసరమని, లేకపోతే ఆరోగ్య‌ సంక్షోభం మరింత తీవ్రత‌ర‌మవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక‌లు జారీ చేసింది.

Advertisement
Advertisement