త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WHO | ఆరోగ్య కేంద్రాలు ల‌క్ష్యం కాకూడ‌దు.. యుద్ధంపై WHO డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ కీల‌క వ్యాఖ్య‌లు..

WHO | ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌లోని గాంధీ ఆసుపత్రి బాంబుదాడుల్లో దెబ్బతిన్నట్లు వచ్చిన వార్త‌లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రాలు ల‌క్ష్యంగా దాడులు చేయ‌వ‌ద్ద‌ని అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు.

S

International | Published On Mar 2, 2026, 1.02 pm IST

WHO | ఆరోగ్య కేంద్రాలు ల‌క్ష్యం కాకూడ‌దు.. యుద్ధంపై WHO డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ కీల‌క వ్యాఖ్య‌లు..
Advertisement

WHO | ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌లోని గాంధీ ఆసుపత్రి బాంబుదాడుల్లో దెబ్బతిన్నట్లు వచ్చిన వార్త‌లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రాలు ల‌క్ష్యంగా దాడులు చేయ‌వ‌ద్ద‌ని అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. ఈరోజు టెహ్రాన్‌పై జరిగిన బాంబుదాడుల్లో గాంధీ ఆసుపత్రి దెబ్బతిన్నట్లు వచ్చిన సమాచారం తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ ఘటనను ధ్రువీకరించేందుకు WHO పని చేస్తోంది.. అని తెలిపారు. కొనసాగుతున్న ఘర్షణల్లో ఆరోగ్య సదుపాయాలు ప్రభావితం కాకుండా అన్ని ర‌కాల చర్యలు చేప‌ట్టాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. ఆరోగ్య సదుపాయాలు అంతర్జాతీయ మానవతా చట్టాల ప్రకారం రక్షించబడతాయి.. అని ఆయన స్పష్టం చేశారు.

గ‌ణ‌నీయంగా దెబ్బతిన్న ఆసుపత్రి..

రాయిటర్స్ నివేదిక ప్రకారం ఆదివారం ఉత్తర టెహ్రాన్‌లోని గాంధీ ఆసుపత్రిని ఇజ్రాయెల్ వైమానిక ద‌ళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖ‌మేనీ హత్య అనంతరం ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్యల రెండో రోజు ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఇరాన్ ప్రభుత్వ అనుబంధ సంస్థలు ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ (ISNA), ఫార్స్ న్యూస్, మిజాన్ న్యూస్ ఆసుపత్రి అంతర్గత దృశ్యాలను ప్రసారం చేశాయి. వీల్‌చైర్ల‌ పక్కన నేలపై చెత్త ముక్కలు, విరిగిన గాజు పెంకులు కనిపిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. గాంధీ స్ట్రీట్ పరిసర ప్రాంతంలో ఉన్న ఇద్దరు సాక్షులు రాయిటర్స్‌కు ఆసుపత్రి గణనీయంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. రోగులను భవనం నుంచి తరలిస్తున్నట్లు చెప్పారు.

భ‌యాన‌క దృశ్యాలు..

టస్నీమ్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన వీడియోల్లో అలారంల మధ్య నర్సులు శిశువులను చేతుల‌తో ఎత్తుకుని వార్డుల నుంచి బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపించాయి. మరికొన్ని వీడియోల్లో ఆసుపత్రి వెలుపల గందరగోళ పరిస్థితులు, పొగ మేఘాలు, కుటుంబ సభ్యులను వెతుకుతూ పరుగులు తీస్తున్న ప్రజలు క‌నిపించారు. ఆదివారం రాత్రి ఉత్తర టెహ్రాన్‌లో మరిన్ని పేలుళ్లు సంభవించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రకటన ప్రకారం ఇరాన్ రాజధాని కీల‌క‌ ప్రాంతాలపై దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, సౌదీ రాజధాని, దుబాయ్ ప్రాంతాలపై కూడా దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

కాగా ఈ యుద్ధం మూడో రోజులోకి ప్రవేశించింది. జనసాంద్రత అధికంగా ఉన్న నగర ప్రాంతాల్లో పౌరుల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఆసుపత్రులు వంటి కీలక మౌలిక సదుపాయాలు లక్ష్యంగా మారడం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ప్రతిస్పందనలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గాయాల సంఖ్యపై అధికారిక స్పష్టత లేకపోయినా, పరిస్థితి మరింత విషమించే అవకాశముందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

Advertisement
Advertisement