త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US Submarine Sinks Iranian Warship | భారత్ నుంచి వెళ్తుండగా ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి.. హిందూ మహాసముద్రంలో 80 మంది జలసమాధి

శనివారం ప్రారంభమైన ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త యుద్ధం (US-Israeli war) ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.. ఇరాన్ నావికాదళాన్ని పూర్తిగా తుడిచిపెట్టడమేనని పెంటగాన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

J

International | Published On Mar 4, 2026, 9.14 pm IST

US Submarine Sinks Iranian Warship | భారత్ నుంచి వెళ్తుండగా ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి.. హిందూ మహాసముద్రంలో 80 మంది జలసమాధి

సంక్షిప్త సారాంశం

భారత్‌లో జరిగిన 'మిలాన్ 2026' నావికా విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌక 'ఐఆర్ఐఎస్ దేనా' (IRIS Dena)ను అమెరికా జలాంతర్గామి టార్పెడోతో పేల్చేసింది. హిందూ మహాసముద్రంలో జరిగిన ఈ భీకర దాడిలో కనీసం 80 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఓ శత్రు నౌకను టార్పెడోతో ముంచేయడం ఇదే తొలిసారి అని పెంటగాన్ ప్రకటించింది. గల్ఫ్‌లో మండుతున్న యుద్ధాగ్ని ఇప్పుడు సముద్ర జలాలకు విస్తరించింది.

Advertisement

US Submarine Sinks Iranian Warship | త్రినేత్ర.న్యూస్ : ఇరాన్-అమెరికా (US-Iran War) మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు సముద్ర జలాలకు విస్తరించింది. భారత్‌లో నావికా విన్యాసాలు ముగించుకుని స్వదేశానికి పయనమైన ఇరాన్ యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి (US Submarine) అమాంతం సముద్రంలో ముంచేసింది. హిందూ మహాసముద్రంలో జరిగిన ఈ ఆకస్మిక దాడిలో కనీసం 80 మంది నావికులు జలసమాధి అయ్యారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

భారత్‌లో విన్యాసాలు ముగించుకుని వెళ్తుండగా..

మౌడ్జ్ క్లాస్ ఫ్రిగేట్‌కు చెందిన ఇరాన్ యుద్ధనౌక 'ఐఆర్ఐఎస్ దేనా' (IRIS Dena) నావికా విన్యాసాల కోసం కొన్ని వారాల క్రితం భారత్‌కు వచ్చింది. 2024లోనూ 'మిలాన్' (MILAN) విన్యాసాల్లో పాల్గొన్న ఈ నౌక, ఇప్పుడు 2026 ఎడిషన్‌లో పాల్గొని బుధవారం స్వదేశానికి బయలుదేరింది. మార్గమధ్యలో అమెరికా జలాంతర్గామి టార్పెడోతో ఈ నౌకపై విరుచుకుపడింది.

ఫిబ్రవరి 16న భారత నావికాదళం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో జరిగే అతిపెద్ద నావికా విన్యాసాలలో ఒకటైన 'మిలాన్ 2026' సముద్ర భద్రత, యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్, ఎయిర్ డిఫెన్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ వంటి కీలక ఆపరేషన్లపై దృష్టి సారించింది. ఇంతటి ముఖ్యమైన విన్యాసాల్లో పాల్గొని వెళ్తున్న నౌకను అమెరికా లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. ఇరాన్ నుంచి భారత్‌కు వస్తున్నప్పటి నుంచే అమెరికా జలాంతర్గామి ఈ నౌకను ట్రాక్ చేస్తూ ఉండొచ్చని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే తొలిసారి

ఈ దాడిని అమెరికా రక్షణ శాఖ మంత్రి (Defense Secretary) పీట్ హెగ్‌సెత్ ధృవీకరించారు. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా 'గ్లోబల్ రీచ్'కు ఇది నిదర్శనమన్నారు. "అంతర్జాతీయ జలాల్లో తాము సురక్షితంగా ఉన్నామని ఇరాన్ నౌక భావించింది. కానీ, మా సబ్‌మెరైన్ టార్పెడోతో దాన్ని ముంచేసింది" అని ఆయన విలేకరులకు తెలిపారు. ఈ దాడిని "సైలెంట్ డెత్" (నిశ్శబ్ద మరణం) గా అభివర్ణించిన ఆయన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా టార్పెడోతో ఒక శత్రు నౌకను ముంచేయడం ఇదే తొలిసారని, అప్పటిలాగే ఇప్పుడు కూడా గెలవడానికే పోరాడుతున్నామని స్పష్టం చేశారు.

https://x.com/DeptofWar/status/2029193757162139762

అబ్బురపరుస్తున్న టెక్నాలజీ..

ఈ దాడికి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ వీడియోను అమెరికా రక్షణ శాఖ విడుదల చేసింది. సబ్‌మెరైన్ పెరిస్కోప్ ద్వారా రికార్డ్ చేసిన ఈ విజువల్స్ ఇప్పుడు యుద్ధాలు చేసే విధానం, సమాచార భాగస్వామ్యంలో వచ్చిన మార్పులను తెలియజేస్తున్నాయి. అమెరికా జలాంతర్గామి పెరిస్కోప్ డెప్త్‌లో ఉన్నప్పటికీ ఇరాన్ నౌక దాన్ని పసిగట్టలేకపోవడం.. అమెరికా సబ్‌మెరైన్ల సాంకేతిక సామర్థ్యానికి అద్దం పడుతోంది.

148 మంది గల్లంతు.. శోధిస్తున్న శ్రీలంక

ఈ దాడి అనంతరం శ్రీలంక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నౌకలో ఉన్న 32 మంది సిబ్బందిని రక్షించినట్లు వారు తెలిపారు. అయితే, మరో 148 మంది నావికుల ఆచూకీ ఇంకా దొరకలేదని, వారు బతికి ఉండే అవకాశాలు తక్కువేనని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ప్రారంభమైన ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త యుద్ధం (US-Israeli war) ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.. ఇరాన్ నావికాదళాన్ని పూర్తిగా తుడిచిపెట్టడమేనని పెంటగాన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement
Advertisement