త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-Israel-Iran War | ఇరాన్‌తో యుద్ధం.. 4 లక్షల మంది ఇజ్రాయెల్ సైనికులకు పిలుపు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నాలుగో వారానికి చేరుకుంది. ఇరాన్‌కు అమెరికా 15 సూత్రాల శాంతి ఒప్పందాన్ని ప్రతిపాదించినప్పటికీ.. ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు మాత్రం ఆగడం లేదు.

J

International | Published On Mar 25, 2026, 6.33 pm IST

US-Israel-Iran War | ఇరాన్‌తో యుద్ధం.. 4 లక్షల మంది ఇజ్రాయెల్ సైనికులకు పిలుపు
Advertisement
  • ఇరాన్‌కు ట్రంప్ 15 సూత్రాల శాంతి ప్రతిపాదన
  • తిరస్కరించిన ఇరాన్
  • టెహ్రాన్‌లోని క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు
  • అల్బోర్జ్‌లో 18 మందికి గాయాలు
  • యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధనౌకపై క్రూయిజ్ క్షిపణితో దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటన
  • శాంతి ప్రతిపాదనల మధ్యే భీకర దాడులు
  • ఇరాన్ రాయబారితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ

US-Israel-Iran War | త్రినేత్ర.న్యూస్ : అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు వాషింగ్టన్ (అమెరికా).. టెహ్రాన్‌కు (ఇరాన్) 15 సూత్రాల శాంతి ఒప్పందాన్ని ప్రతిపాదించింది. ఇందులో భాగంగా.. ఇరాన్ అణు కార్యక్రమంపై ఆంక్షలు, ప్రాక్సీ గ్రూపులకు మద్దతు నిలిపివేత, హార్ముజ్ జలసంధి పునఃప్రారంభం వంటి షరతులు విధించింది. చర్చల కోసం నెల రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని సూచించింది. అయితే, తమ అణు కేంద్రాలపై రాజీపడే ప్రసక్తే లేదని, డొనాల్డ్ ట్రంప్ చర్చల ప్రతిపాదనను ఇరాన్ మిలిటరీ తిరస్కరించినట్లు తెలుస్తోంది.

మరోవైపు బుధవారం కూడా ఇరాన్, ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు దాడులు కొనసాగించాయి. టెహ్రాన్‌లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగా, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది.

4 లక్షల మంది రిజర్వ్ సైనికులకు ఇజ్రాయెల్ పిలుపు

ఇరాన్, హిజ్బుల్లాలతో కొనసాగుతున్న పోరు నేపథ్యంలో దాదాపు 4 లక్షల మంది రిజర్వ్ సైనికులను విధుల్లోకి తీసుకునేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అవసరాన్ని బట్టి దళాలను రంగంలోకి దించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిలిటరీ వెల్లడించింది.

టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ దాడులు

టెహ్రాన్‌లోని రెండు కీలక క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడులు చేశాయి. సముద్రంలో, భూమిపై వేగంగా దాడులు చేయగల లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణులను ఇక్కడ తయారు చేస్తున్నారని ఇజ్రాయెల్ తెలిపింది. మరోవైపు ఇరాన్‌లోని అల్బోర్జ్ ప్రావిన్స్‌లో ఓ నివాస భవనంపై జరిగిన క్షిపణి దాడిలో కనీసం 18 మంది గాయపడ్డారు. అయితే, ఇరాన్ క్షిపణి దాడుల వల్ల తమ విద్యుత్ మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.

యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌పై ఇరాన్ దాడి?

అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్' ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ (యుద్ధనౌక)పై తాము క్రూయిజ్ క్షిపణితో దాడి చేసినట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా బలగాల కదలికలను నిశితంగా గమనిస్తున్నామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ గలిబాఫ్ హెచ్చరించారు. "నెతన్యాహు భ్రమలకు అమెరికా సైనికులు బలవుతారు. మా భూమిని రక్షించుకునే మా సంకల్పాన్ని పరీక్షించవద్దు" అని ఆయన ఎక్స్ వేదికగా హెచ్చరించారు.

అగ్రనేతలతో భారత్ దౌత్యం

ఈ భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా అండర్ సెక్రటరీ ఆఫ్ వార్ ఎల్‌బ్రిడ్జ్ కోల్బీతో సమావేశమయ్యారు. అలాగే, ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయుల భద్రతకు సహకరిస్తున్న ఇరాన్ రాయబారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సముద్ర మార్గాల భద్రత గురించి ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, శ్రీలంక అధ్యక్షుడు ఫోన్‌లో చర్చించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

మధ్యవర్తిగా పాకిస్తాన్

అమెరికా శాంతి ప్రతిపాదనను పాకిస్తాన్ ద్వారా ఇరాన్‌కు చేరవేసినట్లు సమాచారం. ఈ దౌత్య ప్రయత్నాలను ఇరాన్ స్వాగతించినప్పటికీ, అమెరికాతో ఎలాంటి శాంతి చర్చలు ప్రారంభించలేదని ఇరాన్ రాయబారి స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ కూడా ఇరాన్‌తో శాంతి చర్చలను కొట్టిపారేశారు.

ఇరాక్‌లో ఏడుగురు సైనికుల మృతి

ఇరాక్‌లోని అన్బార్ ప్రావిన్స్‌లో ఇరాన్ అనుకూల మిలీషియాలకు చెందిన స్థావరంపై జరిగిన దాడిలో ఏడుగురు సైనికులు మరణించగా, 13 మంది గాయపడ్డారు. దీంతో ఇరాక్ ప్రభుత్వం అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది.

లెబనాన్‌పై దాడులు

దక్షిణ లెబనాన్‌లోని మజ్దల్జౌన్, ఖలీలా పట్టణాలతో పాటు బీరూట్‌లోని హిజ్బుల్లా కమాండ్ సెంటర్, గ్యాస్ స్టేషన్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ వాహనాలపై దాడి చేసినట్లు హిజ్బుల్లా ప్రకటించింది.

సౌదీలో డ్రోన్ల కూల్చివేత

రియాద్, తూర్పు ప్రాంతంపైకి దూసుకొచ్చిన రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

టర్కీకి ఇరాన్ ప్రశంసలు

ఇజ్రాయెల్ దూకుడును వ్యతిరేకిస్తున్న టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ దృఢమైన వైఖరిని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రశంసించారు. ఇస్లామిక్ ప్రపంచంలో అంకారా కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

ఇజ్రాయెల్ మంత్రి నిర్ బర్కత్ మాట్లాడుతూ.. ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందం కుదిరినా, దాని సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఉండాలని, ట్రంప్, నెతన్యాహు ఈ పరిస్థితిని సంయుక్తంగా, వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement