త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-Israel-Iran War | యుద్ధంలోకి హౌతీల ఎంట్రీ.. ‘బాబ్ ఎల్ మండబ్’ జలసంధిలో నౌకలే లక్ష్యం?

మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం మరింత తీవ్రమైంది. ఇప్పటివరకు 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. ఇరాన్, హౌతీల దాడులు గల్ఫ్ దేశాలకు విస్తరించాయి. ఈ ఉద్రిక్తతలు తగ్గించి శాంతిని నెలకొల్పేందుకు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ దేశాలు కీలక భేటీ కానున్నాయి. మరోవైపు, అమెరికా మెరైన్ల రాక, ఇజ్రాయెల్ క్రాస్-బోర్డర్ దాడులు గ్లోబల్ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

J

International | Published On Mar 29, 2026, 5.52 pm IST

US-Israel-Iran War | యుద్ధంలోకి హౌతీల ఎంట్రీ.. ‘బాబ్ ఎల్ మండబ్’ జలసంధిలో నౌకలే లక్ష్యం?
Advertisement
  • ప్రపంచ వాణిజ్యానికి తీవ్ర ముప్పు
  • పాకిస్థాన్ వేదికగా శాంతి యత్నాలు

US-Israel-Iran War | త్రినేత్ర.న్యూస్ : మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై వరుస దాడులకు పాల్పడుతుండగా, ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ దాడుల ప్రభావం ఇజ్రాయెల్‌తో పాటు పొరుగున ఉన్న గల్ఫ్ అరబ్ దేశాలకు కూడా విస్తరించింది. నెల రోజులుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటికే 3,000 మందికి పైగా మరణించారు.

ఈ యుద్ధంలోకి ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు అధికారికంగా ప్రవేశించారు. చాలా కాలం తర్వాత వారు ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలపైకి క్షిపణులను ప్రయోగించారు. ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం మేర సాగే ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్-మండబ్ జలసంధిలో నౌకలను వారు మళ్లీ లక్ష్యంగా చేసుకుంటే, గ్లోబల్ సప్లై చైన్‌కు భారీ విఘాతం కలుగుతుంది.

కీలకమైన హార్ముజ్ జలసంధి పరిసరాల్లో జరుగుతున్న దాడుల వల్ల అంతర్జాతీయంగా ఆయిల్, సహజ వాయువు సరఫరాకు ముప్పు ఏర్పడింది. ఎరువుల కొరత తలెత్తడంతో పాటు, విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది.

పాకిస్థాన్‌లో ప్రాంతీయ దేశాల సమావేశం

యుద్ధాన్ని ఆపేందుకు, ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రాంతీయ దేశాలు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో సమావేశం కానున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ ఈ భేటీకి ఆతిథ్యం ఇస్తోంది. సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ దేశాల విదేశాంగ మంత్రులు ఇందులో పాల్గొంటున్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో ఉద్రిక్తతల తగ్గింపుపై సుదీర్ఘంగా చర్చించారు.

ఇజ్రాయెల్ దాడులు.. అల్ అరబీ ఆఫీస్ ధ్వంసం

హార్ముజ్ జలసంధికి సమీపంలో ఉన్న ఇరాన్ పోర్ట్ సిటీ బందర్ ఖమీర్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. టెహ్రాన్‌ లోని ఇరాన్ సైనిక స్థావరాలతో పాటు పలు కీలక మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్ తాజాగా దాడులు పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఈ దాడుల్లో టెహ్రాన్‌లోని ఖతార్‌కు చెందిన 'అల్ అరబీ' న్యూస్ ఛానల్ ఆఫీస్ ఉన్న భవనం కూడా క్షిపణి దాడికి గురై పూర్తిగా ధ్వంసమైంది. ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయాయి.

గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకారం.. అల్యూమినియం ప్లాంట్లపై దాడులు

ఇరాన్ కూడా తన దాడులను ఉధృతం చేసింది. దక్షిణ ఇజ్రాయెల్ వైపు ఇరాన్ తాజా క్షిపణులను ప్రయోగించగా, వాటిని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది. మరోవైపు, అమెరికా సైన్యంతో సంబంధం ఉన్న పరిశ్రమలే లక్ష్యంగా బహ్రెయిన్, యూఏఈ దేశాల్లోని రెండు భారీ అల్యూమినియం ప్లాంట్లపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించాయి. బహ్రెయిన్‌లోని ఆల్బా ప్లాంట్‌లో ఇద్దరు ఉద్యోగులు గాయపడ్డారు. దీంతో యూఏఈ, కువైట్, బహ్రెయిన్ దేశాలు తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేశాయి.

అమెరికా రహస్య గ్రౌండ్ ఆపరేషన్ ప్లాన్?

మధ్యప్రాచ్యంలో తన ఉనికిని చాటుకునేందుకు అమెరికా 'యూఎస్ఎస్ త్రిపోలి' ద్వారా సుమారు 3,500 మంది మెరైన్ సైనికులను మోహరించింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 11,000 కు పైగా టార్గెట్లపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.

అమెరికా బహిరంగంగా శాంతి చర్చల గురించి మభ్యపెడుతూనే.. రహస్యంగా ఇరాన్‌పై గ్రౌండ్ అటాక్ చేయడానికి కుట్ర పన్నుతోందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘేర్ గాలిబాఫ్ ఆరోపించారు. ఈ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి స్పష్టం చేశారు. తమకు జరిగిన భారీ నష్టానికి పరిహారం చెల్లించాలని, హార్ముజ్ జలసంధిపై తమ నియంత్రణను అంగీకరించాలని, ఆంక్షలు ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.

లెబనాన్‌లోకి ఇజ్రాయెల్: ఇజ్రాయెల్ సైన్యం సిరియా సరిహద్దుల (మౌంట్ హెర్మోన్) మీదుగా దక్షిణ లెబనాన్‌లోని 'షెబా ఫార్మ్స్' ప్రాంతంలోకి క్రాస్-బోర్డర్ గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ పోరులో ఒక ఇజ్రాయెల్ సైనికుడు మృతి చెందాడు.

ఒమన్ పోర్ట్‌పై దాడి: ఒమన్‌లోని సలాలా పోర్ట్‌పై గుర్తుతెలియని డ్రోన్ దాడి జరగగా.. డానిష్ షిప్పింగ్ దిగ్గజం 'మార్స్క్' అక్కడ తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

ఇజ్రాయెల్‌లో నిరసనలు: యుద్ధాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ తో పాటు పలు నగరాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.

తైవాన్ ఎల్పీజీ నిర్ణయం : ఇంధన సంక్షోభం నేపథ్యంలో తైవాన్ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ఎల్పీజీ ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచాలని నిర్ణయించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement