త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-Israel-Iran War | కాల్పుల విరమణకు ఇరాన్ ‘నో’.. భగ్గుమంటున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం 18వ రోజుకు చేరుకుంది. హార్ముజ్ జలసంధిలో నౌకల మార్పిడిపై ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కీలక నేతలు లక్ష్యంగా కాగా, కాల్పుల విరమణ ప్రతిపాదనలకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ససేమిరా అన్నారు.

J

International | Published On Mar 17, 2026, 9.15 pm IST

US-Israel-Iran War | కాల్పుల విరమణకు ఇరాన్ ‘నో’.. భగ్గుమంటున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం
Advertisement
  • ఇరాన్ భద్రతా చీఫ్‌ హతం?
  • ధృవీకరించని ఇరాన్
  • నౌకల మార్పిడిని ఖండించిన భారత్

US-Israel-Iran War | త్రినేత్ర.న్యూస్ : మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం 18వ రోజుకు చేరుకుంది. గల్ఫ్ దేశాలైన కువైట్, బహ్రెయిన్‌లపైనా ఇరాన్ దాడులకు దిగడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొద్ది వారాల్లోనే ఈ యుద్ధం ముగుస్తుందని, అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని వైట్‌హౌస్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ ధీమా వ్యక్తం చేశారు.

నౌకల మార్పిడి వార్తలను ఖండించిన భారత్

అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా తమ నౌకల సురక్షిత ప్రయాణం కోసం ఇరాన్‌తో 'నౌకల మార్పిడి'కి సంబంధించిన ఎలాంటి చర్చలు జరపలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇరాన్ పట్టుకున్న మూడు ట్యాంకర్లను తిరిగి ఇస్తేనే భారతీయ నౌకలకు రక్షణ కల్పిస్తామని ఇరాన్ షరతు పెట్టినట్లు వచ్చిన రాయిటర్స్ కథనాలను భారత్ కొట్టిపారేసింది. అయితే, హర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలను సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ఇరాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.

కాల్పుల విరమణకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ 'నో'

అమెరికాతో ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, కాల్పుల విరమణ పాటించాలని రెండు మధ్యవర్తిత్వ దేశాల ద్వారా వచ్చిన ప్రతిపాదనలను ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతుల్లా మొజ్తబా ఖమేనీ తీవ్రంగా తిరస్కరించారు. "శాంతికి ఇది సరైన సమయం కాదు" అని ఆయన కుండబద్దలు కొట్టారు. అమెరికా, ఇజ్రాయెల్‌లను ఓడించాల్సిందేనని, వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని తన తొలి విదేశాంగ విధాన సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలతో దక్షిణ ఇరాన్‌లో 55 మందిని ఇరాన్ భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి.

ఇజ్రాయెల్ దాడులు: అలీ లారిజానీ, సులేమానీలే లక్ష్యం

ఇరాన్ భద్రతా చీఫ్, జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించారు. అయితే, ఇరాన్ అధికార యంత్రాంగం దీనిని ధృవీకరించలేదు. పైగా, ఈ దాడుల వార్తల నడుమ లారిజానీ స్వయంగా రాసిన ఒక లేఖను ఇరాన్ మీడియా విడుదల చేసింది. ఐఆర్ఐఎస్ డెనా నౌకలో అమరులైన వారిని స్మరించుకుంటూ లారిజానీ ఈ లేఖ రాశారు. ఇదిలా ఉండగా, ఇరాన్‌కు చెందిన బాసిజ్ పారామిలటరీ ఫోర్స్ కమాండర్ గులాంరెజా సులేమానీని కూడా రాత్రికి రాత్రి జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది.

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు.. విస్తరిస్తున్న యుద్ధం

ఇజ్రాయెల్ వైపు ఇరాన్ భారీగా క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా సైరన్లు మోగగా, రక్షణ వ్యవస్థలు ఆ క్షిపణులను అడ్డుకునే ప్రయత్నం చేశాయి.

లెబనాన్: దక్షిణ లెబనాన్‌లోని నబాతియేలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఐదుగురు లెబనీస్ సైనికులు గాయపడ్డారు. లెబనాన్‌లో ఇప్పటివరకు 880 మందికి పైగా మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

ఇరాక్: బాగ్దాద్ ఉత్తర ప్రాంతంలోని ఇరాకీ పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ స్థావరాలపై కూడా దాడులు జరిగాయి. యుద్ధం మధ్యప్రాచ్యం అంతటా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం

ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందని యూరోపియన్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ కజా కల్లాస్ హెచ్చరించారు. ఇంధన ధరల పెరుగుదల, హర్ముజ్ జలసంధిలో అంతరాయాల వల్ల తీవ్ర సంక్షోభం రాకముందే ఐరోపా దేశాలు సిద్ధంగా ఉండాలని గ్రీస్ ప్రధాని కూడా సూచించారు. మరోవైపు, టెహ్రాన్‌లోని ఎవిన్ జైలుపై ఇజ్రాయెల్ చేసిన దాడిని 'యుద్ధ నేరం'గా ఐక్యరాజ్యసమితి విచారణ కమిటీ అభివర్ణించింది. ఈ దాడిలో ఒక చిన్నారి, ఎనిమిది మంది మహిళలు సహా కనీసం 80 మంది ప్రాణాలు కోల్పోయినట్లు యూఎన్ ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement