త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-Israel-Iran War | నీ పప్పులిక ఉడుకవు ట్రంప్.. ఇరాన్ వార్నింగ్

ఇరాన్‌పై దాడులను మరింత తీవ్రం చేస్తామని, రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్‌ను 'శిలాయుగం'లోకి నెట్టేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో యుద్ధం ముగుస్తుందన్న ఆశలు ఆవిరవగా.. ప్రపంచ మార్కెట్లలో తీవ్ర ఆందోళన నెలకొంది.

J

International | Published On Apr 2, 2026, 6.05 pm IST

US-Israel-Iran War | నీ పప్పులిక ఉడుకవు ట్రంప్.. ఇరాన్ వార్నింగ్

సంక్షిప్త సారాంశం

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం త్వరలో ముగుస్తుందన్న ఆశలను అడియాసలు చేస్తూ.. దాడులను మరింత ఉధృతం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై ఇరాన్ దీటుగా బదులిచ్చింది. "మా సత్తా ఏంటో మీకు తెలియదు" అంటూ అమెరికాను హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్-హిజ్బొల్లా మధ్య దాడులు కొనసాగుతున్నాయి. టెహ్రాన్‌లో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తెరిపించేందుకు బ్రిటన్ 35 దేశాలతో చర్చలు జరుపుతుండగా.. శాంతి చర్చలకు పాకిస్థాన్, రష్యా, చైనా దేశాలు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి.

Advertisement
  • ఉద్రిక్తతలను పెంచిన ట్రంప్ వ్యాఖ్యలు
  • పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు మేము రెడీ
  • ప్రకటించిన రష్యా, చైనా
  • రగులుతున్న పశ్చిమాసియా

US-Israel-Iran War | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. దాడులు ఆపుతారని ఆశించిన మదుపర్లకు నిరాశే మిగిలింది. ఫలితంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలగా, చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. బంగారం ధరలు సైతం భారీగా పతనమయ్యాయి.

ఇరాన్‌ను శిలాయుగంలోకి నెట్టేస్తాం: డొనాల్డ్ ట్రంప్

బుధవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్.. ఇరాన్‌పై విరుచుకుపడ్డారు. "రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్‌పై మరింత కఠినంగా దాడులు చేయబోతున్నాం. వారిని వారు ఉండాల్సిన శిలాయుగంలోకి నెట్టేస్తాం. మా సైనిక లక్ష్యాలు దాదాపు నెరవేరాయి" అని ఆయన ప్రకటించారు. ఇరాన్ తన షరతులకు అంగీకరించకపోతే ఇంధన, చమురు మౌలిక సదుపాయాలపై దాడులు తప్పవని పరోక్షంగా హెచ్చరించారు. తన యుద్ధానికి మద్దతు ఇవ్వని నాటో మిత్రదేశాలపై కూడా ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

"మీకేం తెలియదు".. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సైన్యం తీవ్ర స్థాయిలో మండిపడింది. "అమెరికాకు శాశ్వత అవమానం, లొంగుబాటు ఎదురయ్యే వరకు ఈ యుద్ధం కొనసాగుతుంది" అని హెచ్చరించింది. ఇరాన్ వ్యూహాత్మక సామర్థ్యాల గురించి అమెరికాకు ఏమాత్రం అవగాహన లేదని ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫాఘరి స్పష్టం చేశారు. యుద్ధం, చర్చలు, కాల్పుల విరమణ అనే విషవలయాన్ని తాము ఇక ఎంతమాత్రం సహించబోమని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

క్షీణిస్తున్న పరిస్థితులు.. భారీ ప్రాణ, ఆస్తి నష్టం

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్, లెబనాన్ దేశాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది.

టెహ్రాన్‌లో విధ్వంసం: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా టెహ్రాన్‌లో సుమారు 33,000 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలపై ఇజ్రాయెల్ భారీ దాడులు చేసింది.

మాజీ మంత్రికి గాయాలు: బుధవారం జరిగిన వైమానిక దాడిలో ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి కమల్ ఖరాజీ తీవ్రంగా గాయపడగా, ఆయన భార్య మరణించినట్లు సమాచారం.

శతాబ్దం నాటి వైద్య సంస్థపై దాడి: 1920లో స్థాపించిన చరిత్రాత్మక పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇరాన్‌పై దాడులు జరిగాయని, ఇది జెనీవా ఒప్పందాల ఉల్లంఘనేనని ఇరాన్ ఆరోగ్య శాఖ ఆరోపించింది.

స్టీల్ ఫ్యాక్టరీ ధ్వంసం: గల్ఫ్ దేశాల్లోని అమెరికా అనుబంధ స్టీల్, అల్యూమినియం కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది. మరోవైపు ఇరాన్‌లోని ఖుజెస్తాన్ స్టీల్ కంపెనీ కూడా దాడికి గురైంది. దీన్ని బాగుచేయడానికి ఏడాది సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

హిజ్బొల్లా కమాండర్ హతం: బీరుట్‌లో జరిగిన ఇజ్రాయెల్ దాడిలో హెజ్బొల్లా సదరన్ ఫ్రంట్ చీఫ్ హజ్ యూసుఫ్ ఇస్మాయిల్ హషేమ్ మరణించాడు. మరోవైపు హిజ్బొల్లా ఉత్తర ఇజ్రాయెల్‌పై రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

శాంతి చర్చలకు ప్రపంచ దేశాల యత్నాలు

పాకిస్థాన్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది.

బ్రిటన్: అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి'ని తిరిగి తెరిపించేందుకు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ సహా 35 దేశాలతో బ్రిటన్ వర్చువల్ సమావేశాన్ని నిర్వహిస్తోంది. అయితే ఈ చర్చల్లో అమెరికా పాల్గొనడం లేదు.

రష్యా, చైనా: పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. యుద్ధం వల్ల ఏ సమస్యా పరిష్కారం కాదని, తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని చైనా విదేశాంగ శాఖ సూచించింది.

పశ్చిమాసియాలో రోజురోజుకూ విస్తరిస్తున్న ఈ ఉద్రిక్తతలు.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను, ప్రపంచ ఇంధన సరఫరాను తీవ్ర సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం కనిపిస్తోంది.

Advertisement
Advertisement