త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-India Trade Deal | మోదీ-ట్రంప్ ఫోన్ కాల్.. భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్ తగ్గింపు..

US-India Trade Deal | భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అనంతరం, భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్ తగ్గింపును ప్రకటించింది.

S

International | Published On Feb 3, 2026, 7.42 am IST

US-India Trade Deal | మోదీ-ట్రంప్ ఫోన్ కాల్.. భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్ తగ్గింపు..
Advertisement

US-India Trade Deal | భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అనంతరం, భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్ తగ్గింపును ప్రకటించింది. కొత్త ట్రేడ్ డీల్ ప్రకారం, భారత దిగుమతులపై ఉన్న ప‌రస్ప‌ర ( రెసిప్రొకల్) టారిఫ్‌ను 25 నుంచి 18 శాతానికి తక్షణమే తగ్గిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. ఈ టారిఫ్ తగ్గింపు మోదీ అభ్యర్థన మేరకే అమలులోకి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో, భారత్ కూడా అమెరికా ఎగుమతులపై ఉన్న టారిఫ్‌లు, నాన్-టారిఫ్ ఆంక్షలను క్రమంగా సున్నా స్థాయికి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చిందని ట్రంప్ తెలిపారు.

ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోళ్లు నిలిపివేత‌..

ట్రంప్ ప్రకటన ప్రకారం, భారత్ రాబోయే సంవత్సరాల్లో అమెరికా నుంచి పెద్ద ఎత్తున కొనుగోళ్లు పెంచనుంది. ఇంధనం, సాంకేతిక పరికరాలు, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు తదితర రంగాల్లో 500 బిలియన్ డాలర్లకు మించిన విలువైన ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకునే డీల్ కుదుర్చుకున్నట్లు ట్రంప్ చెప్పారు. దీనిని ఆయన BUY AMERICAN విధానానికి భారత్ మద్దతుగా అభివర్ణించారు. ఇదే సమయంలో, రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసి, అమెరికా (అవసరమైతే వెనిజువెలా) నుంచి మరింత చమురు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని ట్రంప్ తెలిపారు. ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు తగ్గించడంలో సహాయపడుతుందని, యుద్ధ తీవ్రతను తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

టారిఫ్ త‌గ్గింపు త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి..

ఈ తాజా నిర్ణయానికి ముందు, భారత ఉత్పత్తులపై అమెరికా అత్యధిక టారిఫ్‌లు విధించింది. గత ఏడాది లిబరేషన్ డే డ్యూటీ పేరిట 25 శాతం టారిఫ్ విధించగా, రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా మరో 25 శాతం అదనపు డ్యూటీ కూడా విధించడంతో భారత ఎగుమతిదారులపై భారీ భారం పడింది. మోదీని తన అత్యంత సన్నిహిత మిత్రుడుగా పేర్కొన్న ట్రంప్, భారత్‌తో మా సంబంధాలు మరింత బలపడతాయి. మోదీ, నేను - మేమిద్దరం పనులు చేసి చూపే నాయకులం, అంటూ పేర్కొన్నారు. ఈ ట్రేడ్ డీల్‌తో భారత్-అమెరికా ఆర్థిక సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశించనున్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ఈ డీల్ కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త ఉత్ప‌త్తుల‌పై అమెరికా వ‌సూలు చేస్తున్న 25 శాతం ప‌న్ను 18 శాతానికి త‌గ్గింది. ఇది త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి వ‌స్తుంద‌ని ట్రంప్ తెలిపారు. అయితే ర‌ష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చ‌మురు కార‌ణంగా భార‌త్‌పై విధిస్తున్న మ‌రో 25 శాతం అద‌న‌పు ప‌న్ను విష‌యంలో స్ప‌ష్ట‌త రాలేదు. కానీ ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోళ్లను భార‌త్‌ నిలిపి వేసిన మరుక్ష‌ణ‌మే ఆ 25 శాతం టారిఫ్ ను కూడా ఎత్తేస్తామ‌ని ట్రంప్ తెలిపిన‌ట్లు స‌మాచారం. ఇక రానున్న రోజుల్లో భార‌త్ అమెరికా నుంచి మొత్తం 500 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన ఉత్ప‌త్తుల‌ను ఈ ట్రేడ్ డీల్ లో భాగంగా దిగుమ‌తి చేసుకోనుంది. అమెరికా ఉత్ప‌త్తుల‌పై రానున్న రోజుల్లో భార‌త్ వ‌సూలు చేస్తున్న ప‌న్ను 0 శాతానికి చేరుకోవాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement