త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sotheby | రూ.482 కోట్లకు అమ్ముడైన డైనోసర్ అస్థిపంజరం.. ప్రపంచ రికార్డు సృష్టించిన గ‌స్‌..!

Sotheby | ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైనోసార్ శిలాజంగా 'గస్' పేరుగాంచిన టైరనోసారస్ రెక్స్ (టీ-రెక్స్) అస్థిపంజరం స‌రికొత్త రికార్డు నెలకొల్పింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించిన సోత్‌బేస్ వేలంలో ఈ అరుదైన శిలాజం ఏకంగా 50.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.482 కోట్లు) అమ్ముడుపోయింది.

P

International | Published On Jul 15, 2026, 8.00 pm IST

Sotheby | రూ.482 కోట్లకు అమ్ముడైన డైనోసర్ అస్థిపంజరం.. ప్రపంచ రికార్డు సృష్టించిన గ‌స్‌..!
Advertisement

Sotheby | ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైనోసార్ శిలాజంగా 'గస్' పేరుగాంచిన టైరనోసారస్ రెక్స్ (టీ-రెక్స్) అస్థిపంజరం స‌రికొత్త రికార్డు నెలకొల్పింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించిన సోత్‌బేస్ వేలంలో ఈ అరుదైన శిలాజం ఏకంగా 50.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.482 కోట్లు) అమ్ముడుపోయింది. దీంతో ఇప్పటివరకు అత్యధిక ధరకు అమ్ముడైన డైనోసార్ శిలాజంగా 'గస్' చరిత్రలో నిలిచింది. మంగళవారం జరిగిన ఈ వేలం ఉత్కంఠభరితంగా సాగింది. సుమారు 10 నిమిషాల పాటు ఏడుగురు బిడ్డర్లు పోటీపడగా.. చివరకు గుర్తుతెలియని వ్యక్తి ఈ అస్థిపంజరాన్ని సొంతం చేసుకున్నారు.

'గస్' అస్థిపంజరం 2021లో అమెరికాలోని సౌత్ డకోటా రాష్ట్రంలోని ఓ పశువుల ఫారంలో వెలుగులోకి వచ్చింది. తవ్వకాల్లో మొత్తం 183 శిలాజ ఎముకలు మాత్రమే లభించాయి. ఇవి డైనోసార్ శరీరంలో దాదాపు 63 శాతం భాగాన్ని సూచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సుమారు 38 అడుగుల పొడవున్న ఈ టీ-రెక్స్ 6.6 కోట్ల నుంచి 7.2 కోట్ల సంవత్సరాల కింద‌ట భూమిపై సంచరించినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంతకుముందు 2024లో 'అపెక్స్' అనే స్టెగోసారస్ అస్థిపంజరం 44.6 మిలియన్ డాలర్లకు అమ్ముడై అత్యధిక ధర పలికిన శిలాజంగా రికార్డు సృష్టించింది. తాజాగా 'గస్' ఆ రికార్డును బద్దలు కొట్టింది.

అమెరికా చట్టాల ప్రకారం.. ప్రైవేట్ భూముల్లో లభించే శిలాజాలపై భూమి యజమానికే హక్కులు ఉంటాయి. దాంతో వాటిని బహిరంగ వేలాల్లో విక్రయించడానికి చట్టపరమైన అడ్డంకులేమీ ఉండవు. అయితే, ఇలాంటి అరుదైన శిలాజాలు వ్యక్తిగత సేకరణల్లోకి వెళ్లడం సరైన పరిణామం కాదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి మ్యూజియంలు, పరిశోధనా సంస్థల్లో ఉంటే శాస్త్రీయ అధ్యయనాలకు ఉపయోగపడతాయని, ప్రైవేట్ కలెక్షన్లలోకి వెళ్లడం వల్ల భవిష్యత్ పరిశోధనలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. కాగా, 'గస్'ను కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను నిర్వాహకులు వెల్లడించలేదు. ఈ అరుదైన అస్థిపంజరాన్ని భవిష్యత్తులో ఎక్కడ ప్రదర్శించనున్నారన్న విషయాన్ని కూడా గోప్యంగానే ఉంచారు.

Advertisement

తాజావార్తలు

Advertisement