త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran-Us Conflict | ఇరాన్‌ సైనిక విమానాలకు పాక్‌ ఆశ్రయం.. అమెరికా మీడియాలో కథనాలు..!

Iran-Us Conflict | అమెరికా-ఇరాన్‌ యుద్ధ ఉద్రిక్తతల సమయంలో ఇరాన్‌కు చెందిన సైనిక విమానాలను పాక్‌ తన వైమానిక స్థావారాల్లో నిలిపేందుకు అనుమతించిందని అమెరికా మీడియా సంచలన కథనం ప్రసారం చేసింది. అమెరికా వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారని ఆ కథనంలో వెల్లడించింది.

P

International | Published On May 12, 2026, 7.22 am IST

Iran-Us Conflict | ఇరాన్‌ సైనిక విమానాలకు పాక్‌ ఆశ్రయం.. అమెరికా మీడియాలో కథనాలు..!
Advertisement

Iran-Us Conflict | అమెరికా-ఇరాన్‌ యుద్ధ ఉద్రిక్తతల సమయంలో ఇరాన్‌కు చెందిన సైనిక విమానాలను పాక్‌ తన వైమానిక స్థావారాల్లో నిలిపేందుకు అనుమతించిందని అమెరికా మీడియా సంచలన కథనం ప్రసారం చేసింది. అమెరికా వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారని ఆ కథనంలో వెల్లడించింది. అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధ విరమణ ప్రకటన వెలువడిన వెంటనే ఇరాన్‌ పలు విమానాలను, వాటిలో నిఘా, గూఢచారి విమానాన్ని కూడా పాకిస్థాన్‌లోని నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌కు తరలించినట్లు సీబీఎస్‌ న్యూస్‌ పేర్కొంది. అలాగే అమెరికా దాడుల భయంతో ఇరాన్‌కు చెందిన పౌర విమానాలను పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్‌లో నిలిపినట్లు కూడా కథనంలో తెలిపింది.

ఈ వార్తలపై స్పందించిన అమెరికా రిపబ్లికన్‌ సెనేటర్‌ లిండ్సే గ్రాహం.. ఈ కథనం నిజమైతే మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌ పాత్రను పూర్తిగా పునర్విమర్శించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌పై పాకిస్తాన్‌ రక్షణ అధికారుల గత వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుంటే ఈ ఆరోపణలు నిజమే కావచ్చని ఆయన ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌కు సంబంధించిన ఆరోపణలను పాక్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారి ఖండించారు. ఆ వైమానిక స్థావరం నగర మధ్యలో ఉండడంతో అక్కడ పెద్దఎత్తున విమానాలను దాచిపెట్టడం సాధ్యం కాదని సీబీఎస్‌ న్యూస్‌కు తెలిపారు. ఇక ఆఫ్ఘనిస్తాన్‌ పౌర విమానయాన విభాగానికి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. యుద్ధం ప్రారంభానికి కొద్దిసేపటి ముందు ఇరాన్‌కు చెందిన మహాన్‌ ఎయిర్‌ విమానం కాబూల్‌లో దిగిందని, ఇరాన్‌ గగనతలం మూసివేసిన తర్వాత అక్కడే నిలిపి ఉంచినట్లు వెల్లడించారు.

అనంతరం పాక్‌ ఆఫ్ఘనిస్తాన్‌పై దాడులు ప్రారంభించడంతో ఆ విమానాన్ని ఇరాన్‌ సరిహద్దుకు సమీపంలోని హెరాత్‌ విమానాశ్రయానికి తరలించినట్లు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న ఏకైక ఇరాన్‌ విమానం అదే అని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంగా పాక్‌ సైనిక అవసరాల కోసం చైనాపై ఆధారపడటం గణనీయంగా పెరిగిందని స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనాన్ని ఉటంకిస్తూ సీబీఎస్‌ కథనం పేర్కొంది. 2020-2024 మధ్య కాలంలో పాక్‌కు సరఫరా చేసిన ప్రధాన ఆయుధాల్లో దాదాపు 80 శాతం చైనావేనని తెలిపింది. ఒకవైపు మధ్యవర్తిగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు ఇరాన్‌, చైనాతో సంబంధాలు దెబ్బతినకుండా పాక్‌ సమతుల్య విధానాన్ని అనుసరిస్తోందని సీబీఎస్‌ విశ్లేషించింది.

Advertisement
Advertisement